అమెరికా-ఇరాన్ పరస్పర దాడులు.. శాంతి ఒప్పందం అంతా తుస్సే.. ట్రంప్ తాజాగా మరో హెచ్చరిక..
పశ్చిమాసియాలో నెత్తుటి యుద్ధాన్ని ముగించేందుకు తెరవెనుక తీవ్ర దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇటు ఇరాన్, అటు అమెరికాలు క్షేత్రస్థాయిలో మాత్రం తగ్గేదేలేదన్నట్లుగా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఏప్రిల్ ఆరంభంలో తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ, ఇరు దేశాల మధ్య దాడుల పరంపర, తీవ్రమైన రాజకీయ విభేదాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి.
తాజాగా వారాంతంలో ఇరాన్ యొక్క రాడార్, డ్రోన్ నియంత్రణ కేంద్రాలపై తాము విజయవంతంగా ఆత్మరక్షణ దాడులు జరిపినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. అంతర్జాతీయ జలాలపై ప్రయాణిస్తున్న తమ 'MQ-1' డ్రోన్ను ఇరాన్ కూల్చివేయడానికి ప్రతిస్పందనగానే తాము ఇరాన్లోని గోరుక్ నగరం, ఖేష్మ్ ద్వీపాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఈ దాడిలో Iran ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, ఒక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, రెండు వన్-వే అటాక్ డ్రోన్లు ధ్వంసమయ్యాయి.

దీనికి ప్రతికారంగా, హార్మోజ్గాన్ ప్రావిన్స్లోని సిరిక్ ద్వీపంలో ఉన్న తమ టెలికమ్యూనికేషన్స్ టవర్పై అమెరికా జరిపిన దాడి మూలాన్ని, అంటే వారి వైమానిక స్థావరాన్ని తాము లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. సోమవారం ఉదయం కువైట్ సైన్యం తాము శత్రు క్షిపణి, డ్రోన్ ముప్పులకు ప్రతిస్పందిస్తున్నామని సామాజిక మాధ్యమం X లో పోస్ట్ చేయడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. కువైట్లో ఉన్న అమెరికా వైమానిక స్థావరాన్నే ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, అమెరికా దాడులు ఇలాగే కొనసాగితే తమ ప్రతిస్పందన పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఇరాన్ గట్టిగా హెచ్చరించింది.
ఈ సుదీర్ఘ చర్చలు, ఆలస్యాన్ని విమర్శించేవారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఇరాన్ నిజంగానే ఒక ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటోందని, అది అమెరికాకు, తమ మిత్రదేశాలకు మంచి ఒప్పందం అవుతుందని చెబుతూ అందరినీ నిశ్చింతగా కూర్చోవాలని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఈ ఒప్పందానికి ట్రంప్ పెడుతున్న నిబంధనలు అత్యంత కఠినంగా ఉన్నాయి.
ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని తయారు చేయబోమని లిఖితపూర్వకంగా అంగీకరించాలని, ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు వాటా ఉన్న కీలకమైన హార్ముజ్ జలసంధిని అన్ని దేశాల నౌకా రవాణా కోసం పూర్తిగా తెరిచి ఉంచాలని, అలాగే ఆ జలమార్గంలో ఇరాన్ వేసిన మందుపాతరలను పూర్తిగా ధ్వంసం చేయాలని ట్రంప్ డిమాండ్ చేశారు. కానీ ట్రంప్ ఇలాంటి మితిమీరిన డిమాండ్లతో కావాలనే చర్చలను అడ్డుకుంటున్నారని ఇరాన్ ఎదురుదాడి చేస్తోంది.
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభించిన ఈ యుద్ధం కారణంగా ఇప్పటికే ఇరాన్, లెబనాన్లలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణల్లో 13 మంది అమెరికా సైనికులు కూడా మరణించారు. ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోయి గ్లోబల్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఒకవైపు అమెరికా-ఇరాన్ చర్చలు జరుగుతున్నా, ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా మిలీషియాపై ఇజ్రాయెల్ తన దాడులను ఆపడం లేదు. గత 25 ఏళ్లలోనే ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లోకి అత్యంత లోతుగా చొరబడి, వ్యూహాత్మక కోట అయిన బ్యూఫోర్ట్ రిడ్జ్ను స్వాధీనం చేసుకుంది. లెబనాన్లోని మరిన్ని ప్రాంతాలపై తమ ప్రత్యక్ష నియంత్రణ ఉండాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పట్టుబడుతున్నారు.
ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. నెతన్యాహు మరియు లెబనీస్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్లతో మాట్లాడి ఒక సరికొత్త ప్రణాళికను ప్రతిపాదించారు. అయితే, లెబనాన్లో శాంతి నెలకొనడం మరియు కాల్పుల విరమణ జరగడం అనేది అమెరికా-ఇరాన్ తుది ఒప్పందానికి అత్యంత కీలకమని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ స్పష్టం చేశారు. అలాగే ఇరాన్ వాణిజ్య నౌకలపై అమెరికా దాడులు చేయడం యుద్ధ విరమణ నిబంధనలను ఉల్లంఘించడమేనని ఇరాన్ మండిపడుతోంది. సంప్రదింపులు ఒకవైపు, క్షిపణి దాడులు మరోవైపు జరుగుతుండటంతో పశ్చిమాసియా భవిష్యత్తు ప్రస్తుతం సందిగ్ధంలో పడింది.


Click it and Unblock the Notifications
