విజయవాడ రియల్ ఎస్టేట్.. ఈ రెండు ప్రాంతాల్లో మాత్రమే పుల్లు డిమాండ్.. మరెక్కడా కనపడని రాజధాని ఊపు..
Vijayawada Real Estate Insights 2025: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఆనుకుని ఉన్న విజయవాడ నగరం.. దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం 2025 సంవత్సరంలో క్రమంగా పురోగతి చూపించినప్పటికీ.. పరిశ్రమ వర్గాలు ఊహించిన స్థాయిలో వృద్ధి నమోదు కాలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అమరావతి రాజధానిపై ప్రభుత్వ దృష్టి తిరిగి కేంద్రీకరించిన తర్వాత ఈ రంగం వేగంగా పుంజుకుంటుందని భావించినప్పటికీ ఆ ఫలితాలు ఇంకా పూర్తిగా కనిపించలేదని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని క్రెడాయ్ (CREDAI) రాష్ట్ర కార్యదర్శి డి. రాంబాబు మాట్లాడుతూ.. ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగం తమ అంచనాలను అందుకోలేకపోయిందని తెలిపారు. భవన నిర్మాణ అనుమతుల విషయంలో ప్రభుత్వం కొన్ని సానుకూల మార్పులు తీసుకువచ్చినప్పటికీ.. వాటి ప్రభావం మార్కెట్పై ఇంకా పూర్తిగా పడలేదని ఆయన అన్నారు. భవన నిర్మాణ నియమావళి-2017కి చేసిన సవరణలు, స్వీయ ధృవీకరణ పథకం (SCS) 2025, అలాగే NALA చట్టం రద్దు వంటి నిర్ణయాలు ప్రక్రియను సులభతరం చేసినప్పటికీ వ్యాపారం ఆశించినంత స్థాయిలో ఊపందుకోలేదని తెలిపారు.

ఈ మందగమనానికి ప్రధాన కారణంగా ప్రపంచ ఆర్థిక అనిశ్చితి అని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ, ఆర్థిక విధానాల కారణంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు), అలాగే ఎన్ఆర్ఐలు వేచి చూసే పరిస్థితిని అవలంబిస్తున్నారని చెప్పారు. దీని వల్ల పెద్ద స్థాయి పెట్టుబడులు తాత్కాలికంగా తగ్గినట్లు ఆయన వివరించారు. అయితే, పరిస్థితి పూర్తిగా ప్రతికూలంగా లేదని కూడా రాంబాబు స్పష్టం చేశారు.
2024 ప్రారంభం నుంచి అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు సుమారు 15 నుంచి 20 శాతం వరకు పెరిగాయని, కొన్ని ప్రాంతాల్లో నివాస గృహాల డిమాండ్ సంవత్సరానికి 40 శాతం వరకు పెరిగిందని తెలిపారు. నగరంలోని అద్దె మార్కెట్ మాత్రం సగటు స్థాయిలోనే కొనసాగుతోందని ఆయన అన్నారు.
క్రెడాయ్ విజయవాడ చాప్టర్ చైర్మన్ సి. సతీష్ బాబు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజధానిపై స్పష్టత వచ్చినప్పటికీ, అమరావతిలో అవసరమైన మౌలిక వసతులు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదన్నారు. పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరగాలంటే అభివృద్ధి పనులు కళ్ల ముందు కనిపించాలని సూచించారు. ప్రభుత్వ చర్యల ఫలితాలు స్పష్టంగా కనిపించడానికి కనీసం మరో ఒకటి లేదా రెండు సంవత్సరాలు పట్టవచ్చని ఆయన అంచనా వేశారు. ప్రస్తుతం మార్కెట్ అమ్మకందారుల కంటే కొనుగోలుదారులకు అనుకూలంగా ఉందని ఆయన తెలిపారు.
ఇతర అంశాలైన 5 శాతం జీఎస్టీ, 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు, గత పాలనలో తీసుకున్న విధానాల దీర్ఘకాల ప్రభావాలు కూడా రంగంపై ప్రభావం చూపుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడ-గుంటూరు ప్రాంతానికి చెందిన ఎంతో మంది విదేశాల్లో స్థిరపడినందున, ఎన్ఆర్ఐ పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయని, అయితే ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వారి నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయని సతీష్ బాబు అన్నారు.
బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా-అమరావతి చైర్మన్ మాటూరి రంగనాథ్ మాట్లాడుతూ.. వచ్చే పదేళ్లలో విజయవాడ ప్రాంతం గణనీయమైన వృద్ధిని సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే నారెడ్కో సెంట్రల్ జోన్ అధ్యక్షుడు సందీప్ మాండవ మాట్లాడుతూ.. 2025 మొదటి అర్ధభాగం నెమ్మదిగా సాగినప్పటికీ, రెండో అర్ధభాగంలో వ్యాపారం క్రమంగా పుంజుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తాడేపల్లి, పోరంకి, విమానాశ్రయానికి సమీప ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుతోందని.. ఈ ట్రెండ్ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications


