బంగారం ధరలు కుప్పకూలే సమయం వచ్చేసింది.. ఇప్పుడు పసిడి కొనుగోలుపై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కీలక సూచన..
అంతర్జాతీయ ఆర్థిక సమీకరణాలు, ద్రవ్య విధానాల కదలికల నడుమ బంగారం ధరలు తీవ్ర మార్పులకు లోనవుతున్నాయి. స్థిరంగా బలపడుతున్న అమెరికన్ డాలర్, క్రమంగా పెరుగుతున్న యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పసిడి మార్కెట్ మీద తీవ్రస్థాయి తగ్గుదల ఒత్తిడిని సృష్టిస్తున్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తన తాజా నివేదిక ద్వారా హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా Gold మార్కెట్లో ప్రస్తుతం వ్యక్తమవుతున్న ధరల స్థిరీకరణ ప్రక్రియ శాశ్వతమైనది కాదని.. ఇది కేవలం ఒక తాత్కాలిక సాంకేతిక విరామం మాత్రమేనని స్పష్టం చేసింది.
ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా ధరలు క్షీణించిన ప్రతీసారి ఇన్వెస్టర్ల నుంచి దిగువ స్థాయిలో లభించిన కొనుగోళ్ల మద్దతు పసిడికి ఆసరాగా నిలిచింది. లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) PM ముగింపు వివరాల ప్రకారం.. గత వారంలో పసిడి ధర 1.8 శాతం మేర పుంజుకుని ఔన్సుకు 4,067 డాలర్ల మార్కును చేరుకుంది. తద్వారా ఈ ఏడాది ఆరంభం నుండి ఎదుర్కొన్న 6.9 శాతానికి పైగా క్షీణత నుండి కొంత ఉపశమనం పొంది.. 4,000 డాలర్ల స్థాయిని తిరిగి దక్కించుకుంది.

అయితే ఈ Gold పెరుగుదలను మార్కెట్ శాశ్వత తిరోగమనంగా భావించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. సాంకేతిక విశ్లేషణ ప్రకారం జనవరి నుండి పసిడి అనుసరిస్తున్న ప్రతికూల ధోరణిలో ఇది ఒక సాధారణ తాత్కాలిక సర్దుబాటు మాత్రమే. ఒకవేళ ఇక్కడి నుండి అమ్మకాల ఒత్తిడి పెరిగితే.. తదుపరి కీలక సాంకేతిక మద్దతు శ్రేణి ఔన్సుకు 3,857 డాలర్ల నుండి 3,887 డాలర్ల వద్ద లభించే అవకాశాలున్నాయి.
ఈక్విటీలు, బంగారం వంటి సాధనాలపై అమెరికా వాస్తవ బాండ్ రాబడులు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సుదీర్ఘకాలం పాటు గరిష్ట స్థాయిల్లోనే ఉంచవచ్చనే అంచనాలు పుంజుకోవడంతో 10 సంవత్సరాల ట్రెజరీ ఈల్డ్స్ 2.44 శాతంగా ఉన్న తమ 2025 నాటి గరిష్ట స్థాయిని అధిగమించేందుకు సిద్ధమవుతున్నాయి.
బాండ్ రాబడులు ఈ కీలక నిరోధ స్థాయిని దాటి ముందుకు సాగితే.. అంతర్జాతీయ స్థూల ఆర్థిక ధోరణి పూర్తిగా స్థిరత్వం నుండి పెరుగుదల వైపు మళ్లుతుంది. వడ్డీ చెల్లించని పెట్టుబడి సాధనమైన బంగారంతో పోలిస్తే.. అమెరికన్ ట్రెజరీ బాండ్లు, డాలర్ ఇన్వెస్టర్లకు అధిక సురక్షిత రాబడిని అందిస్తాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు పసిడి నుండి తమ నిధులను బాండ్ల వైపు మళ్లించే ఆస్కారం పెరిగి.. ఈక్విటీ మార్కెట్లతో పాటు బంగారం ధరలపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది.
యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తదుపరి సమావేశంలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతుందని సుమారు 70 శాతం మంది మార్కెట్ భాగస్వాములు అంచనా వేస్తున్నప్పటికీ, విధాన నిర్ణేతల వ్యాఖ్యలు అత్యంత కీలకంగా మారాయి. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తన సమీక్షానంతర విలేకరుల సమావేశంలో ద్రవ్యోల్బణ నివారణే ధ్యేయంగా వడ్డీ రేట్లను ఎక్కువ కాలం పెంచి ఉంచుతామని కఠిన సంకేతాలిస్తే.. అది డాలర్కు మరిన్ని రెక్కలు తొడుగుతుంది.అలాగే ఫెడ్ ప్రాధాన్యతనిచ్చే వ్యక్తిగత వినియోగ వ్యయాల (PCE) ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాల కంటే అధికంగా నమోదైతే.. అది వడ్డీ రేట్ల తగ్గింపు అవకాశాలను మరింత వెనక్కి నెడుతుంది. ఈ రెండు ప్రతికూలతలు ఒకేసారి సంభవిస్తే ట్రెజరీ ఈల్డ్స్ మరింత వేగంగా పెరిగి.. యూఎస్ డాలర్ అపారమైన బలాన్ని సంతరించుకుంటుంది. తద్వారా పసిడిపై తగ్గుదల ఒత్తిడి తీవ్రతరమవుతుంది.
సుదీర్ఘకాల దృక్కోణంలో చూస్తే.. భౌగోళిక-రాజకీయ అనిశ్చితులు, ఆర్థిక అస్థిరతల నుండి రక్షణగా బంగారానికి ఉన్న సురక్షిత పెట్టుబడి డిమాండ్ చెక్కుచెదరకుండా ఉంది. అయినప్పటికీ, స్వల్పకాలంలో మాత్రం డాలర్ బలం, బాండ్ రాబడుల వంటి తీవ్రమైన స్థూల ఆర్థిక ఆందోళనలే మార్కెట్లను శాసిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత ధరల స్థిరీకరణను ఆసరాగా చేసుకుని ఆవేశంతో కొనుగోళ్లు జరపకుండా.. ఫెడ్ విధాన ప్రకటనలు, సాంకేతిక మద్దతు స్థాయిలను పరిశీలించిన తర్వాతే ఇన్వెస్టర్లు అడుగులు వేయడం శ్రేయస్కరమని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ స్పష్టం చేస్తోంది.


Click it and Unblock the Notifications
