రెపో రేటు తగ్గింపుతో మీ లోన్ EMI త్వరలో తగ్గుతుంది.. గోల్డ్మన్ సాచ్స్ నివేదికలో కీలక అంశాలు ఇవిగో..
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు క్రమంగా మారుతున్న ఈ సమయంలో, భారతదేశ ద్రవ్య విధానంపై అంతర్జాతీయ పెట్టుబడిదారుల దృష్టి మరలింది. ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ సాచ్స్ తాజా నివేదికలో ఈ ఏడాది చివరి నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన పాలసీ రేటు (Repo Rate)లో మరోసారి తగ్గింపు చేసే అవకాశముందని సూచించింది. ఇది జరిగితే గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాల EMIలు తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
గోల్డ్మన్ సాచ్స్ నివేదిక ప్రకారం, ఇటీవలి GST (వస్తువులు మరియు సేవల పన్ను) సరళీకరణలు ఆర్థిక వ్యవస్థలో పన్ను ఏకీకరణను మెరుగుపరచడంతోపాటు, వ్యాపార నమ్మకాన్ని పెంచాయి. అదే సమయంలో ప్రభుత్వ నియంత్రణ సడలింపులు, విధాన పరమైన మద్దతు, క్రెడిట్ డిమాండ్ను తిరిగి చురుకుగా మార్చే అవకాశాన్ని పెంచాయి. ఈ మార్పులు కలిపి భారతదేశ ద్రవ్య కఠినత దశ ముగిసే సూచనలుగా గోల్డ్మన్ సాచ్స్ అంచనా వేస్తోంది.

2023, 2024 మధ్య ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు RBI కఠిన విధానాన్ని అనుసరించినప్పటికీ.. ఇప్పుడు వడ్డీ తగ్గింపు దిశగా మార్పు సూచనలు కనిపిస్తున్నాయని నివేదికలో పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించిన ద్రవ్య విధాన ప్రకటనలో.. రెపో రేటు 5.5 శాతం వద్ద స్థిరంగా ఉంచినట్లు ద్రవ్య విధాన కమిటీ (MPC) పేర్కొంది. అయినప్పటికీ, RBI భవిష్యత్తులో 25 బేసిస్ పాయింట్ల (0.25%) వరకు వడ్డీ రేటు తగ్గింపు అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చింది. ఇది వడ్డీ ఖర్చులను తగ్గించి క్రెడిట్ వృద్ధిని ప్రోత్సహించే దిశగా ఒక అడుగు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గోల్డ్మన్ సాచ్స్ నివేదికలో భారత ఆర్థిక దృక్పథాన్ని ప్రభావితం చేసే కొన్ని బాహ్య అంశాలను కూడా ప్రస్తావించింది. అమెరికాలో H-1B వీసా ఫీజుల పెరుగుదల భారత ఐటీ సేవల రంగాన్ని కొంత ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంతేకాక, అమెరికా భారతీయ వస్తువులపై 50 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించడం, భారత ఎగుమతులపై ఒత్తిడిని పెంచుతుంది. ఈ కారణాలు క్రెడిట్ డిమాండ్ను తాత్కాలికంగా తగ్గించే అవకాశం కలిగిస్తాయని నివేదికలో పేర్కొంది. మరోవైపు అనుకూలమైన రుతుపవనాలు, GST రేటు తగ్గింపు, ప్రభుత్వ పెట్టుబడుల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థను బలపరిచే అంశాలుగా గోల్డ్మన్ సాచ్స్ గుర్తించింది.
2025-26 ఆర్థిక సంవత్సరానికి RBI తన వృద్ధి అంచనాను పైకి సవరించింది. ఇది స్థూల ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉన్నట్లు సూచిస్తోంది. గోల్డ్మన్ సాచ్స్ అంచనా ప్రకారం.. RBI మరోసారి వడ్డీ రేటును తగ్గిస్తే.. అది వినియోగదారులపై ప్రత్యక్ష లాభదాయక ప్రభావం చూపి.. ఇంటి కొనుగోళ్లు, వాహన రుణాలు, SME క్రెడిట్ వృద్ధికి దోహదం చేస్తుంది.
ఏదేమైనా ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు,GST సంస్కరణల పాజిటివ్ ఫలితాలు, బలమైన వృద్ధి దిశలో ఉన్న ఆర్థిక సూచికలు, RBI కి వడ్డీ తగ్గింపునకు అనుకూల పరిస్థితులను సృష్టిస్తున్నాయని గోల్డ్మన్ సాచ్స్ నివేదిక స్పష్టం చేసింది.2025 చివరి నాటికి RBI నుండి మరో వడ్డీ రేటు తగ్గింపు వస్తే, భారతీయ వినియోగదారులకు ఇది నేరుగా EMI ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థలో వినియోగం, పెట్టుబడులు రెండూ పెరిగే అవకాశాలు కూడా బలపడతాయి.


Click it and Unblock the Notifications