stock market: ఆరో అతిపెద్ద ఈక్విటీ మార్కెట్ గా యూకే.. భారత్ స్థానం ఎంతంటే..
stock market: తొమ్మిది నెలల్లో మొదటిసారిగా ప్రపంచంలోని ఆరవ అతిపెద్ద ఈక్విటీ మార్కెట్ గా యునైటెడ్ కింగ్ డమ్ నిలిచింది. భారత్ ను వెనక్కు నెట్టి ఈ ఘనత సాధించింది. గత మే 29 తరువాత ఇలా జరగడం ఇదే మొదటిసారి. పౌండ్ బలహీన పడటంతో దిగ్గజ పెట్టుబడిదారులు లండన్ లో ట్రేడింగ్ చేస్తుండటం ఇందుకు బాగా ఉపయోగపడింది. అదానీ స్టాక్స్ లో క్షీణత వల్ల ఇండియన్ ఈక్విటీల్లో నష్టాలూ ఇందుకు కలిసొచ్చిన అంశంగా చెప్పవచ్చు.

బలహీన పౌండ్ దన్నుతో..
ETF, ADRలు మినహా UKలోని ప్రైమరీ లిస్టింగ్ ల సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్.. మంగళవారం నాటికి సుమారు 3.11 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు బ్లూమ్ బర్గ్ నివేదించింది. భారతీయ మార్కెట్లతో పోలిస్తే దాదాపు 5.1 బిలియన్ డాలర్లు ఎక్కువన్నమాట. తక్కువ ప్రయోగాత్మక ప్రభుత్వ పెట్టుబడి విధానాలతో పాటు స్టెర్లింగ్ లో క్షీణత.. అక్కడి మార్కెట్ కు మంచి అవకాశంగా ఇన్వెస్టర్లు భావిస్తున్నట్లు తెలిపింది.

ఫ్రాన్స్ తో పోలిస్తే ఇప్పటికీ..
గ్లోబల్ ఈక్విటీలను గతేడాది అధిగమించిన అనంతరం.. UK యొక్క FTSE 350 ఇండెక్స్ ఇప్పటివరకు 5.9 శాతం లాభపడింది. తద్వారా MSCI ఆల్-కంట్రీ వరల్డ్ ఇండెక్స్లో 4.7 శాతం పెరుగుదల సాధించింది. యూరప్ లో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అతిపెద్ద హోదాని గతేడాది UK కోల్పోయింది. ఇప్పటికీ ఫ్రాన్స్ తో పోలిస్తే వెనకబడే ఉండటం గమనార్హం. అదానీ గ్రూపు షేర్ల పతనంతో పాటు బలహీన రూపాయి విలువ భారత మార్కెట్లను కలవరపరుస్తోంది.

పది శాతం ఇండెక్స్ కరెక్షన్:
హిండెన్ బర్గ్ నివేదిక బయటకు వచ్చిన తరువాత అదానీ గ్రూపు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 142 బిలియన్ డాలర్ల మేర తగ్గిపోయింది. తద్వారా MSCI ఇండియా ఇండెక్స్ 6.1 శాతానికి పడిపోయింది. డిసెంబరు 1 నాటి గరిష్ఠ స్థాయితో పోలిస్తే ఇప్పటి వరకు 10 శాతం ఇండియన్ స్టాక్ ఇండెక్స్ లో క్షీణత కనిపించింది. అయితే ఇంత జరిగినా భారతీయ మార్కెట్ ల పట్ల పెట్టుబడిదారుల నమ్మకం సడలలేదని GAM ఇన్వెస్ట్ మెంట్స్ ఫండ్ మేనేజర్ జియాన్ షి కోర్టెసి తెలిపారు.


Click it and Unblock the Notifications