Elon Musk: ఎలాన్ మస్క్ ను కొందరు తింగరివాడుగా భావిస్తారు కానీ పట్టువదలని విక్రమార్కుడినని ప్రపంచ కుబేరుడు అనేక మార్లు రుజువుచేసుకున్నాడు. అలా ట్విట్టర్ కంపెనీని చేజిక్కించుకుని తనదైన శైలిలో ముందుకు సాగటంతో ఆర్థికంగా కంపెనీ నష్టాన్ని చవిచూసింది. అయితే ఇప్పుడు పరిస్థితులు తిరిగి గాడిన పడుతున్నట్లు తెలుస్తోంది.
ఎలాన్ మస్క్ ఎంట్రీతో అప్పటి వరకు ట్విట్టర్ కు ప్రకటనలు ఇస్తున్న చాలా కంపెనీలు ఒక్కసారిగా గుడ్ బై చెప్పేశాయి. అయితే గతవారం ఆపిల్ ట్విట్టర్ మధ్య పెద్ద వివాదం నడిచింది. దానిపై మస్క్ ట్వీట్స్ చేయటం, ఆరోపణలు చేయటం కూడా జరిగింది. అయితే చివరికి ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ను కలిసి పరిష్కరించుకున్నాడు. తమ మధ్య వచ్చిన మిస్ అండర్ స్టాండింగ్ పరిష్కరించబడిందని ట్వీట్ చేసి దానికి ఫుల్ స్టాప్ పెట్టారు.

తాజాగా ట్విట్టర్ లో ప్రకటనలు ఇచ్చేందుకు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సైతం అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ట్విట్టర్ కు ఏడాదిలో 100 మిలియన్ డాలర్లను ప్రకటనల కోసం వెచ్చించనుంది. కానీ అధికారికంగా అమెజాన్, ఆపిల్ కంపెనీలు మాత్రం వీటిని ధృవీకరిస్తూ ఎలాంటి ప్రకటన ఇప్పటి వరకు చేయలేదు. ట్విట్టర్ ఆర్థిక మూలాలు దెబ్బతినటంతో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఎలాన్ మస్క్ రంగంలోకి దిగి వేగంగా చర్యలు చేపడుతున్నారు.
మస్క్ రాకతో చాలా కంపెనీలు తాత్కాలికంగా లేదా పూర్తిగా ట్విట్టర్ ప్రకటనలకు దూరమయ్యాయి. ఉద్యోగుల కోత తర్వాత ప్రకటన దారులతో సంబంధాలు మెరుగుపరచుకోవటం ప్రారంభించారు. దీనికి తోడు బ్లూటిక్ ఫీజు పెంపు, మూడు వేరియంట్లలో గుర్తింపు తీసుకురావటం వంటి చర్యలను ప్రారంభించారు. కంపెనీ తిరిగి వృద్ధి బాట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఎలాన్ మస్క్.. ట్విట్టర్లోకి తిరిగి వచ్చినందుకు ప్రకటనదారులకు ధన్యవాదాలు తెలిపారు.


Click it and Unblock the Notifications