WFH: పెరుగుతున్న ఆయిల్ ధరలు! మళ్ళీ ‘వర్క్ ఫ్రమ్ హోమ్' డేస్ రాబోతున్నాయా? మోదీ ఏమన్నారంటే?
పశ్చిమ ఆసియాలో (ఇరాన్-ఇజ్రాయెల్) నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ గ్లోబల్ ఆయిల్ షాక్ నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఒక ఆసక్తికరమైన విజ్ఞప్తి చేశారు. చమురు వినియోగాన్ని తగ్గించడానికి ప్రజలు మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH ) (Work From Home) సంస్కృతిని అవలంబించాలని ఆయన కోరారు. ఈ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి.

ప్రధాని మోదీ ఏమన్నారు?
చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుతున్న తరుణంలో, ఇంధన పొదుపు కోసం పాత పద్ధతులను గుర్తు చేసుకున్నారు ప్రధాని. "కరోనా సమయంలో మనం వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ మీటింగ్స్, వీడియో కాన్ఫరెన్స్ల వంటి వ్యవస్థలను అలవాటు చేసుకున్నాము. ఆ అలవాట్లను మళ్ళీ పునరుద్ధరించుకోవాల్సిన సమయం వచ్చింది" అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ సంక్షోభం కారణంగా అమెరికా, పాకిస్తాన్ వంటి దేశాల్లో ఇంధన ధరలు భారీగా పెరిగినా, భారత్ ఇప్పటివరకు కొంతమేర రక్షణలో ఉందని, అయితే భవిష్యత్తులో పరిస్థితులు మారవచ్చని ఆయన హెచ్చరించారు.
కారణం ఇదే..
ప్రధాని మోదీ WFH ప్రతిపాదన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం దేశ ఆర్థిక వ్యవస్థపై చమురు దిగుమతుల భారాన్ని తగ్గించడమే. భారతదేశం తన చమురు అవసరాల కోసం 85% పైగా విదేశీ దిగుమతులపై ఆధారపడుతోంది, కాబట్టి లక్షలాది మంది ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లడం తగ్గించి ఇంటి నుంచే పనిచేస్తే, వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గి భారీగా ఇంధనం ఆదా అవుతుంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు దేశం నుంచి డాలర్లు బయటకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. మనం చమురు వినియోగాన్ని ఎంత తగ్గిస్తే, అంత తక్కువగా డాలర్లు విదేశాలకు వెళ్తాయి. ఇది రూపాయి విలువ పడిపోకుండా కాపాడుతుంది. ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచుతుంది.
ఐటీ ఉద్యోగుల స్పందన
ప్రధాని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఎక్స్ (X) వేదికగా పెద్ద చర్చకు దారితీశాయి. ఐటీ నిపుణులు తమ కంపెనీలను వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కోరుతున్నారు.
- ఒక యూజర్ స్పందన: "గౌరవనీయ ప్రధాని మోదీ గారు ఇంధన పొదుపు కోసం WFHని ప్రోత్సహించారు. ట్రాఫిక్ తగ్గించడానికి, చమురును ఆదా చేయడానికి , ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఐటీ కంపెనీలు దీనిని అమలు చేయాలి."
- మరో అభిప్రాయం: "ప్రధాని స్వయంగా చెప్పినా, ఒక్క కంపెనీ కూడా హైబ్రిడ్ మోడల్ను అమలు చేయడానికి సిద్ధంగా లేదు. దీనిపై కంపెనీలు ఎప్పుడు స్పందిస్తాయో?" అని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రశ్నించారు.
- ఉత్పాదకతపై చర్చ: మరికొందరు నిపుణులు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) వల్ల ప్రయాణ సమయం ఆదా అవ్వడమే కాకుండా, ఉత్పాదకత (Productivity) కూడా పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
చమురు ధరల సెగ
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు , హార్ముజ్ జలసంధి వద్ద సరఫరా అంతరాయం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు 70 డాలర్ల నుండి ఏకంగా 126 డాలర్లకు చేరుకున్నాయి. దీని ప్రభావం నేరుగా రవాణా ఖర్చులపై పడటమే కాకుండా, నిత్యావసరాల ధరలు పెరగడానికి దారితీస్తుంది.
ఏదేమైనా ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తి కేవలం ఒక సూచన మాత్రమే. కంపెనీలు దీనిని తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. అయితే, ఇంధన ధరల భారం పెరుగుతుంటే, ఉద్యోగులు ఆఫీసులకు రావడం ఆర్థికంగా భారమవుతుందని ఐటీ వర్గాలు వాదిస్తున్నాయి. కార్పొరేట్ ఇండియా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) అప్పీల్ను ఎంతవరకు సీరియస్గా తీసుకుంటుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications