ట్విట్టర్పై షాకింగ్ ట్విస్ట్: టేకోవర్ డీల్ను నిలిపేసిన ఎలాన్ మస్క్: షేర్లు ఢమాల్
వాషింగ్టన్: కొద్దిరోజులుగా వార్తల్లో ఉంటూ వస్తోన్న టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్.. ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం మరో మలుపు తిరిగింది. కొత్త ట్విస్ట్ తెర మీదికి వచ్చింది. ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ఎక్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేతికి వెళ్లినట్టే వెళ్లిన ఈ బిగ్గెస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కొనుగోలు ప్రక్రియలో అనుకోని అవాంతరాలు వచ్చి పడ్డాయి. కొనుగోలు ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి.
బదలాయింపు ప్రక్రియ కొనసాగుతున్న దశలో..
అపర కుబేరుడు లాన్ మస్క్- 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ఆ కంపెనీ కూడా అంగీకరించింది. మస్క్ చేసిన ప్యాకేజీకి ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంగీకారం తెలిపారు. ఈ ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేశారు. మూడు నెలల్లో కంపెనీ బదలాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జేపీ మోర్గాన్ వంటి టాప్ ప్లేయర్స్- యాజమాన్య బదలాయింపు ప్రక్రియను పర్యవేక్షిస్తోన్నాయి.
నిలిపివేస్తూ మస్క్ ప్రకటన..
ఈ ప్రక్రియ వేగవంతమైన ప్రస్తుత పరిస్థితుల మధ్య ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇది తాత్కాలికమేనని స్పష్టం చేశారు. సంస్థాగతమైన కొన్ని సమస్యలను పరిష్కరించాల్సి ఉందని, దీనికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అప్పటివరకు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టేకోవర్ ప్రక్రియ ముందుకు సాగకపోవచ్చనీ చెప్పారు.
ఫేక్ అకౌంట్స్పై..
ట్విట్టర్ పాత యాజమాన్యం సూచించిన స్పామ్ లేదా ఫేక్ అకౌంట్స్ లెక్కలపై అనుమానాలు వ్యక్తం కావడం వల్లే ఈ డీల్ను ఎలాన్ మస్క్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. మొత్తం అకౌంట్లల్లో అయిదు శాతం కంటే తక్కువగా నకిలీ యూజర్లు ఉన్నట్లు ఇదివరకు ట్విట్టర్ మేనేజ్మెంట్ తెలియజేసిందని, దీన్ని నిర్ధారించడానికి అవసరమైన వివరణలు ఇంకా అందాల్సి ఉందని, అవి పెండింగ్లో ఉన్నాయని ఎలాన్ మస్క్ చెప్పారు. ఈ కారణంతో ట్విట్టర్ కొనుగోలు డీల్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వివరించారు.
|
ట్విట్టర్ షేర్లు.. ఢమాల్
కార్పొరేట్ సెగ్మెంట్లోనే అతి పెద్ద టేకోవర్గా భావిస్తోన్న ట్విట్టర్ యాజమాన్య బదలాయింపు ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఎలాన్ మస్క్ చేసిన ప్రకటన ప్రకంపనలను సృష్టించింది. ఏకంగా ట్విట్టర్ కొనుగోలు వ్యవహారాన్ని ఇది నిలిపివేయొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఎలాన్ మస్క్ నుంచి తాజా ప్రకటన వెలువడిన వెంటనే ట్విట్టర్ షేర్లు కుదేల్ అయ్యాయి. భారీగా నష్టపోయాయి. న్యూయార్క్ స్టాక్ మార్కెట్ నాస్డాక్లో ఒక్కో షేర్ ధర 17 నుంచి 20 శాతం వరకు పడిపోయింది.
44 బిలియన్ డాలర్లకు ఓకే..
నిజానికి- ఈ సోషల్ మీడియా జెయింట్ ప్లాట్ఫామ్ను కొనుగోలు చేయడానికి మొదట్లో ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్- 46.5 బిలియన్ డాలర్లు. డీల్ కుదిరే సమయానికి రెండున్నర బిలియన్ డాలర్ల మొత్తం తగ్గింది. 44 బిలియన్ డాలర్లతో ఈ డీల్ ఓకే అయింది. ఈ టేకోవర్ వ్యవహారంతో ట్విట్టర్ షేర్ హోల్డర్ల పంట పండినట్టే. ఒక్కో షేర్కు 54.20 డాలర్లను ఎలాన్ మస్క్ చెల్లిస్తారు. ఈ విషయాన్ని ఆయన ఇదివరకే ప్రకటించారు. దీన్ని ఈ ఒప్పందంలోనూ పొందుపరిచారు.
ఏకగ్రీవంగా అంగీకారం..
ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో 11 మంది సభ్యులు ఉన్నారు. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి జేక్ డోర్సీ ఇందులో ఒకరు. ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్పై సమగ్రంగా సమీక్ష, అధ్యయనం చేసింది. దీనికోసం జేపీ మోర్గాన్ అండ్ కంపెనీని నియమించుకుంది. ఈ కంపెనీ నుంచి అందిన నివేదికపై సమగ్రంగా సమీక్షించింది. అనంతరం మస్క్ ఇచ్చిన ఆఫర్పై ఆమోదముద్ర వేసింది. ట్విట్టర్ బోర్డ్ డైరెక్టర్లందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఎవరూ ఎలాంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు.