HCL కొత్త బాస్ రోషిణీ నాడర్ ఎవరు..? ఆమె చరిత్ర ఏంటి..?
ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ హెచ్సీఎల్ టెక్నాలజీస్ బాధ్యతలు ఇప్పటి వరకు తన భుజాలపై వేసుకుని ఆ సంస్థను ఒక స్థాయికి తీసుకొచ్చిన ఛైర్మెన్ శివ్ నాడర్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఛైర్పర్సన్గా కుమార్తె రోషిణీ నాడర్ మల్హోత్రా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ సంస్థ ఎదుగుదల ఒకలా ఉండగా ఇప్పుడు శివ్ నాడర్ కూతురు బాధ్యతలు స్వీకరించాక మరో ఎత్తుకు ఎదుగుతుందని హెచ్సీఎల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంతకీ శివ్నాడర్ కుమార్తె రోషిణీ చరిత్ర ఏంటి..?
చిన్న వయసులో రోషిణీ నాడర్కు పెద్ద బాధ్యతలు
హెచ్సీఎల్ కొత్త ఛైర్పర్సన్గా రోషిణీ నాడర్ మల్హోత్రా నియమితులయ్యారు. ఈమె వయస్సు 38 ఏళ్లు. ఐటీ దిగ్గజ కంపెనీ హెచ్సీఎల్కు ఆమె బాధ్యతలు తీసుకోవడంతో ఆ సంస్థలో పలు మార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్నారు. రోషిణీ నాడర్ శివ్ నాడర్కు ఏకైక కుమార్తె. ఇప్పటి వరకు ఆమె హెచ్సీఎల్ సీఈఓగా మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు. హెచ్సీఎల్ టెక్నాలజీస్ బోర్డుకు వైస్ ఛైర్పర్సన్గా ఉన్నారు. అదే సమయంలో శివ్నాడర్ ఫౌండేషన్కు ట్రస్టీగా కూడా వ్యవహరించారు. తాజాగా హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఛైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టారు.
చేరిన ఏడాదిలోనే సీఈఓగా...
హెచ్సీఎల్లో రోషిణీ నాడర్ చేరిన ఏడాదికే ఆమెను ఆ సంస్థ సీఈఓ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. 2013లో హెచ్సీఎల్ టెక్నాలజీ బోర్డు అడిషనల్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఇక ఆమె ఏ బాధ్యత చేపట్టినా వాటికి న్యాయం చేయగలిగారు. సంస్థను విజయపథంలో నడిపారు. ముఖ్యంగా సంస్థ బ్రాండ్కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో సక్సెస్ అయ్యారు.
ఫోర్బ్స్ జాబితాలో అత్యంత శక్తివంతమైన మహిళ
శివ్ నాడర్ కుమార్తె రోషిణీ మల్హోత్ర ఢిల్లీలో పెరిగారు. అక్కడ వసంత్ వ్యాలీ స్కూలులో విద్యను అభ్యసించారు. ఆ తర్వాత నార్త్ వెస్ట్రన్ యూనివర్శిటీలో కమ్యూనికేషన్స్ విభాగంలో డిగ్రీ చేశారు. అనంతరం ఎంబీఏను అమెరికాలోని కెలాగ్స్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో చేశారు. రోషిణీ నాడర్ మల్హోత్రా ఎన్నో అవార్డులు రివార్డులు దక్కించుకున్నారు. 2017 నుంచి 2019 మధ్య అత్యంత శక్తివంతమైన మహిళగా ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు.