బంగారం మీద మోజు వదిలేయాలని మొత్తుకున్న కేంద్రం.. భారతీయులు ప్రభుత్వానికి ఇచ్చిన షాక్ ఏంటో తెలుసా..
తరతరాలుగా భారతీయ కుటుంబాలలో Gold కేవలం ఒక విలువైన ఆభరణంగా మాత్రమే కాకుండా.. కష్టకాలంలో ఆదుకునే అత్యంత నమ్మకమైన ఆర్థిక ఆసరాగా, సాంస్కృతిక ప్రతీకగా ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకుంది. అయితే భారతదేశ ఆర్థిక ప్రస్థానాన్ని నిశితంగా పరిశీలిస్తే.. ఒకానొక కాలంలో ఇదే బంగారాన్ని కలిగి ఉండటం లేదా వ్యాపారం చేయడంపై ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు విధించడం, ఆపై తలెత్తిన సంక్షోభాల వల్ల దేశ పసిడి నిల్వలను విదేశాల్లో తాకట్టు పెట్టవలసి రావడం లాంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నాటి ఆంక్షల కాలం నుండి నేటి వ్యూహాత్మక నిల్వల యుగం వరకు భారత ఆర్థిక వ్యవస్థలో పసిడి పోషించిన పాత్ర అత్యంత విలక్షణమైనది.
1962 నాటి చైనా యుద్ధం తదనంతర పరిణామాలతో భారతదేశం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని, విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్) కొరతను ఎదుర్కొంది. దిగుమతి చేసుకునే బంగారంపై భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి రావడంతో.. ప్రైవేట్ యాజమాన్యం వద్ద ఉండే బంగారాన్ని నియంత్రించడం ద్వారా దిగుమతుల డిమాండ్ను తగ్గించి, ఫారెక్స్ నిల్వలను కాపాడవచ్చని నాటి విధానకర్తలు భావించారు. ఈ వ్యూహంలో భాగంగానే ప్రభుత్వం 1968లో బంగారము (నియంత్రణ) చట్టాన్నిప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం కడ్డీలు, నాణేల రూపంలో ఉన్న బంగారాన్ని కలిగి ఉండటంపై తీవ్ర పరిమితులు విధించారు. అలాగే స్వర్ణకారులు, వ్యాపారులు తయారుచేసే కొత్త ఆభరణాలు గరిష్టంగా 14 క్యారెట్ల స్వచ్ఛతను మాత్రమే కలిగి ఉండాలనే నిబంధనను తీసుకువచ్చారు.

అయితే ఈ విధానం ప్రభుత్వ అంచనాలను పూర్తిగా తలకిందులు చేసింది. 22 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారానికి అలవాటుపడిన భారతీయ వినియోగదారులు 14 క్యారెట్ల ఆభరణాలను కొనుగోలు చేయడానికి విముఖత చూపారు. చట్టబద్ధమైన వ్యాపార మార్గాలు మూతపడటంతో స్మగ్లింగ్ నెట్వర్క్లు విపరీతంగా విస్తరించాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యం నుండి ఆటోమొబైల్ విడిభాగాల్లో, దౌత్య సామానులో బంగారాన్ని దాచిపెట్టి బొంబాయి కేంద్రంగా రహస్యంగా అక్రమ రవాణా చేయడం ప్రారంభించారు. అనధికారిక మార్కెట్లో లండన్ బులియన్ ధరల కంటే 40 నుండి 80 శాతం అధిక ధరకు బంగారం విక్రయించబడింది. ఆంక్షలు డిమాండ్ను తగ్గించలేకపోగా.. సమాంతర ఆర్థిక వ్యవస్థను సృష్టించాయనే సత్యాన్ని గుర్తించిన ప్రభుత్వం, 1990 జూన్ 6న మధు దండావతే హయాంలో ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసింది.
చట్టం రద్దయిన మరుసటి ఏడాదే.. అంటే 1991లో భారతదేశం మరొక చారిత్రాత్మక చెల్లింపుల సంతులన (BoP) సంక్షోభంలో కూరుకుపోయింది. దేశ విదేశీ మారక నిల్వలు కేవలం కొన్ని వారాల దిగుమతులకు మాత్రమే సరిపోయే స్థాయికి పడిపోయాయి. ఈ అత్యవసర పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) అత్యంత గోప్యంగా 46.91 టన్నుల బంగారాన్ని తూకం వేసి, బీమా చేయించి లండన్లోని 'బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్'కు తరలించి అత్యవసర పూచీకత్తుగా తాకట్టు పెట్టింది.
విమానాల్లోకి పసిడి కడ్డీలను ఎక్కిస్తున్న దృశ్యాలు ఆనాటి ఆర్థిక సంక్షోభానికి ప్రతిరూపంగా నిలిచాయి. ఈ చర్య దేశానికి తాత్కాలికంగా ఊపిరి పీల్చుకునే సమయాన్ని ఇచ్చింది. తదనంతరం అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు, ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలో లైసెన్స్ రాజ్ను రద్దు చేస్తూ విప్లవాత్మక ఎల్పిజి (LPG) సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. కాలక్రమేణా రుణాలు చెల్లించి తాకట్టు పెట్టిన బంగారాన్ని ప్రభుత్వం సురక్షితంగా వెనక్కి రాబట్టుకుంది.
ఒకప్పుడు ప్రభుత్వం నియంత్రించడానికి ప్రయత్నించిన పసిడి, నేడు దేశ ఆర్థిక భద్రతకు ప్రధాన రక్షణ కవచంగా రూపాంతరం చెందింది. 1991 నాటి నిల్వల కంటే నేడు ఆర్బిఐ వద్ద ఉన్న బంగారం పరిమాణం రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగి ఏకంగా 880.52 టన్నులకు చేరడం విశేషం. భారతదేశ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా సెప్టెంబర్ 2025లోని 13.92 శాతం నుండి మార్చి 2026 నాటికి 16.70 శాతానికి, మే 2026 నాటికి 16.85 శాతానికి క్రమంగా వృద్ధి చెందింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పెరగడంతో 2025-26 సంవత్సరంలో ఆర్బిఐ ఆస్తులలోని బంగారం విలువ ఏకంగా 63 శాతానికి పైగా పెరిగింది. ఒకనాడు అల్మరాల్లో.. రహస్య అరల్లో దాచిపెట్టిన పసిడి, నేడు భారతదేశపు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడే అత్యంత కీలకమైన వ్యూహాత్మక శక్తిగా అవతరించింది.


Click it and Unblock the Notifications
