PhonePe: కొత్త కంపెనీని చేజిక్కించుకుంటున్న ఫోన్ పే.. పేటీఎంకు పోటీగా సేవలు..
Zest Money: డిజిటల్ చెల్లింపుల రంగంలో దేశంలో అగ్రగామి సంస్థగా కొనసాగుతున్న ఫోన్ పే మరో ముందగుడు వేసింది. బై-నౌ-పే-లేటర్ (BNPL) ఫిన్టెక్ స్టార్టప్ జెస్ట్మనీని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు మెుదలుపెట్టింది. దీంతో కంపెనీ వినియోగదారులకు మరింత చేరువకానుంది. ఇది పేటీఎం నిర్వహిస్తున్న వ్యాపారానికి గట్టిపోటీగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఈ కీలక డీల్ విలువ దాదాపు 200 నుంచి 300 మిలియన్ డాలర్లుగా ఉంటుందని తెలుస్తోంది. చివరి రౌండ్ నిధుల సేకరణ సమయంలో ZestMoney వ్యాల్యూయేషన్ 450 మిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఈ డీల్ మరికొన్ని రోజుల్లో పూర్తి కానున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కంపెనీ వర్గాలు మాత్రం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కొనుగోలు తర్వాత సైతం జెస్ట్ పే సెపరేట్ కంపెనీగానే ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ తన నిధుల అవసరాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున గత ఆరు నెలలుగా కొనుగోలుదారుల కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో కంపెనీ గతంలో పైన్ ల్యాబ్స్, భారత్ పే వంటి కంపెనీలతో సైతం చర్చలు నిర్వహించింది. అయితే తాజాగా వాల్ మార్ట్ యాజమాన్యంలోని ఫోన్ పే దీనిపై మక్కువ చూపుతోంది.
ఈ డీల్ వల్ల ఫోన్ పే సంస్థకు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ లైసెన్స్ లభించనుంది. డిజిటల్ చెల్లింపుల సంస్థ చాలా వచ్చే ఏడాది ఐపీవోగా మార్కెట్లోకి రావాలనుకోవటం, చాలా కాలంగా ఈ లైసెన్స్ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో డీల్ కీలకంగా మారుతోంది. బై నౌ పే లేటర్ కంపెనీలపై రిజర్వు బ్యాంక్ ఆంక్షలు పెట్టకముందు జెస్ట్మనీ నెలకు రూ.600 కోట్ల వ్యాపారాన్ని చేసింది. అయితే ఆంక్షల తర్వాత అది దాదాపు సగానికి పడిపోయింది. దీంతో కంపెనీ నష్టాలు సైతం భారీగానే పెరిగాయి.