ఒక్క జూమ్ కాల్తో 900 మందిని తీసేసిన సీఈఓ.. ఇప్పుడు జాబ్ లేక రోడ్డు మీదకు.. విశాల్ గార్గ్ కథ కంచికి..
ఒకే ఒక్క జూమ్ కాల్ ద్వారా ఏకంగా 900 మంది ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాల నుంచి తొలగించి ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ వివాదాలకు కేంద్రబిందువుగా మారిన భారతీయ-అమెరికన్ పారిశ్రామికవేత్త విశాల్ గార్గ్కు కోలుకోలేని షాక్ తగిలింది. ఐదేళ్ల క్రితం తాను సృష్టించిన బెటర్ హోమ్ & ఫైనాన్స్ (Better.com) కంపెనీ బోర్డే ఆయనను సీఈఓ పదవి నుంచి ఏకగ్రీవంగా తొలగించింది. ఆయన నిర్ణయాత్మక లోపం, ప్రవర్తన, విశ్వసనీయతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తూ బోర్డు ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
డిసెంబర్ 2021లో Vishal Garg కేవలం మూడు నిమిషాల వ్యవధి గల జూమ్ కాల్ ఏర్పాటు చేసి.. అందులో ఉన్న 900 మందికి పైగా ఉద్యోగులకు తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్లు బాంబు పేల్చారు. నిర్దాక్షిణ్యంగా జరిగిన ఈ సామూహిక ఉద్యోగాల కోత అంతర్జాతీయంగా విమర్శలకు దారితీయడమే కాకుండా బెటర్ సంస్థ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీసింది. అయితే ఆ తర్వాత కూడా కంపెనీ వరుస నష్టాల్లో కూరుకుపోయింది. 2022 నుంచి ఇప్పటివరకు ఈ డిజిటల్ తనఖా కంపెనీ 1.5 బిలియన్ డాలర్లకు పైగా నష్టాలను చవిచూడగా.. గార్గ్ నాయకత్వంలో కంపెనీ షేర్ల విలువ ఏకంగా 90 శాతానికి పైగా పడిపోయింది.

కరోనా మహమ్మారి సమయంలో వచ్చిన విపరీతమైన డిమాండ్తో ఒకప్పుడు సుమారు 8 బిలియన్ డాలర్ల విలువ కలిగిన బెటర్ కంపెనీ దశ నాటకీయంగా మారిపోయింది. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం దాదాపు 300 మిలియన్ డాలర్లకు పడిపోగా.. 2021లో 1.5 బిలియన్ డాలర్లుగా ఉన్న వార్షిక అమ్మకాలు 2023 నాటికి కేవలం 70 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం బోర్డులో చేరిన హెడ్జ్-ఫండ్ మేనేజర్ డేనియల్ లూయిస్ను తాత్కాలిక సీఈఓగా నియమించారు. అయితే లూయిస్ తనను మోసం చేసి ద్రోహానికి పాల్పడ్డారని గార్గ్ ఆరోపిస్తున్నారు.
కంపెనీ వ్యూహాలు ఫలించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకంతో తనఖా ప్రక్రియ వేగవంతమై లాభదాయకతకు చేరువవుతున్న తరుణంలోనే తనను అన్యాయంగా తొలగించారని గార్గ్ వాదిస్తున్నారు. తన పదవిని తిరిగి దక్కించుకోవడానికి ఆయన ప్రముఖ న్యాయవాది అలెక్స్ స్పిరోను నియమించుకుని పోరాటానికి దిగారు. కంపెనీ లాభాల్లోకి వచ్చే వరకు సంవత్సరానికి కేవలం 1 డాలర్ జీతానికే సీఈఓగా పనిచేస్తానని కూడా ప్రతిపాదించారు. ఒకప్పుడు ఏకపక్షంగా ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించిన ఒక సీఈఓ.. ఇప్పుడు తన స్వంత ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి బోర్డు ముందర విజ్ఞప్తులు చేసుకునే పరిస్థితి రావడం కార్పొరేట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications
