WhatsApp: ఇండియన్సా..మజాకా: దిగొచ్చిన మేనేజ్మెంట్: ఆ డెడ్లైన్ వాయిదా
వాషింగ్టన్: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాట్సప్ (WhatsApp) వెనక్కి తగ్గింది. ప్రైవసీ పాలసీని అంగీకించడానికి ఇదివరకు విధించిన డెడ్లైన్ను వాయిదా వేసింది. తమ కంపెనీ ప్రైవసీ పాలసీని అంగీకరించని వారి అకౌంట్లను తొలగించబోమని స్పష్టం చేసింది. గడువు ముగిసిన తరువాత కూడా ఏ ఒక్కరి అకౌంట్ను తాము డిలేట్ చేయబోమని వాట్సప్ అధికార ప్రతినిధి తెలిపారు. దీనిపై ఓ ప్రటక విడుదల చేశారు. తాము ఇదివరకు ప్రకటించిన ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేసిన భారతీయ యూజర్ల శాతం చాలా తక్కువేనని, అయినప్పటికీ- డెడ్లైన్ దాటి తరువాత కూడా భారత వినియోగదారులకు చెందిన అకౌంట్లను తాము తొలగించట్లేదని స్పష్టం చేశారు.
కరోనా అంతు చూద్దామిక: మరో దేశీయ వ్యాక్సిన్: 12-17 ఏళ్లలోపు వారికీ
వాట్సప్ ప్రైవసీ పాలసీని అంగీకరించని యూజర్ల అకౌంట్లను తొలగిస్తామంటూ ఈ ఏడాది జనవరిలో వాట్సప్ యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. వాట్సప్ను ఓపెన్ చేసినప్పుడు దీనికి సంబంధించిన పాప్-అప్ ఇన్ఫర్మేషన్ వచ్చేది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా యూజర్ల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. చాలామంది వాట్సప్కు ప్రత్యామ్నాయంగా టెలిగ్రామ్ (Telegram), ఇతర మెసేజింగ్ యాప్స్ మీదికి దృష్టి సారించారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని వాట్సప్ యాజమాన్యం- తమ ప్రైవసీ పాలసీని అంగీకరించడానికి కొంత గడువు ఇచ్చింది. ఈ నెల 15వ తేదీని డెడ్లైన్గా ప్రకటించింది.
గడువు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వాట్సప్ యాజమాన్యం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించింది. మే 15 డెడ్లైన్ను వాయిదా వేసినట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రైవసీ పాలసీపై వాట్సప్ వినియోగదారుల్లో కొంత గందరగోళం నెలకొందని, దాన్ని ఎలా తొలగించాలనే విషయంపై కొంతకాలంగా తాము తర్జనభర్జన పడ్డామని పేర్కొన్నారు. తాము చేసిన ప్రకటన యూజర్లకు తప్పుడు సంకేతాలను పంపించినట్లు భావించామని చెప్పారు. గడువు దాటిన తరువాత కూడా తమ ప్రైవసీ పాలసీని అంగీకరించని యూజర్ల అకౌంట్లు డిలేట్ కాబోవని హామీ ఇచ్చారు.