HCL టెక్ను అధిగమించిన విప్రో, భారత థర్డ్ మోస్ట్ వ్యాల్యూడ్ కంపెనీ
ఐటీ దిగ్గజం విప్రో మరో ఐటీ కంపెనీ హెచ్సీఎల్ టెక్ను క్రాస్ చేసింది. విప్రో స్టాక్ బీఎస్ఈలో రూ.486.70 వద్ద ముగిసింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.65 లక్షల కోట్లకు పెరిగింది. దీంతో HCL మార్కెట్ క్యాపిటలైజేషన్ను దాటింది.
దాదాపు పద్దెనిమిది నెలల తర్వాత ఈ కంపెనీ తిరిగి టెక్ కంపెనీల్లో తిరిగి తన స్థానాన్ని దక్కించుకుంది. అక్టోబర్ 22, 2019 రోజున HCL టెక్ మార్కెట్ క్యాప్ రూ.1.44 లక్షల కోట్ల వద్ద ఉండగా, విప్రో మార్కెట్ క్యాప్ రూ.1.45 లక్షల కోట్ల వద్ద ఉంది. గత గురువారం విప్రో షేర్ 52 వారాల గరిష్టానికి చేరుకొని రూ.494.50 వద్ద ట్రేడ్ అయింది. కంపెనీ మంచి త్రైమాసిక ఫలితాలు నమోదు చేయడం కలిసి వచ్చింది.
దీంతో ఇప్పుడు విప్రో ప్రత్యర్థి ఐటీ కంపెనీ HCL టెక్ను క్రాస్ చేసి మూడో స్థానంలోకి వచ్చింది. కాగా, నిన్న HCL ఫలితాలు కూడా వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరంలో మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికానికి HCL టెక్ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.2,962 కోట్లుగా నమోదయింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2019-20)లో ఇదే కాలానికి గడించిన రూ.3,154 కోట్ల లాభంతో పోలిస్తే 6.1 శాతం క్షీణించింది.