వాషింగ్టన్: వారెన్ బఫెట్.. అపర కుబేరుడు. బెర్క్షైర్ హాత్వే ఛైర్మన్. ఆయన ఆస్తుల విలువ 113 బిలియన్ డాలర్లకు పైమాటే. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ఎప్పుడూ టాప్లో ఉంటారు. మొన్నటికి మొన్నే క్రిప్టో కరెన్సీ మీద తన అభిప్రాయాలను ముక్కుసూటిగా తెలియజేశారు. బిట్ కాయిన్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని కుండబద్దలు కొట్టారు.
ఇప్పుడు మళ్లీ ఆయన వార్తల్లోకి ఎక్కారు. ఆ అపర కుబేరుడితో కలిసి భోజనం చెయ్యాలంటే కోట్లకొద్దీ రూపాయలను ధారపోయాల్సి ఉంటుంది. దీనికోసం ప్రతి సంవత్సరం వేలంపాటల నిర్వహిస్తుంటారు. 2000 సంవత్సరంలో తొలిసారిగా ఈ వేలంపాటను నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన 2020, 2021 మినహా.. ఇప్పటివరకూ ఎక్కడా క్రమం తప్పకుండా ఈ ఆక్షన్ కొనసాగింది.
ఈ సంవత్సరం కూడా వేలంపాటను నిర్వహించారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి వారెన్ బఫెట్తో కలిసి భోజనం చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. దీనికోసం 19 మిలియన్ డాలర్లతో బిడ్డింగ్ దాఖలు చేశారు. ఆ బిడ్డర్ ఎవరనేది ఇంకా తెలియరావట్లేదు. వివరాలను గోప్యంగా ఉంచినట్లు అమెరికన్ మీడియా చెబుతోంది.

19 మిలియన్ డాలర్లంటే.. భారతీయ కరెన్సీలో 1,48,10,78,500 రూపాయలు. ఒక్కసారి వారెన్ బఫెట్తో కలిసి భోజనం చేయడానికి ఇంత మొత్తాన్ని చెల్లించడానికి రెడీ అయ్యాడా అజ్ఞాత వ్యక్తి. ఈ మొత్తాన్ని శాన్ ఫ్రాన్సిస్కోలోని గ్లిడే అనే ఛారిటీ సంస్థకు అందజేస్తుంది బెర్క్షైర్ హాత్వే కంపెనీ. ఈ వేలం పాట బేస్ ప్రైస్ 25,000 డాలర్లు.
ఈ సోమవారం నాడు గరిష్ఠంగా రెండు మిలియన్ డాలర్లకు చేరింది ఆక్షన్. రోజురోజుకూ ఈ బిడ్డింగ్ అమౌంట్ పెరుగుతూ వచ్చింది. అమెరికా కాలమానం ప్రకారం.. శుక్రవారం నాటికి 11 మిలియన్ డాలర్లను టచ్ చేసింది. చివరి నిమిషంలో ఓ అజ్ఞత వ్యక్తి 19 మిలియన్ డాలర్లతో బిడ్డింగ్ దాఖలు చేయడంతో ఈ ప్రక్రియ ముగిసినట్టయింది.


Click it and Unblock the Notifications