ఆగస్ట్ 15 కు కరోనా వాక్సిన్ రెడీ? తయారీలో బిజీ గా ఉన్న భారత్ బయోటెక్!
ప్రపంచ మానవాళిని వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ కు వాక్సిన్ సిద్ధమవుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగష్టు 15 నాటికే అది సిద్ధం కానున్నట్లు సమాచారం. అదే జరిగితే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజే... కరోనా వైరస్ నుంచి ప్రజలకు మహమ్మారి నుంచి విముక్తి కూడా లభించే అవకాశం ఉంది. ఈ వాక్సిన్ ను మన తెలుగు కంపెనీ తయారు చేస్తుండటం విశేషం. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్... ఇప్పటికే ఇండియా లో కరోనా వైరస్ వాక్సిన్ తయారు చేసేందుకు తగిన క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు అనుమతులు పొందింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఈ మేరకు భారత్ బయోటెక్ కు అనుమతులు మంజూరు చేసింది.
ఇది మంచి పద్ధతి కాదు, WTO రూల్స్కు విరుద్ధం: 59 యాప్స్ నిషేధంపై చైనా వార్నింగ్
దీంతో మనుషులపై ఫేజ్ -1, పేజ్ -2 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు మార్గం సుగమం ఐంది. సాధారణంగా ఐతే ఈ పరీక్షలు నిర్వహించేందుకు కనీసం 6 నెలల సమయం పడుతుంది. కానీ, ప్రస్తుతం నెలకొన్న అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో అటు ప్రభుత్వం నుంచి, ఇటు నియంత్రణ సంస్థల నుంచి వాక్సిన్ తయారు చేసే కంపెనీలకు ఊహించిన దానికంటే అధికంగా మద్దతు లభిస్తోంది. దీంతో నెల రోజుల్లోనే క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసి, వాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఐసిఎంఆర్ తో జట్టు...
కరోనా వాక్సిన్ అభివృద్ధి కోసం భారత్ బయోటెక్ ... ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తో చేతులు కలిపింది. ఈ రెండు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో పరిశోధనల్లో వేగం పెంచారు. కరోనా వైరస్ టీకా అభివృద్ధి చేసేందుకు తొలుత ఐసిఎంఆర్ తన పరిశోధన సామర్థ్యంతో వాక్సిన్ కాండిడేట్ ను రూపొందించింది. దానిని అభివృద్ధి చేసేందుకు భారత్ బయోటెక్ ను ఆశ్రయించింది. ఇప్పుడు వాటి పరిశోధనల ఫలితంగా జంతువుల మీద జరిపిన ప్రీ క్లినికల్ పరీక్షల్లో వాక్సిన్ మెరుగైన పనితీరును కనబరిచింది. సంబంధిత డేటా ను దేశంలో అత్యుత్తమ ఔషధ నియంత్రణ సంస్థ ఐన డీసిజిఐ కు సమర్పించగా... క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు అది అనుమతించింది. దీంతో దేశంలో తోలి టీకా అభివృద్ధి దిశగా ఒక భారీ ముందగుడు పడింది.
ఇక్కడ నిమ్స్... అక్కడ కింగ్ జార్జ్...
ప్రస్తుతం 'కోవాక్సీన్' పేరుతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన వాక్సిన్ కు సంబంధించి వచ్చే వారమే క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టనున్నారు. ఐతే మనుషులపై జరపాల్సిన ఈ క్లినికల్ ట్రయల్స్ కోసం... హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్స్, విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్స్ ను ఐసిఎంఆర్ ఎంపిక చేసింది. వీటితో పాటు దేశవ్యాప్తంగా 12 ఆస్పత్రులను ఇందుకోసం గుర్తించారు. వీటన్నిటికి స్వయంగా ఐసిఎంఆర్ డైరెక్టర్ ఒక లేఖ రాశారు. అందులో ప్రస్తుతం కరోనా వాక్సిన్ ను భారత్ బయోటెక్ తయారు చేస్తోంది. ఆగష్టు 15 నాటికి వాక్సిన్ ను సిద్ధం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా అత్యున్నత స్థాయిలో దీనిని పర్యవేక్షిస్తోంది. కాబట్టి, మీరంతా క్లినికల్ ట్రయల్స్ కు సహకరించి అనుకున్న సమయానికి టీకా అందుబాటులోకి వచ్చేందుకు మద్దతునివ్వాలని కోరారు. దీంతో ఆగష్టు 15 నాటికి కరోనా వాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనాలు పెరిగిపోతున్నాయి.
భిన్నాభిప్రాయాలు...
సాధారణంగా ఒక వాక్సిన్ అభివృద్ధి చేసేందుకు కనీసం 5-6 సంవత్సరాలు పడుతుంది. కానీ, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోటి కి పైగా మంది ప్రజలు ఈ మహమ్మారి బారిన పడటం... 5 లక్షలకు పైగా ప్రజలు మరణించటంతో వాక్సిన్ ను త్వరగా అందుబాటులోకి తీసుకు రావాలని అటు వాక్సిన్ కంపెనీలు, ఇటు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. నియంత్రణ సంస్థలు వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల వాక్సిన్ కంపెనీలు ప్రస్తుతం వాక్సిన్ అభివృద్ధి లో నిమగ్నమయ్యాయి. కానీ, ఇంత వేగంగా ఎక్కడ కూడా వాక్సిన్ అందుబాటులోకి రాలేదు. దాంతో భారత్ బయోటెక్, ఐసిఎంఆర్ సంయుక్తంగా తీసుకొస్తున్న వాక్సిన్ పై నిపుణులు రెండు వర్గాలుగా విడిపోయారు. క్లినికల్ పరీక్షలు సరిగ్గా నిర్వహించకుండానే, వాక్సిన్ పనితీరును పూర్తిస్థాయిలో అంచనా వేయకుండానే దానిని అందుబాటులోకి తీసుకురావటమేమిటని ప్రశ్నిస్తున్నారు. అది ప్రాణాలతో చెలగాటమే అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.