సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం, 60,000 దిగువకు... కారణాలివే
స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ చాన్నాళ్లకు 60,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. దాదాపు నెల రోజులుగా 58,000 పాయింట్లకు పైనే ఉంటోంది. గత అయిదు సెషన్లలో ఎప్పుడు కూడా 60,000 పాయింట్ల దిగువకు రాలేదు. కానీ నేడు ఈ మార్కు దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ నేడు 1300 పాయింట్ల మేర పైకి, కిందకు కదలాడింది. అన్ని రంగాలు కూడా నష్టాల్లోనే ముగిశాయి.
పీఎస్యూ బ్యాంకు, మెటల్ రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, ఫార్మా సూచీలు రెండు శాతం నుండి ఐదు శాతం మేర నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక శాతం పడిపోయాయి. బ్యాంక్ నిఫ్టీ నేడు 39,400 స్థాయికి పడిపోయింది. ఇలాగే కొనసాగితే మున్ముందు 38670-38150 పాయింట్ల మధ్య పడిపోవచ్చునని మార్కెట్ నిపుణుల అంచనా. మార్కెట్ నష్టాలకు పలు కారణాలు ఉన్నాయి.
నష్టాలకు కారణమిదే
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు సూచీలను దెబ్బతీశాయి.
దీనికి తోడు అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్ట్ గడువు ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతతో సూచీలు కుదేలవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ ప్రతికూలత నేపథ్యంలో నిఫ్టీ కీలక 17950-18000 పాయింట్ల దిగువకు పడిపోయింది.
ద్రవ్యోల్భణం పెరుగుతుండటంతో ద్రవ్య విధానం కఠినతరం అవుతుందనే అంచనాలతో యూరోపియన్ మార్కెట్లు పతనం అయ్యాయి.
కోవిడ్ ఇన్ఫెక్షన్ యొక్క కొత్త కేసుల పెరుగుదల కూడా మార్కెట్ ప్రతికూలతకు మరింత తోడయిందని చెబుతున్నారు.
FIIల నిరంతర విక్రయం మార్కెట్ భారీ కరెక్షన్కు తోడయింది.
ఇటీవలి నెలల్లో మార్కెట్ మెరుగైన పనితీరు కారణంగా భారత ఈక్వల్ వెయిట్ను మోర్గాన్ స్టాన్లీ తగ్గించింది.
రోజంతా నష్టాలే..
ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో గురువారం నాటి ట్రేడింగ్ను సూచీలు నష్టాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ 61,081 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించి, ఓ దశలో 1200 పాయింట్లకు పైగా పతనమై 59,777 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరకు 1,158.63 (1.89%) పాయింట్లు నష్టపోయి 59,984.70 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 18,187.65 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,799 - 18,190 పాయింట్ల మధ్య కదలాడి చివరకు 353.70 (1.94%) పాయింట్ల నష్టంతో 17,857.25 వద్ద ముగిసింది.
దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, రియల్టీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, ఫార్మా రంగాల షేర్లు 2 శాతం నుండి 5 శాతం మేర క్షీణించాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1 శాతం మేర పడిపోయాయి. నిఫ్టీ బ్యాంక్ సూచీ 3.34 శాతం నష్టపోయింది.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో
ఇండస్ఇండ్ బ్యాంకు 2.93 శాతం, లార్సన్ 1.66 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 1.26 శాతం, ఏషియన్ పేయింట్స్ 0.70 శాతం, శ్రీ సిమెంట్స్ 0.30 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 7.74 శాతం, ITC 5.60 శాతం, ONGC 4.88 శాతం, ICICI బ్యాంకు 4.35 శాతం, కొటక్ మహీంద్రా 4.10 శాతం నష్టపోయాయి.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో ఇండస్ఇండ్ బ్యాంకు, ICICI బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, HDFC బ్యాంకు, SBI ఉన్నాయి.