Petrol Prices: పెట్రోల్ ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఎందుకుంటాయో తెలుసా?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాహనదారులకు పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ ఆసియా (West Asia) లో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న వివాదాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు ఒక్కసారిగా రెక్కలు తొడిగాయి. దీని ప్రభావంతో భారత్లో ఆయిల్ కంపెనీలు భారాన్ని సామాన్యుడిపై మోపడంతో.. గత కొన్ని రోజులుగా లీటర్ పెట్రోల్పై దాదాపు రూ. 7.50 వరకు పెరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో పెట్రోల్ ధరలు (petrol prices) ఒకేలా లేవు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, అమరావతిలలో ధరల మధ్య భారీ తేడాలు కనిపిస్తున్నాయి. అసలు ఈ వ్యత్యాసాలకు కారణం ఏంటో తెలుసుకుందాం.

అంతర్జాతీయ సంక్షోభం.. రూపాయి పతనం!
భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం 85% కంటే ఎక్కువ వేరే దేశాలపైనే ఆధారపడుతుంది. ఇరాన్ సంక్షోభం తీవ్రమవడంతో గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఫిబ్రవరిలో ఉన్న $72 బ్యారెల్ నుండి ఏకంగా $113-$118 బ్యారెల్కు చేరింది. దీనికి తోడు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ బలహీనపడటంతో చమురు దిగుమతులు మరింత ఖరీదైనవిగా మారాయి. ఇదే మన దేశంలో ఇంధన ధరలు పెరగడానికి ప్రధాన కారణం.
జీఎస్టీ (GST) పరిధిలో లేకపోవడమే శాపం!
దేశంలో పెట్రోల్ ధరలు (petrol prices) రాష్ట్రానికి ఒకలా ఉండటానికి అసలు కారణం పన్నుల విధింపు విధానం. పెట్రోల్, డీజిల్లను ఇప్పటికీ జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా పన్నులు వసూలు చేస్తున్నాయి.
- కేంద్ర ప్రభుత్వం: దేశవ్యాప్తంగా అమ్మే ప్రతి లీటర్ పెట్రోల్పై రూ. 19.90, డీజిల్పై రూ. 15.80 స్థిర ఎక్సైజ్ డ్యూటీని విధిస్తుంది.
- రాష్ట్ర ప్రభుత్వాలు: తమ ఆదాయ అవసరాలకు అనుగుణంగా సొంతంగా విలువ ఆధారిత పన్ను (VAT) విధిస్తాయి. ఈ వ్యాట్ రేట్లు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండటం వల్లే ధరల్లో అంత తేడా వస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోనే పెట్రోల్ మంటలు ఎక్కువ!
దేశంలోనే అత్యధికంగా ఇంధన పన్నులు వసూలు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణలు ముందంజలో ఉన్నాయి. అందుకే ఇక్కడ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లీటర్ పెట్రోల్ ధర సుమారు రూ. 117.09 కాగా, తెలంగాణలో రూ. 117.15 గా ఉంది.
- తెలంగాణ: పెట్రోల్పై దాదాపు 35.2 శాతం, డీజిల్పై 27 శాతం వ్యాట్ విధిస్తోంది. అంటే లీటర్ పెట్రోల్పై కేవలం రాష్ట్ర పన్నే రూ. 28.50 నుండి రూ. 30.50 వరకు ఉంటోంది.
- ఆంధ్రప్రదేశ్: ఇక్కడ పెట్రోల్పై 31 శాతం వ్యాత్తో పాటు అదనంగా లీటరుకు రూ. 4 చొప్పున , రూ. 1 రోడ్ డెవలప్మెంట్ సెస్ వసూలు చేస్తున్నారు.
అసలు లెక్క ఎలా ఉంటుందంటే? (రూపాయిల్లో..)
మనం బంకుల్లో కొనే పెట్రోల్ అసలు ధర (ముడి చమురు, రిఫైనింగ్, రవాణా ఖర్చులతో కలిపి) కేవలం రూ. 56 నుండి రూ. 58 లోపే ఉంటుంది. డీజిల్ బేస్ ప్రైస్ కూడా రూ. 57 నుండి రూ. 59 మాత్రమే. దీనికి కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ డ్యూటీతో పాటు పెట్రోల్ బంక్ డీలర్ల కమిషన్ (పెట్రోల్కు రూ. 3.80, డీజిల్కు రూ. 2.60) యాడ్ అవుతుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు విధించే భారీ వ్యాట్ రేట్లు తోడవడంతో ధర సెంచరీ దాటి రూ. 117 కి చేరుకుంటోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా భారీ సెస్సుల వల్ల పెట్రోల్ రూ. 115 దాటగా, మధ్యప్రదేశ్లో రూ. 116 కి చేరింది. ఇంధన ధరలు తగ్గాలంటే వీటిని జీఎస్టీ పరిధిలోకి తేవడం ఒక్కటే మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications