Ashwini Vaishnaw: వాస్తవానికి భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించటానికి దోహదపడిన కీలక రంగాల్లో భారతీయ ఐటీ రంగం కూడా కీలక పాత్ర పోషించింది. వ్యవసాయ ఆధారిత దేశంగా ఉన్న భారత్ మధ్యలో ఇండస్ట్రియల్ ఉత్పత్తి రంగంపై ఫోకస్ తగ్గించి సర్వీస్ సెక్టార్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇది ఒకింత మనల్ని వెనకబడటానికి, ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడటానికి కారణంగా కూడా నిలిచింది.
అయితే తాజాగా కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో ఆయన దేశంలోని ప్రధాన ఐటీ సేవల కంపెనీలన్నింటికీ ఛాలెంజ్ విశిరారు. డేటాక్వెస్ట్ ఇండియా సంస్థ నిర్వహించిన ICT Business Awards & DQ Digital Leadership 32వ సమావేశంలో ఆయన పాల్గొంటూ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి టాప్ ఐటీ కంపెనీలకు కీలక సూచన చేశారు. ఈ సంస్థలు కేవలం సేవలను అందించటం నుంచి ప్రొడక్ట్ ఇన్నోవేషన్ వైపుకు మళ్లాలని పూర్తి స్థాయి దేశీయ మెుబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయాలని అన్నారు.

ఈ సదస్సులో మాట్లాడుతూ ప్రస్తుతం భారత్ ప్రొడక్ట్ నేషన్ గా మారాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం వ్యాపార సంస్థలకు దక్కుతుందని వైష్ణవ్ అభిప్రాయపడ్డారు. సాంకేతిక రంగంలో భారతదేశాన్ని అగ్రగామి, స్వావలంబన దేశంగా స్థాపించడానికి ప్రభుత్వ నిబద్ధతను వైష్ణవ్ హైలైట్ చేశారు. దేశంలోని టెక్ సంస్థలు పెద్దగా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని, ప్రధాని మోదీ ఈ దిశగా నడిపించటానికి మార్గనిర్థేశం చేస్తున్నట్లు వైష్ణవ్ పేర్కొన్నారు. కొత్త ఆలోచనలతో పాటు కొత్త పరిష్కారాలతో వ్యాపారవేత్తలు ముందుకు రావాలని ఆయన పేర్కొన్నారు.
కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై దృష్టి పెట్టాలని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఏఐ రంగంలో ఆధిపత్యం సాధించడానికి , ప్రజలకీ అందుబాటులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడినట్లు తెలిపారు. ప్రస్తుతం ఐదు యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయని, ఈ సంవత్సరం భారత్ లో "మేడ్ ఇన్ ఇండియా చిప్" విడుదల కావాలని ఆసిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే ఏఐ కంప్యూట్ పోర్టల్ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇది పరిశోధకులు, స్టార్టప్స్, ప్రభుత్వ ఏజెన్సీలకు ఏఐ పనులకు కావాల్సిన అత్యాధునిక GPUs, హై-పవర్డ్ కంప్యూటింగ్ రిసోర్సులను అందిస్తుందన్నారు.
ఇప్పటికే 14,000 GPUsతో తొలి కామన్ కంప్యూట్ సౌకర్యాన్ని ప్రారంభించామని, పరిశోధకులు, విద్యార్థులు, స్టార్టప్స్ కి అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. 2047 లక్ష్యాలను చేరుకోవడానికి భారత ప్రభుత్వం కొన్ని సాంకేతిక లక్ష్యాలను పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. వాటిలో మొదటి లక్ష్యం స్వయం నియంత్రిత ఏఐ మోడళ్ల అభివృద్ధి, రెండవది సమస్య ఆధారిత చిన్న మోడళ్ల అభివృద్ధి, మూడవది GPUs సృష్టించడం, నాల్గవది స్టార్టప్స్ కి మద్దతు ఇవ్వడం, ఐదవది ప్రతిభను పెంపొందించడంగా పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications