E20 ఫ్యూయల్ ధరపై కేంద్రం క్లారిటీ.. పెట్రోల్ రేటుతో సమానంగా ఉంటుందని స్పష్టం.. కారణం ఏంటంటే..
దేశంలో 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) వినియోగాన్ని పెంపొందించాలనే ప్రతిపాదనను కేంద్రం మరోసారి గట్టిగా సమర్థించింది. అయితే, దేశీయంగా బయోఫ్యూయల్స్ ఉత్పత్తి పెరిగినప్పటికీ.. పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు లీటరు ధరలు తగ్గవని స్పష్టం చేసింది. సాధారణంగా ఇథనాల్ కలిపితే ఇంధన ధర తగ్గుతుందని ప్రజలు భావిస్తున్నప్పటికీ.. E20 ఉత్పత్తి వ్యయాలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై కాకుండా, రైతులకు ప్రభుత్వం కల్పించే మద్దతు ధరలపై ఆధారపడి ఉంటాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ వివరించింది.
వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి రైతుల నుంచి మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ను లీటరుకు సుమారు 71.86 రూపాయల వంటి స్థిరమైన, రక్షిత ధరలకు సేకరిస్తున్నారు. ఈ దేశీయ సేకరణ ధరలు స్థిరంగా ఉన్నందున.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు 70 డాలర్ల వద్ద ఉన్నప్పుడు సాంప్రదాయ క్లీన్ పెట్రోల్ తయారీ కంటే E20 ఇంధన తయారీకే ఎక్కువ ఖర్చవుతుంది. ముడి చమురు ధరలు బ్యారెల్కు 120 నుండి 130 డాలర్ల శ్రేణికి చేరితేనే E20 వల్ల స్పష్టమైన వ్యయ ప్రయోజనం కనిపిస్తుంది. అయినప్పటికీ ప్రతి లీటరు పెట్రోల్లో ఐదవ వంతును దేశీయ ఇంధనంతో భర్తీ చేయడం వల్ల అంతర్జాతీయ చమురు మార్కెట్ ఆకస్మిక హెచ్చుతగ్గుల నుండి దేశ ఆర్థిక వ్యవస్థకు రక్షణ లభిస్తుందని కేంద్రం తెలిపింది.

ఫ్యూయల్ స్టేషన్లలో క్లీన్ పెట్రోల్.. E10, E20 ఇంధనాలు ఒకే సమయంలో విడివిడిగా లభించవు. భారతదేశంలోని లక్షకు పైగా ఉన్న పెట్రోల్ బంకుల్లో మూడు వేర్వేరు సరఫరా గొలుసులను నిర్వహించడం లాజిస్టిక్గా, ఆర్థికంగా సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అందువల్ల సజావైన పంపిణీ కోసం తక్కువ బ్లెండ్ ఇంధనాలను దశలవారీగా పూర్తిగా నిలిపివేయడం అవసరమని పేర్కొంది. అలాగే పాత ఇంజన్లలో E20 ఇంధనాన్ని వాడితే అవి దెబ్బతింటాయనే ఆందోళనలను ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చింది.
ఇందుకు సంబంధించి దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి అందించిన గణాంకాలను మంత్రిత్వ శాఖ ఉదహరించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి సర్వీసింగ్ చేసిన 2.84 కోట్ల వాహనాలలో.. దాదాపు 1.5 కోట్ల వాహనాలు E20 ప్రమాణాలకు ధృవీకరించబడని పాత మోడళ్లు అయినప్పటికీ, వాటిలో ఒక్క వాహనంలో కూడా ఇంజన్ తుప్పు పట్టడం లేదా ఇంధన భాగాలు వైఫల్యం చెందడం వంటి కేసులు నమోదు కాలేదు.
ARAI, SIAM, IOCL వంటి ప్రతిష్టాత్మక నియంత్రణ సంస్థలు కూడా E20 వాడకం వల్ల పాత వాహనాలకు ఎలాంటి సమస్యలు రావని అధికార ధృవీకరించాయి. పాత వాహనాలపై ఉండే E10 లేబుల్స్ కేవలం ఆ వాహనం తయారైనప్పటి ఇంధన ప్రమాణాన్ని సూచిస్తాయే తప్ప.. అవి ఇప్పుడు సేఫ్ కాదనే వాదన కర్టెక్ట్ కాదని తెలిపింది. E20 ఇంధనం వల్ల మైలేజీలో 3 నుండి 5 శాతం స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, ఇది అధిక ఆక్టేన్ రేటింగ్తో మెరుగైన ఇంజన్ పనితీరును ఇస్తుందని, కార్బన్ ఉద్గారాలను 40 శాతం వరకు తగ్గిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. భారతదేశంలో ఇథనాల్ బ్లెండింగ్ ప్రయాణం 2001లో ఒక పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభమై.. 2013లో అధికారిక విధానంగా మారింది. 2014కు ముందు ఉత్పత్తి కేవలం కాలానుగుణ చెరకు పంటలపైనే ఆధారపడటంతో బ్లెండింగ్ రేటు కేవలం 1.5 శాతం వద్దే ఉండేది.
అయితే 2018లో తెచ్చిన విధానపరమైన మార్పుల వల్ల చెరకుతో పాటు మొక్కజొన్న, పాడైపోయిన ఆహార ధాన్యాల నుండి కూడా ఇథనాల్ ఉత్పత్తికి మార్గం సుగమమైంది. ఫలితంగా 2020-21లో 8.1 శాతంగా ఉన్న బ్లెండింగ్ రేటు.. ప్రస్తుతం 20 శాతం లక్ష్యానికి చేరుకుంది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ గణాంకాల ప్రకారం.. ఈ మార్పు ముడి చమురు దిగుమతులు తగ్గించడం ద్వారా దేశానికి 1.97 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడమే కాకుండా, దాదాపు 1.66 లక్షల కోట్లకు పైగా మొత్తాన్ని నేరుగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరియు దేశీయ రైతులకు చేరవేసింది.
ఈ దేశీయ ఇంధన లభ్యత వల్ల దేశంలో ఇంధన ధరల పెరుగుదల అదుపులో ఉంది. జూన్ 2022, జూన్ 2026 మధ్య కాలంలో భారతదేశంలో పెట్రోల్ ధరలు కేవలం 5.58 శాతం మాత్రమే పెరిగాయి. ఇది పొరుగున ఉన్న దక్షిణాసియా దేశాలు, అనేక ఐరోపా దేశాలు ఎదుర్కొన్న విపరీతమైన ధరల పెరుగుదలతో పోలిస్తే చాలా తక్కువ.


Click it and Unblock the Notifications
