విప్రో అదుర్స్, FY23లో 30,000 మందికి ఆఫర్ లెటర్స్: 2 లక్షలు దాటిన ఉద్యోగులు
2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఐటీ దిగ్గజం విప్రో అదరగొట్టింది. జూన్తో ముగిసిన త్రైమాసికానికి రూ.3,242 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.2,390 కోట్లతో పోలిస్తే ఇది 35.6 శాతం ఎక్కువ. వార్షిక ప్రాతిపదికన కార్యకలాపాల ఆదాయం 22.3 శాతం వృద్ధి సాధించి రూ.18,252 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఇది రూ.14,913 కోట్లుగా ఉంది. ఐటీ సేవల నుండి రూ.18,108 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఐటీ ఉత్పత్తుల విభాగం ఆదాయం రూ.130 కోట్లుగా ఉంది. త్రైమాసికం ప్రాతిపదికన 12.2 శాతం పెరిగింది. విప్రో చరిత్రలోనే ఓ త్రైమాసికంలో ఇది అత్యుత్తమం. సేల్స్ 12 శాతం పెరిగాయి.
రెండు లక్షలు దాటిన ఉద్యోగులు, వేతన పెంపు
021 జూన్ త్రైమాసికంలో కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2 లక్షలు దాటింది. మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,09,890కి చేరుకుంది. 2021 సెప్టెంబర్ 1వ తేదీ నుండి 80 శాతం మంది ఉద్యోగులకు వేతన పెంపు ఉండనుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో మరో 6,000 మందిని క్యాంపస్ ద్వారా నియమించుకోనుంది. 2020-21 జూన్ త్రైమాసికంలో 7,000 మందిని నియమించుకుంది. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 15,000 మందిని నియమించుకుంది. వలసల రేటు మార్చి క్వార్టర్లో 12 శాతంగా ఉంది. జూన్ చివరకు 15.5 శాతానికి చేరుకుంది. 2021-22లో వలసలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పెద్ద కాంట్రాక్టులు
గడిచిన మూడు నెలల్లో కంపెనీ మొత్తం 71.5 కోట్ల డాలర్ల విలువైన 8 పెద్ద కాంట్రాక్టులు దక్కించుకుంది. విప్రో జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి గైడెన్స్ను పెంచింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఐటీ సర్వీస్ల ఆదాయం 2,535 మిలియన్ డాలర్ల నుండి 2,583 మిలియన్ డాలర్లు ఉండవచ్చని గైడెన్స్ ప్రకటించింది.
30,000 మందికి ఆఫర్ లెటర్స్
ఈ ఏడాది 30,000 మందికి ఆఫర్ లెటర్స్ పంపిస్తామని, వారు 2023 ఆర్థిక సంవత్సరంలో జాయిన్ కావాల్సి ఉంటుందని విప్రో తెలిపింది. ఇందులో 22,000 మంది చేరుతారనే అంచనాలతో ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత ఏడాది కంటే 33 శాతం అధికంగా రిక్రూట్ చేసుకుంటామని తెలిపింది.