అసలు ఆట ఇప్పుడే మొదలు అయింది..ట్రంప్ వ్యూహాంలో చిక్కిన ఇరాన్.. అణ్వాయుధాలపై ఏం చేయబోతోంది..
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రాత్రికి రాత్రే కుదిరిన తాజా అవగాహన ఒప్పందం (Framework Agreement) గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న యుద్ధ భయాలకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభమైన తీవ్ర సైనిక ఘర్షణలు మధ్యప్రాచ్యాన్ని సంక్షోభంలోకి నెట్టడమే కాకుండా, ప్రపంచ ఇంధన రవాణాలో సుమారు 20 శాతం వాటా ఉన్న హార్ముజ్ జలసంధి మూసివేతకు దారితీశాయి.
దీనివల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఒక్కసారిగా నింగిని తాకాయి. అయితే, తాజా దౌత్యపరమైన విజయంతో హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి, ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ వార్త వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు నాలుగు శాతానికి పైగా పడిపోగా, ప్రపంచ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఇదే సమయంలో అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడటంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి.

అమెరికా కోణంలో ఈ ఒప్పందం స్వదేశంలో గ్యాస్ ధరల పెరుగుదల వల్ల ఎదుర్కొంటున్న తీవ్ర రాజకీయ ఒత్తిడి నుండి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పెద్ద ఊరటనిచ్చింది. ఈ గొప్ప ఒప్పందం మొత్తం ప్రాంతానికి శాంతి భద్రతలను తీసుకువస్తుందని ట్రంప్ ధీమాగా ప్రకటించారు. మరోవైపు, ఈ ఒప్పందం వల్ల విదేశీ బ్యాంకుల్లో నిలిచిపోయిన సుమారు 25 బిలియన్ డాలర్ల ఇరానియన్ ఆస్తుల విడుదల కానుండటం, చమురు ఎగుమతులపై ఆంక్షలు సడలడం వంటి పరిణామాలు కుప్పకూలుతున్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కొత్త జీవాన్ని ఇస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది కూడా ఈ ఒప్పందాన్ని ధృవీకరిస్తూ.. తమ దేశ సైనిక విజయాలను ప్రశంసించారు. మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. లెబనాన్తో సహా అన్ని రంగాలలో సైనిక కార్యకలాపాలను తక్షణమే, శాశ్వతంగా నిలిపివేయాలని ఈ ఒప్పందంలో పొందుపరిచినట్లు వెల్లడించారు.
అయితే, ఈ ప్రాథమిక అవగాహన ఒప్పందం వల్ల యుద్ధ మేఘాలు కొంతవరకు విడిపోయినప్పటికీ, ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒప్పందంలోని నిబంధనలపై ఇరుదేశాల అధికారులు భిన్నమైన ప్రకటనలు చేయడం అనిశ్చితిని పెంచుతోంది. ముఖ్యంగా ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయకుండా నిరోధించే శాశ్వత యంత్రాంగం, శుద్ధి చేసిన యురేనియం నిల్వల గతి, ఆంక్షల ఎత్తివేత విధానం వంటి అంశాలపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు.
ప్రతిగా ఇరాన్ ప్రస్తుతానికి తన అణు కార్యక్రమ విస్తరణను తాత్కాలికంగా నిలిపివేసి, అణు యథాతథ స్థితిని కొనసాగించడానికి అంగీకరించినప్పటికీ, తుది ఒప్పందం కోసం రాబోయే 60 రోజుల్లో జరగబోయే చర్చలు అత్యంత కీలకంగా మారనున్నాయి. పైగా, హోర్ముజ్ జలసంధిని అడ్డుకునే సైనిక సామర్థ్యం ఇరాన్ వద్ద ఇప్పటికీ ఉండటం గమనార్హం. ప్రాంతీయ భద్రత, ఇజ్రాయెల్ వైఖరి ఈ ఒప్పందం అమలుకు అతిపెద్ద సవాలుగా నిలవనున్నాయి.
లెబనాన్లోని హిజ్బుల్లాపై తాను సాగిస్తున్న దాడులను ముగించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇప్పటివరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. గత వారంలోనే ఇజ్రాయెల్ జరిపిన బీరూట్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ మరో క్షిపణి దాడి చేయకుండా ఒత్తిడికి తలొగ్గి వెనక్కి తగ్గడంతోనే ఈ ముసాయిదా ఒప్పందం సాధ్యపడింది. ఒకవేళ ఈ ఒప్పందం వల్ల ఇరాన్కు ఆర్థిక స్వేచ్ఛ పెరిగితే, అది ఇజ్రాయెల్ నుండి తీవ్ర ప్రతిస్పందనకు దారితీయవచ్చు.
అలాగే యెమెన్లోని హౌతీలు, సిరియా-ఇరాక్లలోని ఇరాన్ అనుకూల మిలీషియాల భవిష్యత్తు చర్యలు కూడా ఆందోళనకరంగా ఉన్నాయి. ప్రస్తుతానికి యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ పొరుగు దేశాలకు ఇరాన్ క్షిపణుల ముప్పు నుండి తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ, రాబోయే రోజుల్లో జెనీవాలో జరగబోయే సంతకాల వేడుక వరకు ఈ మార్గం ఎన్నో మలుపులతో కూడుకుని ఉంటుందని స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications
