ఓ వైపు చర్చలు..మరో వైపు చంపేస్తారనే ప్రకటనలు.. ట్రంప్ వ్యాఖ్యల వెనుక అసలు కథేంటి..
పశ్చిమాసియాలో యుఎస్, ఇరాన్ల మధ్య సైనిక ఘర్షణలు తీవ్రరూపం దాల్చినప్పటికీ.. చర్చలను కొనసాగించడానికి ఇరుపక్షాలు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ Trump తాజాగా ప్రకటించారు.
అయితే గత నెలలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం మాత్రం అధికారికంగా ముగిసిందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాబోయే నవంబరులో జరగబోయే అమెరికా కాంగ్రెస్ ఎన్నికలు.. హార్ముజ్ జలసంధిలో ఘర్షణల వల్ల పెరుగుతున్న చమురు ధరలు.. ట్రంప్కు రాజకీయంగా అత్యంత సున్నితమైన అంశంగా మారాయి.
దీంతో జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులను తక్షణమే ఆపాలని అమెరికా.. ఇరాన్పై ఒత్తిడిని తీవ్రతరం చేసింది. గత ఐదు నెలలుగా సాగుతూ.. వేలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ యుద్ధాన్ని దౌత్యపరంగా ముగించేందుకు ఖతార్, ఒమన్ వంటి ప్రాంతీయ దేశ మధ్యవర్తులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఖతార్ ప్రతినిధులు ఇరాన్ అధికారులతో సమావేశమవగా.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చి ఒమన్లో పర్యటించనున్నారు.

ఈ వారం జరిగిన ఘర్షణల్లో ఖతార్, సౌదీలకు చెందిన మూడు వాణిజ్య ట్యాంకర్లపై దాడులు జరగడంతో అమెరికా సైన్యం.. ఇరాన్లోని ఆరు నగరాల్లో గల 90కి పైగా సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో 17 మంది మరణించగా.. 115 మంది గాయపడినట్లు ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
దీనికి ప్రతీకారంగా ఇరాన్ సైన్యం గల్ఫ్ దేశాలలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర దాడులు చేసింది. కువైట్లోని పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ, ఖతార్లోని ముందస్తు హెచ్చరిక కేంద్రం, బహ్రెయిన్లోని ఇంధన డిపోతో పాటు జోర్డాన్లోని అజ్రాక్ సైనిక స్థావరంపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ 10 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వాటిని నేలమట్టం చేసింది.
మరోవైపు ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కూడా తారా స్థాయికి చేరింది. ఒకవేళ ఇరాన్ తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తే.. ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేయడానికి వేయి క్షిపణులతో అమెరికా సైన్యం రెడీగా ఉందంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా సంచలన పోస్ట్ చేశారు.
ఇక ట్రంప్ను హతమార్చడానికి టెహ్రాన్ ప్రణాళికలు రచిస్తోందంటూ ఇజ్రాయెల్ పంపిన నిఘా సమాచారాన్ని అమెరికా మీడియా ఈ వారంలోనే బహిర్గతం చేసింది. ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ మరణించగా.. ఆయన అంత్యక్రియల సందర్భంగా నిరసనకారులు ట్రంప్పై ప్రతీకారం తీర్చుకుంటామనే బ్యానర్లను ప్రదర్శించారు.
ప్రస్తుతం ఈ సంక్షోభానికి దౌత్యపరమైన కేంద్రంగా హార్ముజ్ జలసంధి మారింది. యుద్ధానికి ముందు ప్రపంచ చమురు సరఫరాలో ఐదవ వంతును తీసుకువెళ్లిన ఈ జలమార్గంలో దాడులను పూర్తిగా ఆపివేసి, ఎలాంటి టోల్ పన్నులు లేకుండా ఉచిత రవాణాకు ఇరాన్ బహిరంగంగా హామీ ఇవ్వాలని అమెరికా పట్టుబడుతోంది. యుద్ధ సమయంలో ఈ జలసంధిని మెజారిటీగా తన ఆధీనంలోకి తెచ్చుకున్న ఇరాన్, అమెరికా జోక్యానికి తగిన ప్రతిచర్య ఉంటుందని పదే పదే హెచ్చరిస్తోంది.
ఇరు దేశాల మధ్య ఇటీవల చర్చలు ఫలవంతంగానే సాగాయని అమెరికా అధికారులు చెప్తున్నప్పటికీ.. వాషింగ్టన్ తన కట్టుబాట్లను ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని టెహ్రాన్ స్పష్టం చేసింది. ఈ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గత ఎనిమిది వారాలలోనే అత్యంత భారీ వీక్లీ వృద్ధిని నమోదు చేసి.. ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలను మరింతగా పెంచాయి.


Click it and Unblock the Notifications
