కరోనా వైరస్ దెబ్బకు ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం... ఏం జరుగుతుందో తెలుసా?
కంటికి కనిపించని ఒక చిన్న వైరస్... మొత్తం 700 కోట్ల జనాభా ఉన్న ప్రపంచాన్ని వణికిస్తోంది. నిజంగా ఇదొక సంక్షోభ సమయం. ఎవరో చేసిన పాపానికి మరెవరో మూల్యం చెల్లిస్తున్నారు. ఈ వైరస్ కు ఏ మాత్రం కరుణ లేకపోవటం ప్రపంచ మానవాళికి శాపంగా మారింది. చైనా లోని వుహాన్ నగరంలో మొదలైన కరోనా వైరస్ తొలుత కేవలం ఆ రాష్ట్రానికి, లేదా చైనా దేశం వరకే పరిమితం అవుతుందని అంతా అనుకున్నారు. దాని ప్రభావాన్ని చాలా తక్కువగా అంచనా వేశారు. కొందరైతే తేలిగ్గా తీసిపారేశారు కూడా. కానీ, ఆ వైరస్ ఒక్కక్క దేశానికే విస్తరిస్తూ ప్రస్తుతం 198 దేశాలనూ చుట్టేసింది. ఇప్పటికే 25,000 మంది ప్రజల ప్రాణాలను కబళించి 6 లక్షల మందికి సోకింది. అగ్ర రాజ్యం అమెరికా సైతం కరోనా దెబ్బకు చిగురుటాకులా వణికిపోతోంది. కరోనా పాజిటివ్ కేసుల్లో అమెరికా చైనా ను కూడా దాటేసింది. అక్కడ లక్ష మందికి కరోనా సోకింది. ఇప్పటికే 1,300 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇటలీ, స్పెయిన్, ఇరాన్, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు కరోనా వైరస్ తో బాగా ప్రభావితం అవుతున్నాయి. ఇందులో చాలా దేశాలు కరోనా మొదలైన తొలి నాళ్లలో దానిని తేలిగ్గా తీసుకున్న వారే కావటం గమనార్హం. ప్రపంచం మొత్తం వ్యాపించిన కరోనా వైరస్ ఇప్పుడు కేవలం ఆరోగ్య సంబంధమైన విషయమే కాకుండా ఆర్థిక ప్రభావాన్ని చూపుతోంది.
అప్పటికే యాక్ట్ ఆఫ్ గాడ్ విజ్ఞప్తుల వెల్లువ, వీరికి EMI ఊరట రెండు నెలలే!
మాంద్యంలోనే ఉన్నాం...
పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్ (ఐఎంఎఫ్)... ఇప్పటికే ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించిందని ప్రకటించింది. ఈ మాంద్యం 2008 లో వచ్చిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే కూడా ప్రమాదకరమైనదిగా మారుతుందన్న అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే పరిస్థితులు చక్కబడితే మాత్రం 2021 లో కొంత పాజిటివ్ వృద్ధి ఉండొచ్చని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. కరోనా వైరస్ ధాటికి ఏ దేశం కూడా మరో 2-3 నెలల వరకు తేరుకునే అవకాశం కనిపించటం లేదు. అంటే ప్రతి దేశం కనిష్టంగా 3 నెలల ఉత్పాదకతను కోల్పోతుంది. అంటే అది ఆ దేశ మొత్తం జీడీపీ లో 25% నికి సమానం. అంటే, సదరు దేశ జీడీపీ వృద్ధి రేటు 25% తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పటి వరకు పాజిటివ్ వృద్ధి లో ఉన్న దేశాలు మందగమనం లోకి జారుకుంటాయి. ఇప్పటికే మందగమనంలో ఉన్న దేశాలు నేరుగా ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తాయి. ఒక ఏడాది పాటు ఇదే తరహా పరిస్థితులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు.
ఆర్థిక ప్యాకేజీ లే దిక్కు...
ఈ పరిస్థితుల్లో ప్రతి దేశం తన ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు గాను ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ లను ప్రకటించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే అమెరికా 2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించగా... భారత్ కూడా రూ 1,70,000 కోట్ల తో ఒక ప్యాకేజీ అందిస్తోంది. దీంతో ఒక్క మన దేశంలో సుమారు 80 కోట్ల మంది ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. భారత్ సహా ప్రపంచ దేశాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్న సందర్భంలో సాధారణ జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అత్యవసర సేవలు మినహా ఇంకేమి అందుబాటులో లేకుండా పోయాయి. ఉద్యోగులు చాలా వరకు వర్క్ ఫ్రొం హోమ్ చేస్తున్నారు. అన్ని రకాల పరిశ్రమలు, కార్యాలయాలు పూర్తిగా మూసివేశారు. నిత్యావసర సరుకులు తప్ప మార్కెట్లో ఇంకేమి అందుబాటులో లేవు.
పెరగనున్న నిరుద్యోగం...
ఎక్కువ కాలం ఆర్థిక మాంద్యం పరిస్థితులు కొనసాగితే చిన్న చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటాయి. దాంతో వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న కోట్లాది మంది జీవనోపాధి కోల్పోతారు. రోజు వారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే ప్రజలకు పనులు దొరక్క చాలా ఇబ్బందులు పడతారు. దీంతో ఒక్క భారత దేశం అనే కాకుండా మొత్తం ప్రపంచమంతా నిరుద్యోగం పెచ్చరిల్లుతుంది. ఆ పరిస్థితిని సరిగ్గా హేండిల్ చేయలేకపోతే కొన్ని దేశాల్లో అంతర్యుద్ధం సంభవించే అవకాశాలు ఉంటాయి. చమురు ధరలు పెరుగుతాయి. జీవన వ్యయం పెరుగుతుంది. కానీ, ఆదాయాలు తగ్గిపోతాయి. ఈ పరిస్థితి ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే, కరోనా ను కట్టడి చేసేందుకు ప్రజలంతా తమ వంతు సాయంగా ఎవరింట్లో వారే ఉండి తమ ప్రాణాలను, తమ కుటుంబాన్ని రక్షించుకోవాలి. మన ప్రాణాల రక్షణ కోసం అహర్నిశలు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి తగిన మద్దతు తెలపాలి. తద్వారా కరోనా మహమ్మారిపై విజయం సాధించి మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొనేలా ఉద్యమ స్ఫూర్తి తో పనిచేద్దాం.