Stock Market: దలాల్ స్ట్రీట్ లో బుల్ జోరు.. లాభాల్లో ముగిసిన సూచీలు.. మెరిసిన ఐటీ, మెటల్ స్టాక్స్
Market closing Bell: ఉదయం లాభాల్లో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు చివరికి మంచి లాభల్లోనే ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, మెటల్ స్టాక్స్ జోరు కారణంగా వారం ప్రారంభంలో భారత మార్కెట్లు వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్లోనూ పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. మార్కెట్ బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడగా, మరో కీలక సూచీ నిఫ్టీ-50.. 131 పాయింట్ల మేర పెరిగి ముగింపులో 15800 మార్క్ పైన స్థిరపడింది. ఇదే సమయంలో మిడ్ క్యాప్ సూచీ ఒక శాతం, స్మాల్ క్యాప్ సూచీ దాదాపు 2 శాతం పెరిగి కీలక సూచీల కంటే ఎక్కువగా లాభపడ్డాయి.
ఈ రోజు మార్కెట్ ర్యాలీలో 38 స్టాక్లు పురోగమించగా, 11 కంపెనీల షేర్లు క్షీణించాయి. నిఫ్టీ సూచీలో ఓఎన్జీసీ, కోల్ ఇండియా వంటి ఎనర్జీ స్టాక్స్ ప్రతి ఒక్కటి 3 శాతానికి పైగా లాభపడి టాప్ గెయినర్స్ గా నిలిచాయి. మార్కెట్ ముగిసే సమయానికి ఎల్అండ్టీ, హెచ్సీఎల్ టెక్, యూపీఎల్ ఒక్కొక్కటి 2.5-3 శాతం మధ్య పెరిగాయి.
ఇదే సమయంలో.. ఐషర్ మోటార్ 1.5 శాతం, అపోలో హాస్పిటల్ 1 శాతం, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఒక్కొక్కటి స్వల్పంగా 0.5 శాతం మేర క్షీణించాయి. బజాజ్ ఆటో కంపెనీ షేర్ల బైబ్యాక్ ప్రకటించటంతో షేర్ విలువ పెరిగింది. బ్లింకిట్ డీల్ వార్తల తర్వాత Zomato కంపెనీ షేర్ 7 శాతం మేర ఈరోజు పతనమైంది.
అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగియగా.. నిఫ్టీ ఐటీ సూచీ 2 శాతం, నిఫ్టీ మెటల్ సూచీ 1.5 శాతం కంటే ఎక్కువ లాభపడ్డాయి. మెజారిటీ రంగాల సూచీలు నేడు మార్కెట్ ముగింపులో దాదాపు 1 శాతం లాభంతో ఉన్నాయి.