సముద్రం మధ్యలో భారీ విమానాశ్రయం.. ఇండియాలో మొట్టమొదటి సారిగా అద్భుతం!
భారతదేశం మౌలిక సదుపాయాల రంగంలో మరో చారిత్రాత్మక అడుగు వేయడానికి సిద్ధమైంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా తీరంలో ఉన్న వధవన్ వద్ద దేశంలోనే మొట్టమొదటి ఆఫ్ షోర్ ఎయిర్ పోర్ట్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది భూమి మీద కాకుండా అరబిక్ సముద్రంలో కృత్రిమంగా సృష్టించిన ద్వీపంలో నిర్మితం కానుంది. మన దేశంలో ఇప్పటివరకు ఇలాంటి సాహసోపేతమైన ఇంజనీరింగ్ అద్భుతం ఎప్పుడూ జరగలేదు. ముంబై లాంటి మెట్రో నగరాల్లో భూమి కొరత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. సముద్రాన్ని భూమిగా మార్చి విమానాశ్రయం కట్టడం అనేది ఒక విప్లవాత్మక నిర్ణయం అని చెప్పవచ్చు.

సముద్రంపై విమానాశ్రయం.. ఖర్చు ఎంతో తెలుసా?
ఈ భారీ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ. 45,000 కోట్లు. ఇందులో విశేషం ఏమిటంటే.. కేవలం సముద్రపు నీటిని వెనక్కి నెట్టి భూమిని సృష్టించడానికి (Land Reclamation) రూ. 25,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. అంటే ప్రాజెక్ట్ వ్యయంలో సగానికి పైగా కేవలం భూమి తయారీకే కేటాయిస్తున్నారు. మిగిలిన రూ. 20,000 కోట్లతో అత్యాధునిక విమానాశ్రయ టెర్మినల్స్, రన్వేలు, ఇతర ఆధునిక సదుపాయాలను నిర్మిస్తారు. జపాన్లోని కన్సాయ్ లేదా హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయాల తరహాలో ఈ వధవన్ ఎయిర్ పోర్ట్ (vadhavan airport) రూపుదిద్దుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఆఫ్షోర్ ఎయిర్పోర్టులు చాలా తక్కువగా ఉన్నాయి, ఇప్పుడు భారత్ కూడా ఆ వరుసలో చేరబోతోంది.
90 మిలియన్ల ప్రయాణికులు.. 3 మిలియన్ టన్నుల కార్గో!
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నవీ ముంబై ఎయిర్పోర్ట్లపై పెరుగుతున్న రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్ట్ ఒక గేమ్ చేంజర్ కానుంది. ఈ విమానాశ్రయం పూర్తయితే ఏటా సుమారు 9 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇది భారతదేశంలోని అతిపెద్ద విమానాశ్రయాలలో ఒకటిగా నిలుస్తుంది. కేవలం ప్రయాణికులే కాకుండా, అంతర్జాతీయ వాణిజ్యానికి ఇది ప్రధాన కేంద్రంగా మారబోతోంది. ఏటా 3 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను హ్యాండిల్ చేసేలా దీనిని డిజైన్ చేస్తున్నారు. వధవన్ డీప్-డ్రాఫ్ట్ పోర్ట్ పక్కనే ఉండటం వల్ల సముద్ర, వాయు మార్గాల ద్వారా వస్తువుల రవాణా అత్యంత వేగంగా, సులభంగా జరుగుతుంది.
అద్భుతమైన కనెక్టివిటీ.. ప్రయాణం ఇక చాలా ఈజీ!
వధవన్ విమానాశ్రయానికి చేరుకోవడం ప్రయాణికులకు ఏమాత్రం కష్టం కాకుండా ప్రభుత్వం భారీ ప్లాన్ వేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా పలు కనెక్టివిటీ మార్గాలను అభివృద్ధి చేస్తున్నారు. ప్రధానంగా వడోదర-ముంబై ఎక్స్ప్రెస్వేకి ఈ విమానాశ్రయాన్ని నేరుగా అనుసంధానిస్తారు. అలాగే వెస్ట్రన్ రైల్వే నెట్వర్క్ మరియు ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్తో కూడా దీనిని లింక్ చేస్తారు. దీనివల్ల గుజరాత్, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుండి ప్రయాణికులు చాలా తక్కువ సమయంలో ఎయిర్పోర్ట్కు చేరుకోవచ్చు. అదనంగా, ఉత్తన్-విరార్ సీ లింక్ ద్వారా కూడా రోడ్డు మార్గాన వేగంగా చేరుకునే అవకాశం ఉంటుంది.
భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త బూస్ట్
మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కంపెనీ (MADC) ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రి-ఫీజిబిలిటీ స్టడీని దాదాపు పూర్తి చేసింది. ఇది కేవలం ఒక విమానాశ్రయం మాత్రమే కాదు, ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ (IMEC) లో కీలక భాగం కానుంది. వధవన్ పోర్ట్ ద్వారా వచ్చే భారీ కంటైనర్లు, ఇక్కడి విమానాశ్రయం ద్వారా జరిగే ఎగుమతులు దేశ జీడీపీలో కీలక పాత్ర పోషిస్తాయి. దీనివల్ల లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.


Click it and Unblock the Notifications


