Vedanta: వేదాంత గ్రూప్ సెమీకండక్టర్ ప్రాజెక్ట్ నుంచి తైవానీస్ భాగస్వామి ఫాక్స్కాన్ వైదొలిగిన తర్వాత, కంపెనీ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ బుధవారం మాట్లాడుతూ బహుళ భాగస్వాములు వెంచర్కు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. సెమీకండక్టర్ ప్లాంట్ కోసం 19.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాల్సి ఉందన్నారు. ఈ సంవత్సరం చిప్ తయారీలోకి ప్రవేశించనున్నట్లు స్పష్టం చేశారు. ఇదంతా ప్రభుత్వ అనుమతులపై ఆధారపడి ఉంటుందని చెబుతూనే.. కొత్త భాగస్వామి పేరును అగర్వాల్ వెల్లడించలేదు.
ఫాక్స్కాన్ అని కూడా పిలువబడే హాన్ హై టెక్నాలజీ గ్రూప్.. వేదాంతతో తన చిప్ తయారీ జాయింట్ వెంచర్ నుంచి ఈ వారం ప్రారంభంలో వైదొలిగింది. అయితే ప్రభుత్వ సెమీకండక్టర్ల తయారీ స్కీమ్ కింద విడిగా సొంతంగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నట్లు ఫాక్స్కాన్ తెలిపింది. వేదాంత అప్పులు, చిప్ తయారీకి భారీగా నిధుల అవసరం వంటి విషయాల దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

భారత్ ప్రతి ఏడాది 100 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ను దిగుమతి చేసుకుంటుందని, ఈ రంగంలో పెద్ద అవకాశం ఉందని వేదాంత వార్షిక వాటాదారుల సమావేశంలో అగర్వాల్ వెల్లడించారు. ఇందులో 30 బిలియన్ డాలర్లు విలువైన సెమీకండక్టర్లు, డిస్ప్లే గ్లాస్ ఉన్నాయన్నారు. దేశంలో వేదాంత లిమిటెడ్ ఇప్పటివరకు 35 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిందని చెప్పిన అగర్వాల్.. రాబోయే సంవత్సరాల్లో కంపెనీ వివిధ వ్యాపారాల్లో గణనీయమైన పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రూప్ రూ.14,000 కోట్లును ఇన్వెస్ట్ చేయనున్నట్లు అగర్వాల్ తెలిపారు.
ప్రపంచంలోని చాలా చిప్లు కొన్ని దేశాల్లో తయారు చేయబడతాయి. భారతదేశం ఈ రంగంలో ఆలస్యంగా ప్రవేశించింది. అవి మొబైల్ ఫోన్ల నుంచి రిఫ్రిజిరేటర్లు, కార్ల వరకు వివిధ రకాల పరికరాల్లో ఉపయోగించబడతాయని మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వ ప్రోత్సాహంతో వేదాంత గ్రూప్ ఈ భారీ వ్యాపార అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు అన్నివిదాలా ప్రయత్నాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications