వచ్చే జనవరిలో ఆఫీస్లకు రండి: వర్క్ ఫ్రమ్ హోంపై విప్రో కీలక నిర్ణయం
భారత ఐటీ దిగ్గజం విప్రోలో వర్క్ ఫ్రమ్ హోంకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, అమెరికాలో పని చేస్తున్న తమ ఉద్యోగులు అందరూ జనవర 18, 2021 వరకు ఇంటి నుండి పని చేయాలని సూచించింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుండి పని చేసే వెసులుబాటు కల్పిస్తున్నాయి. గూగుల్, ఫేస్బుక్ వంటి సంస్థలు వచ్చే ఏడాది వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. టాటా స్టీల్ కూడా వైట్ కాలర్ ఉద్యోగులకు తాజాగా వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇచ్చింది. విప్రో కూడా ఉద్యోగులకు ఇంటి నుండి పనిని పొడిగించింది.
గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి భారీగా పెట్టుబడులు, అందుకే.. : 25 ఏళ్ల కనిష్టానికి బంగారం డిమాండ్
మేనేజర్ల అనుమతితో ఇంటి నుండి
విప్రోలో 1,85,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది భారత దేశంలో పనిచేస్తుండగా, కొంతమంది ఉద్యోగులు విదేశాల్లో ఉన్నారు. భారత్, అమెరికాలో ఉన్న ఉద్యోగులు అందరూ వచ్చే ఏడాది వరకు ఇంటి నుండి పని చేయాలని సూచించింది. కంపెనీ ఉద్యోగుల్లో ప్రతి పదిమందిలో తొమ్మిది మంది ఈ రెండు దేశాలకు చెందినవారు. ప్రస్తుతం ఏ ప్రాజెక్టులో లేని ఉద్యోగులతో సహా సపోర్టింగ్, నాన్-బిల్లబుల్ ఉద్యోగులు అందరు కూడా సంబంధిత మేనేజర్లను సంప్రదించి ఇంటి నుండి పని చేయవచ్చునని టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ తెలిపింది.
అందుకే ఈ నిర్ణయం
అమెరికాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోంకు సంబంధించి వివరాలను ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా పంపించింది. ఇతర దేశాలకు చెందిన ఉద్యోగుల పని అంశానికి సంబంధించి కూడా ఆయా దేశాల పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత తమకు తొలి ప్రాధాన్యమని తెలిపింది.
వర్క్ కల్చర్లో మార్పు
కరోనా కారణంగా పనితీరు పూర్తిగా మారిపోయిందని, భవిష్యత్తులో ఉద్యోగులు అందరు కూడా కార్యాలయానికి వచ్చి పని చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చునని కొద్ది నెలల క్రితం విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్జీ అన్నారు. కరోనా నేపథ్యంలో మార్చి నుండి ఐటీ ఉద్యోగులు ఇంటినుండి పని చేస్తున్నారు. అప్పుడు 95 శాతానికి పైగా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేశారు. అన్-లాక్ నేపథ్యంలో ప్రస్తుతం 75 శాతం వరకు ఉద్యోగులు ఇంటి నుండి వర్క్ చేస్తున్నారు. కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ, కరోనా రెండోసారి విజృంభిస్తుందనే ఆందోళనల నేపథ్యంలో ఇంటి నుండి పనిని పొడిగిస్తున్నాయి.