అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న అణు చర్చల్లో ఇప్పుడు ఒక కొత్త పదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదే 'న్యూక్లియర్ డస్ట్' (Nuclear Dust). అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాడిన ఈ పదం వెనుక ఉన్న అసలు అర్థం ఏంటి? అది రెండు దేశాల మధ్య ఒప్పందానికి ఎలా అడ్డుగోడగా మారింది? అనే ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం.
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇరాన్ యుద్ధం (iran war) భయాలు మాత్రం ఇంకా తొలగలేదు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న 'న్యూక్లియర్ డస్ట్' అంశం ఇప్పుడు చర్చల్లో ప్రధాన అడ్డంకిగా మారింది. సాంకేతిక పరిభాషలో దీనిని 'ఎన్రిచ్డ్ యురేనియం' (Enrichment) అంటారు. ఇరాన్ దగ్గర ఉన్న ఈ అణు ఇంధన నిల్వలను పూర్తిగా తొలగించాలన్నది అమెరికా డిమాండ్.

న్యూక్లియర్ డస్ట్ అంటే ఏమిటి?
ఇది శాస్త్రీయ పదం కాదు, ట్రంప్ తనదైన శైలిలో ఇరాన్ అణు నిల్వలను ఉద్దేశించి వాడుతున్న పదం. ముఖ్యంగా జూన్ 2025లో అమెరికా జరిపిన వైమానిక దాడుల తర్వాత, ఇరాన్ అణు కేంద్రాల్లో ధ్వంసమై భూగర్భంలో పాతిపెట్టబడిన యురేనియం నిల్వలను ఆయన 'న్యూక్లియర్ డస్ట్' అని పిలుస్తున్నారు. "ఇరాన్ ఆ అణు ధూళిని మాకు తిరిగి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ వద్ద ప్రస్తుతం 60 శాతం స్వచ్ఛత కలిగిన 400 కిలోల యురేనియం నిల్వలు ఉన్నట్లు అంచనా.
అమెరికా పట్టుబట్టడానికి కారణం ఇదే!
ఇరాన్ దగ్గర ఉన్న ఈ నిల్వలు బాంబు తయారీకి అవసరమైన 90 శాతం స్థాయికి చేరుకోవడం చాలా సులభం. అందుకే ఇరాన్ ఏనాటికీ అణు ఆయుధాన్ని తయారు చేయకూడదని వాషింగ్టన్ పట్టుబడుతోంది. కేవలం నోటి మాటతో కాకుండా, ఆ నిల్వలను ఇరాన్ భూభాగం నుండి పూర్తిగా తొలగించాలని, ఇందుకోసం భారీ యంత్రాలతో (Excavators) ఆ నిల్వలను తవ్వి తీసి అమెరికాకు తరలిస్తామని ట్రంప్ చెబుతున్నారు. రష్యా కూడా ఈ నిల్వలను తాము తీసుకుంటామని ప్రతిపాదించినా, అమెరికా దాన్ని తిరస్కరించింది.
ఇరాన్ మొండికేస్తోంది ఎందుకు?
మరోవైపు ఇరాన్ తన పంథాను మార్చుకోవడం లేదు. అణు విద్యుత్ ఉత్పత్తి తమ హక్కు అని, యురేనియం ఎన్రిచ్మెంట్ను పూర్తిగా వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది. అమెరికా ఈ ప్రక్రియపై 20 ఏళ్ల పాటు నిషేధం విధించాలని కోరుతుండగా, ఇరాన్ మాత్రం కేవలం 3 నుండి 5 ఏళ్ల కాలపరిమితికి మాత్రమే మొగ్గు చూపుతోంది. 2041 నాటికి 20 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి చేయాలనేది ఇరాన్ లక్ష్యం. అయితే, ఇరాన్ దగ్గర పుష్కలంగా చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నప్పుడు ఇంత భారీ స్థాయిలో అణు శక్తి అవసరమా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
సోమవారం నాటి చర్చలపైనే అందరి కళ్లు!
గత వారం ఇస్లామాబాద్లో జరిగిన 21 గంటల మారథాన్ చర్చలు ఎటువంటి నిర్ణయం లేకుండానే ముగిశాయి. తాజాగా ఏప్రిల్ 20, సోమవారం నాడు మరో విడత చర్చలు జరగనున్నాయి. ఇరాన్ తన అణు నిల్వలను అప్పగించడానికి ఒప్పుకుంటుందా? లేక ఈ 'న్యూక్లియర్ డస్ట్' వివాదం మరో ఇరాన్ యుద్ధం (iran war) కు దారితీస్తుందా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అంతర్జాతీయ శాంతి భద్రతలు ఈ ఒప్పందంపైనే ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఇరుపక్షాలు మెట్టు దిగకపోతే, మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా మారడం ఖాయం.


Click it and Unblock the Notifications