విజయ్ మాల్యా షేర్ల విక్రయం..? 23వ తేదీన సేల్
లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా బకాయిల వసూలుకు ఎస్బీఐ నేతృత్వంలో గల బ్యాంకుల కన్సార్షియం సిద్ధమైంది. మాల్యాకు చెందిన యునైటెడ్ బ్రూవరీస్, యునైటెడ్ స్పిరిట్స్, మెక్డోవెల్స్ హోల్డింగ్స్ కంపెనీల్లో ఉన్న షేర్లను ఈ నెల 23న బ్లాక్ డీల్ ద్వారా అమ్మకానికి పెడుతున్నారు. ఈ అమ్మకం ద్వారా ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం బ్యాంకులకు రూ.6,200 కోట్ల వరకు వసూలయ్యే అవకాశం ఉంది.
బ్లాక్డీల్కు స్పందన లేకపోతే 24 నుంచి బల్క్ లేదా రిటైల్గా అమ్మకాలని బ్యాంకులు భావిస్తున్నాయి. ఈ షేర్ల అమ్మకానికి బెంగళూరు డెట్ రికవరీ ట్రైబ్యునల్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం బ్యాంకులు మాల్యాకు రూ.9,000 కోట్ల వరకు రుణాలుగా ఇచ్చిన సంగతి తెలిసిందే. వడ్డీ కూడా కలిపితే విజయ్ మాల్యా నుంచి రావాల్సిన మొత్తం రూ.12,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
కొన్ని కంపెనీల్లో మాల్యాకు ఉన్న షేర్లతోపాటు మాల్యా పేరు మీద ఉన్న కొన్ని ఆస్తులనూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. వీటి విలువ ఎంత లేదన్నా రూ.12,500 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అసలుతో సరిపెట్టుకోండని మాల్యా చేసిన ప్రతిపాదనను బ్యాంకులు ఇప్పటికే తోసిపుచ్చాయి. పూచీకత్తుగా ఇచ్చిన మాల్యా ఆస్తులు అమ్మి తమ బకాయిలు వసూలు చేసుకోవాలని బ్యాంకులు భావిస్తున్నాయి.