Aadhaar Card Update: ఆధార్ లేకుంటే అన్ని స్కీమ్స్ బంద్.. నిబంధనలు కఠినతరం.. కష్టమే..
No Aadhaar Card-No Subsidy: ఆధార్ కార్డుకు సంబంధించిన అలర్ట్. ఆధార్ నంబర్ లేదా ఆధార్ ఎన్రోల్మెంట్ స్లిప్ లేకుండా ఇకపై ఎటువంటి ప్రభుత్వ ప్రయోజనాలు లేదా సబ్సిడీలు ఇవ్వబడవని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) స్పష్టం చేసింది. దేశంలో ఆధార్ నంబర్ను జారీ చేసే ప్రభుత్వ సంస్థ అయిన UIDAI తన తాజా సర్క్యులర్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సర్క్యులర్ను గత వారమే అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది.

నిబంధనలు కఠినతరం..
ఆగస్టు 11, 2022న యూఐడీఏఐ జారీ చేసిన సర్క్యులర్లో గతంలో కంటే ఆధార్ నిబంధనలను కఠినతరం చేసింది. ఆధార్ నంబర్ లేనివారు ఇకపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సబ్సిడీని పొందలేరని అందులో స్పష్టంగా పేర్కొంది. కులం, ఆదాయం మొదలైన వాటికి సంబంధించిన ప్రభుత్వ ధృవపత్రాలు కూడా ఆధార్ నంబర్ లేకుండా జారీ చేయబడవని వెల్లడించింది. ఇక ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, రాయితీలు, ఇతర ప్రభుత్వ సేవలను పొందేందుకు అర్హతను ఆధార్ నిర్ణయిస్తుందని తేటతెల్లం చేసింది.

ఆధార్ చట్టం..
సర్క్యులర్లో UIDAI ఆధార్ చట్టంలోని సెక్షన్- 7 ప్రస్తుత నిబంధనను కూడా స్పష్టం చేసింది. ఆధార్ నంబర్ లేని వ్యక్తులు ప్రత్యామ్నాయ గుర్తింపు మార్గాల ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, రాయితీలు లేదా సేవలను అందించవచ్చని ఈ విభాగంలో నిబంధన ఉంది.

99 శాతం మందికి ఆధార్..
ప్రస్తుతం దేశంలోని 99 శాతం మంది వయోజన పౌరులకు ఆధార్ నంబర్లు జారీ చేసినట్లు సర్క్యులర్లో యూఐడీఏఐ తెలిపింది. ఇప్పటికీ ఆధార్ నంబర్లు లేనివారు ఆధార్ నంబర్ కోసం నమోదును సమర్పించవచ్చు. ఆధార్ చట్టంలోని సెక్షన్- 7 ప్రకారం దాని స్లిప్లో కనిపించే ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడెంటిఫికేషన్ (EID) నంబర్ను ప్రత్యామ్నాయ పద్ధతిగా ఉపయోగించవచ్చు. అంటే కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సదుపాయాన్ని పొందాలంటే కనీసం ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడెంటిఫికేషన్ (EID) నంబర్ లేదా స్లిప్ను చూపించాల్సి ఉంటుంది. ఇది కూడా లేకపోతే అన్ని పథకాలు నిలిచిపోతాయి.


Click it and Unblock the Notifications