నాయుడుపేటకు మహర్దశ.. రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న వెబ్సోల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునరుత్పాదక ఇంధన రంగంలో మరో కీలక ముందడుగు వేసింది. ముఖ్యంగా సౌరశక్తి తయారీ రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరుచుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో తిరుపతి జిల్లా నాయుడుపేటలోని మల్టీ ప్రోడక్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (MPSEZ)లో భారీ సోలార్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వెబ్సోల్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది. మొత్తం రూ.3,538 కోట్ల పెట్టుబడితో 8 గిగావాట్ల సామర్థ్యం గల పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ సోలార్ తయారీ యూనిట్కు ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ కేంద్రంలో 4 గిగావాట్ల సోలార్ సెల్స్, 4 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్ తయారీ జరుగనుంది.
ఈ Websol ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా సుమారు 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పరిశ్రమతో పాటు అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చెందడంతో పరోక్ష ఉపాధి అవకాశాలు మరింతగా పెరిగే అవకాశముంది. మొత్తం 120 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును రెండు దశల్లో అభివృద్ధి చేయాలని వెబ్సోల్ ప్రణాళిక రూపొందించింది. తొలి దశను 2027 జులై నాటికి, రెండో దశను 2028 జులై నాటికి పూర్తి చేసి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాలనే లక్ష్యంతో కంపెనీ ముందుకు సాగుతోంది.

ఈ సోలార్ తయారీ కేంద్రానికి అవసరమైన విద్యుత్ను పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారానే ఉత్పత్తి చేసుకునే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందుకోసం సుమారు 300 ఎకరాల భూమిని కేటాయించగా, ఇందులో భాగంగా వెబ్సోల్ 100 మెగావాట్ల సామర్థ్యం గల స్వంత సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇది తక్కువ ఖర్చుతో విద్యుత్ సరఫరా అందించడమే కాకుండా, కార్బన్ ఉద్గారాలను తగ్గించే దిశగా కూడా కీలకంగా నిలవనుంది.
ఈ పెట్టుబడితో నాయుడుపేటతో పాటు సమీపంలోని దక్షిణ తమిళనాడు పారిశ్రామిక కారిడార్ దేశంలోనే ప్రముఖ సోలార్ తయారీ హబ్గా రూపాంతరం చెందనుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ప్రీమియర్ ఎనర్జీస్, టాటా పవర్, వోల్ట్సన్ వంటి పెద్ద కంపెనీలు తమ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. దీని ఫలితంగా సరఫరాదారులు, లాజిస్టిక్స్ సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, పోర్టు కనెక్టివిటీ వంటి అంశాలతో ఒక సమగ్ర పారిశ్రామిక ఎకోసిస్టమ్ ఏర్పడుతోంది.
ఈ ప్రాజెక్టుపై వెబ్సోల్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ సోహన్ లాల్ అగర్వాల్ మాట్లాడుతూ.. భారత్ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంతో ముందుకు సాగుతున్న ఈ సమయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి లభించిన మద్దతు మా విస్తరణ ప్రణాళికలకు బలాన్నిస్తోంది. అనుకూల పారిశ్రామిక వాతావరణం మా 8 గిగావాట్ల వృద్ధి లక్ష్యాలను అమలు చేయడానికి సహకరిస్తుందని అన్నారు.
ఈ పెట్టుబడిని స్వాగతించిన రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్, వెబ్సోల్ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ను క్లీన్ ఎనర్జీ తయారీకి దేశంలోనే అత్యంత పోటీతత్వ గమ్యస్థానంగా మార్చుతుందని పేర్కొన్నారు. వేగవంతమైన భూ కేటాయింపులు, సింగిల్-డెస్క్ అనుమతులు, విశ్వసనీయ విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలతో రాష్ట్రం గ్లోబల్ స్థాయిలో పోటీ పడే సోలార్ తయారీ వాతావరణాన్ని నిర్మిస్తోందని ఆయన స్పష్టం చేశారు


Click it and Unblock the Notifications


