భారత ఐటీ నిపుణులకు గుడ్న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి హెచ్1బీ వీసాల స్వీకరణ
హెచ్1బీ వీసాల కోసం ఎదురుచూస్తోన్న భారతీయ ఐటీ నిపుణులకు ఇది నిజంగా శుభవార్తే. ఈ వీసాలకు సంబంధించిన దరఖాస్తులను 2020 ఏప్రిల్ 1 నుంచి స్వీకరించనున్నట్లు అమెరికా జాతీయ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ ప్రకటించింది. 2021 సంవత్సరానికి హెచ్1 బీ (నాన్-ఇమ్మిగ్రెంట్) వీసాల జారీకి అవసరమైన ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్సిఐఎస్) శుక్రవారం వెల్లడించింది.
భారతదేశం, చైనా వంటి దేశాల నుండి ఏటా వేల మంది ఐటీ ఉద్యోగుల కోసం ఆయా కంపెనీలు ఈ హెచ్1 బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటాయి. దీనికోసం అవి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోనున్నాయి. ఎందుకంటే, హెచ్1బీ కోసం దరఖాస్తులు సమర్పించే ఐటీ కంపెనీలు ఆన్లైన్లో నమోదు చేసుకుని, ప్రాసెసింగ్ ఫీజు కింద 10 అమెరికన్ డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది.
ఏప్రిల్ 1, 2020 నుండి హెచ్1బీ వీసాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ కొత్త ప్రక్రియ ద్వారా పరిమితికి లోబడి హెచ్1బీ వీసాలను దక్కించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా సులభమే. ఆయా కంపెనీలు తమ కంపెనీకి సంబంధించిన ప్రాథమిక సమాచారం ఇస్తే సరిపోతుంది.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. మార్చి 1 నుండి 20వ తేదీ వరకు మాత్రమే ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు గడువు ఉన్నట్లు యుఎస్సీఐఎస్ పేర్కొంది.