దేశ పరువు తాకట్టు పెట్టిన ఆ 'ఒక్క రాత్రి'.. నాడు అంబానీ కంటే దారుణమైన స్థితిలో భారత్!
భారతీయులకు బంగారం (gold) అంటే కేవలం ఒక లోహం కాదు.. అదొక సెంటిమెంట్, ఆత్మగౌరవం, , ఆడబిడ్డల పెళ్లిళ్లకు దాచుకునే భద్రత. అలాంటిది మన దేశంలో ఉన్న టన్నుల కొద్దీ బంగారాన్ని అర్ధరాత్రి వేళల్లో, అత్యంత రహస్యంగా విమానాల్లో పెట్టి విదేశాలకు తరలించారనే వార్త వింటే ఎవరైనా షాక్ అవుతారు. ఇది ఏదో సినిమా కథ కాదు.. 1991 వేసవి కాలంలో భారతదేశానికి ఎదురైన అత్యంత ఘోరమైన ఆర్థిక సంక్షోభం (Balance of Payments Crisis) తాలూకు చేదు నిజం. దేశం దివాళా తీసే (Sovereign Default) పరిస్థితికి వచ్చేయడంతో, అప్పటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దాదాపు 47,000 కేజీల బంగారాన్ని లండన్లోని 'బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్' కి తరలించాల్సి వచ్చింది.

అసలు ఎందుకీ దారుణ పరిస్థితి వచ్చింది?
1980ల చివరలో , 1990ల ప్రారంభంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. రాజకీయ అస్థిరతతో పాటు, 1991 జనవరిలో వచ్చిన గల్ఫ్ యుద్ధం (Kuwait War) మన దేశాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ రేట్లు ఆకాశాన్ని తాకాయి, గల్ఫ్ దేశాల నుంచి భారతీయులు పంపే పైసలు (Remittances) ఆగిపోయాయి. దాంతో మన ఖజానా ఖాళీ అయిపోయింది. విదేశాల నుంచి కేవలం వారం రోజులకు సరిపడా వస్తువులను దిగుమతి చేసుకోవడానికి (ఇంపోర్ట్ బిల్లులు కట్టడానికి) మాత్రమే మన దగ్గర డాలర్లు మిగిలాయి. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు ఇండియా క్రెడిట్ రేటింగ్ను తగ్గించేయడంతో, విదేశీ బ్యాంకులు మనకు అప్పు ఇవ్వడానికి నిరాకరించాయి.
అత్యంత గుప్తంగా సాగిన 'ఎయిర్ లిఫ్ట్' ఆపరేషన్
ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో అప్పటి కేర్టేకర్ ప్రధాని చంద్రశేఖర్ ప్రభుత్వం , ఆర్బీఐ గవర్నర్ ఎస్. వెంకిటరమణన్ కలిసి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. దేశాన్ని డిఫాల్టర్ కాకుండా కాపాడటానికి ఆర్బీఐ వద్ద ఉన్న బంగారాన్ని విదేశీ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకోవాలని డిసైడ్ అయ్యారు.
మొదట మే 1991లో దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న (Confiscated) 20 టన్నుల బంగారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా స్విట్జర్లాండ్ బ్యాంకుకు పంపి $215 మిలియన్లు తెచ్చారు. కానీ అది సరిపోలేదు. దాంతో జూలై 4, 1991 నుంచి ఆర్బీఐ తన స్వంత నిల్వల నుంచి 46.91 టన్నుల బంగారాన్ని ముంబై ఎయిర్పోర్ట్ ద్వారా నాలుగు విమానాలలో లండన్కు చేరవేసింది. ఆర్బీఐ భద్రతా వాహనాల్లో ఈ బంగారాన్ని ఎయిర్పోర్టుకు తరలిస్తున్నప్పుడు ఒక వాహనం టైరు పేలిపోవడంతో ఆపరేషన్ మొత్తం ఫెయిల్ అవుతుందేమోననే టెన్షన్ క్రియేట్ అయిందట! కస్టమ్స్ అధికారులకు కూడా ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వకుండా, కేంద్ర ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రత్యేక ఆర్డర్లతో ఈ గోల్డ్ను విమానం ఎక్కించారు.
బయటపడ్డ రహస్యం.. దేశమంతా ఆందోళన
ఈ ఆపరేషన్ను ఎంత సీక్రెట్గా ఉంచాలని చూసినా.. జూలై 8, 1991న ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఫ్రంట్ పేజీలో "ఆర్బీఐ రహస్యంగా 21,000 కేజీల బంగారాన్ని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించింది" అంటూ హెడ్లైన్ వేసి, ఎయిర్పోర్టులో బాక్సులు లోడ్ చేస్తున్న ఫోటోను లీక్ చేసింది. ఈ వార్త వినగానే దేశ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇది దేశానికి పెద్ద అవమానమని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అయితే, ఈ తాకట్టు వల్ల మన దేశానికి $405 మిలియన్ల అత్యవసర రుణం లభించింది. ఈ లోన్ మనల్ని కాపాడటమే కాకుండా.. ఆ తర్వాత వచ్చిన ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు, ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ కలిసి దేశంలోకి విదేశీ పెట్టుబడులు వచ్చేలా 'ఆర్థిక సంస్కరణలు' (Liberalisation) తీసుకురావడానికి పునాది వేసింది.
గతం గుర్తించి ప్రధాని మోదీ ఇచ్చిన నేటి పిలుపు
భారతదేశం ఆ తర్వాత నవంబర్ 1991 లోనే ఆ అప్పును పూర్తిగా తీర్చేసింది. నాడు అప్పు కోసం లండన్ పంపిన మన బంగారం (gold) నిల్వలు ఇప్పుడు ఎంతో పెరిగాయి. మార్చి 2026 నాటికి భారత దేశం వద్ద ఏకంగా 880.5 టన్నుల బంగారం ఉంది, దీని విలువ $115 బిలియన్ల (రూ. 9.5 లక్షల కోట్ల) పైనే! ఇందులో దాదాపు 77% (680 టన్నులు) బంగారాన్ని ఆర్బీఐ విదేశాల నుంచి మన స్వదేశీ వాల్ట్లకే వెనక్కు రప్పించింది.
అయితే, చరిత్ర మళ్లీ పునరావృతం కాకూడదనే ఉద్దేశ్యంతో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల దేశ ప్రజలకు ఒక ముఖ్యమైన రిక్వెస్ట్ చేశారు. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఆయిల్ రేట్లు పెరుగుతున్నందున, దేశీయ రూపాయి విలువ పడిపోకుండా కాపాడుకోవడానికి వీలైనంత వరకు కనీసం ఏడాది పాటు అనవసరమైన బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని కోరారు. ఎందుకంటే ఇండియా ఏటా దాదాపు $72 బిలియన్ల విలువైన బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది, ఇది మన డాలర్ల నిల్వలను కరిగిస్తోంది. నాడు 1991లో కేవలం $405 మిలియన్ల కోసం బంగారం తాకట్టు పెట్టిన దేశం.. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తుల్లో ఒకటిగా ఎదగడం నిజంగా మనందరికీ గర్వకారణం.


Click it and Unblock the Notifications