ఈ ఏడాది బంగారం, వెండి పెరుగుదలపై సంచలన నివేదిక.. ఏకంగా ఆ స్థాయి వరకు వెళుతుందంటున్న నిపుణులు..
మధ్యప్రాచ్య ప్రాంతంలో అమెరికా-ఇరాన్ల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో పెను మార్పులకు కారణమైంది. ఈ సానుకూల పరిణామం నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తిగా భావించే విలువైన లోహాల వైపు మొగ్గు చూపారు. దీని ఫలితంగా బంగారం ధర సుమారు 2 శాతం పెరిగి 4,800 డాలర్ల స్థాయికి చేరుకోగా, వెండి ధర ఏకంగా 6 శాతం వృద్ధితో ఔన్సుకు 77 డాలర్ల మార్కును దాటింది.
హార్ముజ్ జలసంధి పునఃప్రారంభం కావడం, చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్ల కంటే దిగువకు పడిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు తగ్గుతాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన వడ్డీ రేట్ల కోత ప్రక్రియను వేగవంతం చేయడానికి మార్గం సుగమం చేస్తోంది.

డాలర్ విలువ యూరోతో పోలిస్తే 0.8 శాతం పడిపోవడం కూడా Gold, వెండి ధరల ర్యాలీకి అదనపు బలాన్ని ఇచ్చింది. సాధారణంగా డాలర్ బలహీనపడినప్పుడు ఇతర కరెన్సీలు కలిగిన పెట్టుబడిదారులకు బంగారం చౌకగా మారుతుంది. ఇది కొనుగోళ్లను ప్రోత్సహిస్తుంది. వెండి విషయానికి వస్తే, ఇది తన "టర్బో-గోల్డ్" స్వభావాన్ని నిరూపించుకుంటూ బంగారం కంటే వేగంగా పుంజుకుంటోంది.
చమురు మార్కెట్లు ప్రశాంతంగా ఉండటం వల్ల పారిశ్రామిక రంగం నుండి వెండికి స్థిరమైన డిమాండ్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాంకేతికంగా చూస్తే, వెండి 76.10 డాలర్ల స్థాయిని అధిగమించడం ఒక సానుకూల సంకేతమని.. త్వరలోనే ఇది 80 డాలర్ల వద్ద ఉన్న కీలక ప్రతిఘటన స్థాయిని పరీక్షించవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Gold ధరల సాంకేతిక స్థితిని గమనిస్తే, ప్రస్తుతం ఇది ఔన్సుకు 4,780 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ ర్యాలీలో బంగారం ఒక దశలో 4,857 డాలర్ల స్థాయిని తాకినప్పటికీ, 50 రోజుల ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ (50 EMA) వద్ద అడ్డంకిని ఎదుర్కొంది.
ఈ 4,850 డాలర్ల స్థాయిని దాటి పైన ముగిస్తేనే బంగారం తన కరెక్షన్ దశ నుండి బయటపడినట్లు భావించవచ్చు. దీర్ఘకాలికంగా చూస్తే 2025 నుండి కొనసాగుతున్న పెరుగుదల ధోరణి ఆధారంగా ఫైబొనాచీ ఎక్స్టెన్షన్స్ వేస్తే.. బంగారం భవిష్యత్తులో 7 వేల డాలర్ల స్థాయిని తాకవచ్చని అంచనా. అంటే ప్రస్తుత ధరల నుండి ఇది మరో 50 శాతం లాభాన్ని ఇచ్చే అవకాశం ఉంది.
సంస్థాగత అంచనాలు కూడా ఈ బుల్లిష్ ధోరణిని బలపరుస్తున్నాయి. రాయిటర్స్ నిర్వహించిన సర్వే ప్రకారం 2026 నాటికి బంగారం మధ్యస్థ ధర 4,746 డాలర్ల వద్ద ఉంటుందని అంచనా వేయగా, జేపీమోర్గాన్, వెల్స్ ఫార్గో వంటి దిగ్గజ బ్యాంకులు దీనిని 6,300 డాలర్ల వరకు పెంచాయి. ప్రధానంగా కేంద్ర బ్యాంకులు దాదాపు 800 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తాయనే అంచనా ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.
వెండికి సంబంధించి బ్యాంక్ ఆఫ్ అమెరికా అత్యంత ఆశాజనకంగా ఉంది. బంగారం-వెండి నిష్పత్తిని బట్టి వెండి 135 డాలర్ల నుండి 309 డాలర్ల వరకు చేరవచ్చని వారు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి కాల్పుల విరమణ, డాలర్ బలహీనత, వడ్డీ రేట్ల కోత అంచనాలు విలువైన లోహాలకు 2026లో గొప్ప మేలు చేసేలా కనిపిస్తున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications