Oreva Group: మోర్బీ వంతెన ఘటన.. కష్టాల్లోకి గడియారాల తయారీ కంపెనీ.. అసలు తప్పెవరిది..?
Morbi Bridge: గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీలో కేబుల్ బ్రిడ్జ్ ఆదివారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 134 మందికి పైగా ప్రజలు మరణించారు. ఈ ఘటన దేశంలో పెద్ద సంచనలంగా నిలిచింది. అయితే దీనికి అసలు బాధ్యులు ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిలో మెుదలైంది. అయితే దీని మరమ్మత్తులు చేపట్టిన ఒక వాచ్ కంపెనీ చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది.
వంతెన మరమ్మత్తులు..
మోర్బీ కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో అనేక మంది సామాన్యులు తమ ప్రాణాలను కోల్పోయారు. చాలా పురాతనమైన ఈ వంతెనను పునరుద్ధరించే పనులను అక్కడి మున్సిపల్ పాలకవర్గం గత మార్చిలో ఒరేవా అనే గోడ గడియారాల తయారీ కంపెనీకి అప్పగించింది. అజంతా పేరుతో గడియారాలు తయారు చేసే కంపెనీ దీనికి తోడు ఇతర వ్యాపారాలను సైతం నిర్వహిస్తోంది. అలా కంపెనీ ఈ వంతెన నిర్వహణకు 15 ఏళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది. అలా సందర్శకుల టికెట్ ధరను సైతం కంపెనీనే నిర్ణయించింది.
అనుభవ లోపం..
ఒప్పందం ప్రకారం ఒరేవా కంపెనీ మొత్తం వంతెన పునరుద్ధరణ పనులు చేపట్టింది. కాబట్టి ఈ ప్రమాదానికి కంపెనీయే బాధ్యత వహించాల్సి వస్తోంది. వాచీల తయారీ, ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీతో పాటు మరిన్ని వ్యాపారాల్లో ఉన్నప్పటికీ.. ఇటువంటి నిర్మాణాల నిర్వహణ, నిర్మాణాల్లో కంపెనీకి అనుభవం లేదని చాలా మంది అంటున్నారు. ఇలాంటి కంపెనీకి బాధ్యతలు అప్పగించటం వల్లే ప్రస్తుతం ప్రమాదానికి కారణమైందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
విచారణకు కమిటీ..
సస్పెన్షన్ బ్రిడ్జి ప్రమాదంపై విచారణకు గుజరాత్ ప్రభుత్వం ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ బృందం విచారణ జరిపి ప్రమాదానికి బాధ్యులెవరనే విషయాన్ని నిర్ణయిస్తుంది. ప్రమాదానికి ఎవరి నిర్లక్ష్యం కారణమనే దానిపై విచారణను కమిటీ చేపట్టనుందని తెలుస్తోంది.
తప్పు ఎలా జరిగింది..
బ్రిడ్జి సామర్ధ్యానికి అనుగుణంగా సందర్శకులను పంపాల్సి ఉంటుంది. అలా బ్రిడ్జిపైకి ఒకేసారి 100 మంది మాత్రమే వెళ్లాలనే నిబంధన కూడా ఉంది. కానీ ప్రమాదం జరిగిన సమయంలో వంతెనపై దాదాపు 400 మంది ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం నాలుగు రోజుల్లో వంతెనపై 12 వేల మంది సందర్శనకు వచ్చారు. అయితే ఈ బ్రిడ్జి నిర్వహణ బాధ్యత తీసుకున్న ఒరేవా గ్రూపుది తప్పా? లేక ఎక్కువ మంది సందర్శకులను అనుమతించిన అధికారుల తప్పా? అనే విషయాలు త్వరలోనే కమిటీ దర్యాప్తులో బయటపడనున్నాయి.
ఒరేవా వ్యాపారాలు..
అజంతా మాన్యుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అహ్మదాబాద్ వ్యాపారాలు నిర్వహిస్తున్న ఒరేవా గ్రూప్.. లైటింగ్ ఉత్పత్తులు, బ్యాటరీతో నడిచే బైక్లు, గృహోపకరణాలు, ఎలక్ట్రికల్ భాగాలు, టెలిఫోన్లు, కాలిక్యులేటర్లు, LED టీవీలు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో సహా ఇతర వ్యాపారాలను నిర్వహిస్తోంది.