హార్ముజ్ జలసంధి వద్ద టెన్సన్.. ఇరాన్ మీద డ్రోన్లతో విరుచుకుపడిన అమెరికా.. టెహ్రాన్ స్పందన ఏంటంటే..
పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ నివురుగుప్పిన నిప్పులా మారాయి. దాడులు, ప్రతిదాడులతో అగ్ని గుండంలా మారుతోంది మధ్యప్రాచ్యం. తాజాగా హార్ముజ్ జలసంధిలో మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ జరిపిన దాడుల నేపథ్యంలో..అమెరికా ఆ దేశంపై తీవ్రమైన సైనిక, ఆర్థిక చర్యలకు దిగింది. అంతర్జాతీయ జలమార్గంలో ప్రయాణిస్తున్న అమాయక పౌరుల నౌకలను లక్ష్యంగా చేసుకున్నందుకు ఇరాన్కు భారీ మూల్యం చెల్లించేలా చేయడానికి యూఎస్ సెంట్రల్ కమాండ్ దళాలు శక్తివంతమైన దాడుల పరంపరను ప్రారంభించాయి. Iran చర్యలు అనవసరమైనవని, ప్రమాదకరమైనవని, తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని అమెరికా పేర్కొంది.
ఈ దాడుల్లో భాగంగా అమెరికా సైన్యం ఇరాన్కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలు, తీరప్రాంత నిఘా వ్యవస్థలు, ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు, నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్ ప్రయోగ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ మీడియా నివేదికల ప్రకారం.. దక్షిణ ఓడరేవు పట్టణమైన సిరిక్, ఖేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్ ప్రాంతాలలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ దాడులు సిరిక్లోని ఒక వాణిజ్య రేవును, అలాగే సిరిక్, బందర్ అబ్బాస్లలోని చేపల రేవులను కూడా తాకాయి.

సైనిక దాడులతో పాటు, అమెరికా ట్రెజరీ శాఖ ఇరాన్ చమురు అమ్మకాలకు గతంలో ఇచ్చిన సాధారణ లైసెన్స్ను తక్షణమే రద్దు చేసింది. అమెరికా-ఇరాన్ తాత్కాలిక ఒప్పందంలో భాగంగా ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులను ఆగస్టు 21 వరకు విక్రయించుకోవడానికి జూన్ 22న ఈ మినహాయింపు ఇచ్చారు. అయితే ఇరాన్ తాజా ఉల్లంఘనల కారణంగా ఆ లైసెన్స్ను రద్దు చేస్తూ.. ఇరాన్ తన పాత లావాదేవీలను ముగించుకోవడానికి జూలై 17 వరకు మాత్రమే గడువు విధించింది.
మరోవైపు, ఇరాన్ దాడులకు గురైన నౌకల్లో ఖతార్కు చెందిన ద్రవీకృత సహజ వాయువు (LNG) ట్యాంకర్ 'అల్-రెకయ్యత్', ఒమన్ తీరంలో ప్రయాణిస్తున్న సౌదీ జెండా కలిగిన ముడి చమురు సూపర్ట్యాంకర్ 'వెద్యాన్' ఉన్నాయి. హెచ్చరికలను నిర్లక్ష్యం చేసినందుకే ఖతార్ ట్యాంకర్పై దాడి జరిగిందని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రకటించినప్పటికీ.. టెహ్రాన్ దీనికి నేరుగా బాధ్యత వహించలేదు. మధ్యంతర ఒప్పందంలో భాగంగా హార్ముజ్ జలసంధిపై నియంత్రణ తమకే ఉండాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఈ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చి స్పందిస్తూ.. బెదిరింపులు కొనసాగితే తుది ఒప్పందంపై చర్చలు జరగవని స్పష్టం చేశారు.
ఈ పరిణామాలన్నీ ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న తరుణంలోనే చోటుచేసుకోవడం గమనార్హం. టెహ్రాన్, ఖోమ్ వీధుల్లో లక్షలాది మంది ప్రజల సమక్షంలో ఖమేనీ శవపేటికలను ఊరేగించిన అనంతరం, ఇరాక్ లోని నజాఫ్ పుణ్యక్షేత్రానికి తరలించారు. ఈ సందర్భంగా ఇరాన్ ప్రజలు అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని శపథాలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications
