వందే భారత్ ప్రయాణికులకు సూపర్ న్యూస్.. 50 కొత్త స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే..
దేశంలో ప్రీమియం, సుదూర ప్రాంత ప్రయాణ సౌకర్యాలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు భారతీయ రైల్వే రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు పగటిపూట చైర్ కార్ సర్వీసులుగా ప్రయాణికులను అలరించిన వందే భారత్ రైళ్లు, త్వరలోనే సుదూర రాత్రి ప్రయాణాల కోసం 'వందే భారత్ స్లీపర్' రూపంలో రూపుదిద్దుకుంటున్నాయి. ప్రయాణికుల నుంచి వస్తున్న విపరీతమైన డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని.. చెన్నైలోని ప్రతిష్టాత్మక ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) ద్వారా ఏకంగా 50 స్వదేశీ వందే భారత్ స్లీపర్ రైలుసెట్లను ఉత్పత్తి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
ఈ నూతన ప్రాజెక్టులో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం కోచ్ల సంఖ్య అని చెప్పవచ్చు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్గా నడుస్తున్న 16-కోచ్ల స్లీపర్ రైళ్లతో పోలిస్తే, కొత్తగా రాబోయే రైలుసెట్లలో ఏకంగా 24 కోచ్లు ఉండనున్నాయి. దీనివల్ల ప్రయాణీకుల మోసుకెళ్లే సామర్థ్యం సుమారు 1.5 రెట్లు గణనీయంగా పెరుగుతుంది. ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్రయాణ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఈ విస్తరణ ప్రణాళికను రూపొందించారు. ICF జనరల్ మేనేజర్ మనీష్ అగర్వాల్ అందించిన సమాచారం ప్రకారం.. ఈ 24-కోచ్ల స్లీపర్ రైలుసెట్లకు సంబంధించిన కోచ్ నిర్మాణం, ఇంటర్కనెక్షన్ వ్యవస్థలు, అండర్ఫ్రేమ్ పరికరాల ప్రొడక్షన్ డ్రాయింగ్లు, డిజైన్లు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి.

రైల్వే శాఖ ఇంకా అధికారిక కోచ్ కూర్పును ధ్రువీకరించనప్పటికీ.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 24-కోచ్ల వందే భారత్ స్లీపర్ రైలులో 17 ఏసీ 3-టైర్, 5 ఏసీ 2-టైర్, 1 ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్లతో పాటు ప్రయాణికులకు తాజా ఆహారాన్ని అందించడానికి ఒక ప్యాంట్రీ కార్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం దేశంలో హౌరా, కామాఖ్య మధ్య 16 కోచ్లతో (11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, 1 ఫస్ట్ ఏసీ) నడుస్తున్న వందే భారత్ స్లీపర్ సర్వీస్కు ప్రయాణికుల నుండి విశేష ఆదరణ లభిస్తుండటంతో.. కొత్తగా రాబోయే 50 రైలుసెట్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన మెట్రో నగరాలు, పర్యాటక కేంద్రాలను అనుసంధానిస్తూ సుదూర మార్గాల్లో స్లీపర్ సేవలను విస్తరించనున్నారు.
మరోవైపు సామాన్య ప్రయాణికులకు తక్కువ ధరలోనే అత్యాధునిక ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే దిశగా 'అమృత్ భారత్ 3.0' రైళ్ల ఉత్పత్తిపై కూడా ICF కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం నడుస్తున్న అమృత్ భారత్ రైళ్లలో కేవలం జనరల్, నాన్-ఏసీ స్లీపర్ కోచ్లు మాత్రమే నిండి ఉన్నాయి. అయితే ప్రయాణికుల పరిధిని మరింత విస్తరించడానికి, తదుపరి తరం అమృత్ భారత్ 3.0 వేరియంట్లో నాన్-ఏసీ కోచ్లతో పాటు ఏసీ కోచ్లను కూడా ప్రత్యేకంగా చేర్చబోతున్నారు. దీనివల్ల సామాన్యులకు కూడా బడ్జెట్ ధరల్లో ఏసీ ప్రయాణం సాధ్యమవుతుంది.
ICFలోని వేగవంతమైన ఉత్పత్తి ప్రణాళికలు భారత్లో రైల్వే మౌలిక సదుపాయాల స్వరూపాన్నే మార్చివేసేలా ఉన్నాయి. ఒకవైపు అధిక సామర్థ్యం కలిగిన వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రీమియం విభాగాన్ని బలోపేతం చేస్తుండగా, మరోవైపు అమృత్ భారత్ 3.0 రైళ్లు సామాన్య, మధ్యతరగతి ప్రయాణికులకు ఆధునిక సేవలను చేరువ చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ రెండు రైళ్ల ప్రవేశంతో భారతీయ రైల్వేల్లో ప్రయాణ వేగం, సౌకర్యం మరియు సామర్థ్యం గణనీయంగా పెరగనున్నాయి.


Click it and Unblock the Notifications
