ఏపీ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు సూపర్ న్యూస్.. మరో వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ వచ్చేస్తోంది..
భారత సిలికాన్ సిటీ, దేశ ఐటీ రాజధాని బెంగళూరు.. అలాగే ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన తీరప్రాంత నగరమైన విశాఖపట్నం మధ్య ప్రయాణించే ప్యాసింజర్లు, ఐటీ నిపుణులకు.. దక్షిణ తీర రైల్వే (SCoR) ఒక గొప్ప శుభవార్త అందించింది.
ఈ రెండు నగరాల మధ్య రాత్రిపూట ప్రయాణ సౌకర్యాన్ని మరింత వేగవంతం చేసేందుకు కొత్తగా వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ సర్వీసును ప్రారంభించాలని లాంఛనంగా ప్రతిపాదించింది. ఈ మేరకు సిద్ధం చేసిన నివేదికను రైల్వే బోర్డు తుది ఆమోదం కోసం పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లకు 17 నుండి 21 గంటల సమయం పడుతుండగా.. ప్రతిపాదిత వందే భారత్ స్లీపర్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం దాదాపు 15 గంటల కంటే తక్కువకు తగ్గిపోనుంది.

ఈ ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం.. ఈ వందే భారత్ స్లీపర్ రైలును వారంలో ఆరు రోజుల పాటు నడపాలని దక్షిణ తీర రైల్వే యోచిస్తోంది. బెంగళూరు నుండి బయలుదేరే సర్వీసు మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లోనూ, అలాగే విశాఖపట్నం నుండి తిరుగు ప్రయాణమయ్యే సర్వీసు సోమవారం మినహా వారంలో మిగిలిన అన్ని రోజుల్లోనూ ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ప్రయాణ వేళల విషయానికొస్తే.. బెంగళూరులో రాత్రి 8.00 గంటలకు బయలుదేరే రైలు.. మరుసటి రోజు ఉదయం 10.00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో వైజాగ్లో రాత్రి 8.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.00 గంటలకు బెంగళూరు చేరుకునేలా వేళలను ఖరారు చేశారు.
ఈ రైలు ధర్మవరం, గుంటూరు, విజయవాడ, నంద్యాల, గూటిల మీదుగా సుమారు 1,061 కిలోమీటర్ల మేర సాగనుంది. ప్రయాణికుల సౌకర్యార్థం రెండు వైపులా ధర్మవరం, నంద్యాల, కృష్ణా కెనాల్ జంక్షన్, దువ్వాడ రైల్వే స్టేషన్లలో అధికారికంగా స్టాప్లు కల్పించనున్నారు. సాధారణంగా దేశంలో నడిచే ఇతర వందే భారత్ స్లీపర్ రైళ్లు 16 కోచ్లతో నడుస్తుండగా.. బెంగళూరు, వైజాగ్ మధ్య ఉండే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ సర్వీసును ఏకంగా 20 కోచ్ల భారీ రేక్తో నడపాలని రైల్వే వర్గాలు నిర్ణయించాయి.
వందే భారత్ స్లీపర్ రైళ్లకు గంటకు 160 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే సాంకేతిక సామర్థ్యం ఉన్నప్పటికీ.. ఈ మార్గంలోని ట్రాక్ పరిమితుల కారణంగా సగటున గంటకు 75 కిలోమీటర్ల వేగంతో మాత్రమే రైలు ప్రయాణిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ బెంగళూరులో చదువుకుంటూ, వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రవాసులకు, తీరప్రాంత ప్రయాణికులకు రాత్రిపూట ఈ వేగవంతమైన స్లీపర్ సర్వీస్ ఎంతో ఊరట కలిగించనుంది.


Click it and Unblock the Notifications
