విశాఖ నుంచి బ్యాంకాక్కు డైరెక్ట్ ఫ్లైట్.. అక్టోబర్ 27 నుంచి వారానికి రెండుసార్లు..ఛార్జీలు ఎలా ఉన్నాయంటే..
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. వైజాగ్ నుంచి విదేశాలకు వెళ్లాలనుకునేవారికి నేరుగా ఫ్లైట్ అందుబాటులోకి రానుంది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, వాణిజ్య రాజధాని విశాఖపట్నం అంతర్జాతీయ విమానయాన పటంలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతోంది. నగరంతో పాటుగా ఉత్తరాంధ్ర ప్రాంతపు దశాబ్దాల కలను నిజం చేస్తూ, భోగపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి అక్టోబర్ 27న తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ (APATA), స్థానిక వాణిజ్య బృందాలు సంవత్సరాల తరబడి చేసిన నిరంతర ప్రయత్నాలు, లాబీయింగ్ ఫలితంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థ విశాఖపట్నం నుండి థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్కు నేరుగా.. నాన్స్టాప్ సర్వీసును నడపడానికి శ్రీకారం చుట్టింది. విస్తారమైన ఫార్మాస్యూటికల్ రంగాలు, ప్రధాన ఓడరేవు, అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్లు, బహుళ సముద్రపు ఆహార ఎగుమతి మార్కెట్ ఉన్నప్పటికీ, నాణ్యమైన అంతర్జాతీయ అనుసంధానం లేక ఇక్కడి ప్రయాణికులు, వ్యాపారవేత్తలు విదేశాలకు వెళ్లేందుకు హైదరాబాద్, చెన్నై లేదా న్యూఢిల్లీ వంటి ఇతర నగరాలపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ తాజా విమాన సర్వీసు అందుబాటులోకి రావడం ద్వారా ఆ అడ్డంకి శాశ్వతంగా తొలగిపోనుంది.

విడుదల చేసిన సమయ పట్టిక ప్రకారం.. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఈ సర్వీసును వారానికి రెండుసార్లు నడుపుతుంది. ఫ్లైట్ IX 904 ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 11:30 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి, థాయ్లాండ్ స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:00 గంటలకు బ్యాంకాక్ చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ఫ్లైట్ IX 903 ప్రతి బుధవారం, శనివారం తెల్లవారుజామున 2:10 గంటలకు బ్యాంకాక్ నుండి బయలుదేరి, తెల్లవారుజామున 3:55 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటుంది. ప్రాథమికంగా వన్-వే ఎకానమీ తరగతి ఛార్జీలను రూ. 16,300 నుండి రూ. 19,400 మధ్య నిర్ణయించారు. ఈ విమాన షెడ్యూల్ పర్యాటకులతో పాటు వ్యాపార ప్రాతిపదికన ప్రయాణించే కార్పొరేట్ వర్గాలకు కూడా ఎంతగానో సౌకర్యవంతంగా ఉండనుంది.
ఈ డైరెక్ట్ విమాన మార్గం కేవలం పర్యాటక రంగానికే కాకుండా, ప్రాంతీయ ఆర్థిక రంగానికి బహుముఖ ప్రయోజనాలను చేకూర్చనుందని నిపుణులు భావిస్తున్నారు. థాయ్ బీచ్లు, బౌద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించే పర్యాటకులకు అనుకూలంగా ఉండటంతో పాటు, విశాఖపట్నం ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ) పరిధిలోని సముద్రపు ఆహార (సీఫుడ్) ఎగుమతిదారులు, బల్క్ డ్రగ్ తయారీదారుల వేగవంతమైన కార్గో రవాణాకు ఈ విమానం ఎంతగానో ఉపయోగపడుతుంది.
దీనికితోడు ఆగ్నేయాసియా దేశాల నుండి రోగులను ఉత్తరాంధ్రలోని ఆధునిక ఆసుపత్రులకు తీసుకురావడం ద్వారా మెడికల్ టూరిజం రంగానికి కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. విశాఖపట్నం ఇకపై కేవలం ఒక ప్రాంతీయ కేంద్రంగా మాత్రమే కాకుండా, ప్రపంచానికి ఒక ప్రధాన అంతర్జాతీయ ముఖద్వారంగా నిలవబోతోందని ఏపీఏటీఏ ప్రతినిధులు కె. కుమార్ రాజా, ఓ. నరేష్ కుమార్ డి.ఎస్. వర్మ హర్షం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications
