టెక్ దిగ్గజాలకు అమెరికా షాక్ ఇచ్చేనా? ఇప్పటికే వాయిదా...
అమెరికాలో టెక్ దిగ్గజాలకు షాక్ తగలనుంది. అమెజాన్ డాట్ కామ్, ఆపిల్ ఇంక్ వంటి సంస్థల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల నియంత్రణకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు డెమోక్రాట్ల నేతృత్వంలోని అమెరికా హౌస్ కమిటీ తన నివేదికను రూపొందించింది. టెక్నాలజీ రంగంలో పోటీని పరిశీలిస్తున్న హౌస్ ప్యానెల్... దిగ్గజాలు మార్కెట్ స్థలాలను సొంతం చేసుకోవడం, వారి వారి సొంత ఉత్పత్తుల విక్రయాలకే పరిమితం కావడం వంటి పద్ధతులకు చెక్ పెట్టేందుకు భారీ సంస్కరణలతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
పోటీ వాతావరణంలో మార్కెట్లో ఆధిపత్యం కోసం ఈ కంపెనీలు అమలు చేస్తున్న వ్యూహాలపై దృష్టి సారించింది. డెమోక్రాట్ల ప్రతినిధి డేవిడ్ నేతృత్వంలో యాంటీ ట్రస్ట్ ప్యానెల్ దర్యాఫ్తు అనంతరం డ్రాఫ్టును సిద్ధం చేసింది. పోటీదారుల్ని అణిచివేసేందుకు ఈ కంపెనీలు తమ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని, వీటిని నియంత్రించాల్సి ఉందంటున్నారు. ఈ మేరకు డేవిడ్ అందుకు అనుగుణంగా వ్యాఖ్యలు చేశారు.
ఈ డ్రాఫ్టు నివేదికకు ఆమోదం లభిస్తే టెక్ దిగ్గజ కంపెనీలకు భారీ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నివేదికకు ఎంతమంది ఆమోదం తెలుపుతారనేది స్పష్టంగా తెలియదంటున్నారు. ఈ వారమే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ఇది వివిధ అంశాల కారణంగా వాయిదా పడింది.