48 రోజుల్లో 27సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: ఎందుకు పెరిగాయంటే
పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలో రికార్డ్ గరిష్టాన్ని తాకాయి. హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్ సహా పలు ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటింది. డీజిల్ ధర పలుచోట్ల రూ.100 చేరుకుంది. శ్రీగంగానగర్ వంటి ప్రాంతాల్లో లీటర్ డీజిల్ రూ.100 దాటింది. ఇంధన ధరలు దేశంలో నిన్న కూడా పెరిగాయి. దేశీయ చమురు రంగ కంపెనీలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఇంధన ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా సవరణ ఉంటుంది.
48 రోజుల్లో 27సార్లు పెంపు
పెట్రోల్, డీజిల్ ధరల్లో నేడు (జూన్ 21, సోమవారం) ఎలాంటి మార్పులేదు. మే 4వ తేదీ నుండి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు 27సార్లు పెరిగాయి. కేవలం మే నెలలోనే 16సార్లు పెరిగింది.
మే 4వ తేదీ నుండి ఈ 48 రోజుల కాలంలో లీటర్ పెట్రోల్ పైన రూ.6.82, లీటర్ డీజిల్ పైన రూ.7.24 పెరిగింది. ముంబై, రత్నగిరి, పర్బానీ, ఔరంగాబాద్, జైసల్మేర్, గంగానగర్, ఇడోర్, భోపాల్, గ్వాలియర్, గుంటూరు, కాకినాడ, హైదరాబాద్, చిక్మగ్ళూరు, శివమొగ్గ, లెహ్ తదితర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ రూ.100 దాటింది. లీటర్ పెట్రోల్ ధర నిన్న 29 పైసలు, లీటర్ డీజిల్ పైన 28 పైసలు పెరిగింది.
పన్నుల వాటా
దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.97.22, లీటర్ డీజిల్ రూ.8797గా ఉంది. గంగానగర్లో పెట్రోల్ రూ.108.37, డీజిల్ రూ.10112, ముంబైలో పెట్రోల్ రూ.103.36, డీజిల్ రూ.95.44గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ 3.08 వద్ద ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎక్కువ వాటా పన్నులదే. ఉదాహరణకు దేశ రాజధానిలో ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వరుసగా 34.8 శాతం, 23.08 శాతం పన్నులు వసూలు చేస్తాయి.
అందుకే ధరలపై ప్రభావం
రిటైల్ పెట్రోల్ ధరల్లో 58 శాతం వ్యాట్, పన్నుల రూపంలో పోతుంది. రిటైల్ డీజిల్ ధరలో 52 శాతం పన్నులు, వ్యాట్ రూపంలో ఉంటుంది. ఇటీవల కరోనా కారణంగా అంతర్జాతీయ క్రూడ్ ధరలు భారీగా తగ్గాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అంతేస్థాయిలో తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం పన్ను శాతాన్ని పెంచింది. దీంతో ధరలపై ప్రభావం పడింది.