H1B వీసా: ఉద్యోగం పోతే అంతేనా? ట్రంప్ కొత్త రూల్!
అమెరికాలో H1B వీసాతో పనిచేస్తున్న విదేశీయులకు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. H1B వీసా నిబంధనల్లో కీలక మార్పులు తీసుకురావడానికి చట్టపరమైన చర్యలు ప్రారంభించింది. ఈ మార్పు అమల్లోకి వస్తే, విదేశీ ఉద్యోగులకు తీవ్రమైన ఇబ్బందులు తప్పవు.
సాధారణంగా, అమెరికాలో H1B వీసాపై ఉన్నవారు ఉద్యోగం కోల్పోతే, కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి 60 రోజుల గ్రేస్ పీరియడ్ (అవకాశం) ఉంటుంది. ఈ రెండు నెలల కాలంలో వారు కొత్త జాబ్ సంపాదిస్తే, అమెరికాలోనే ఉండి పని చేసుకోవచ్చు. ఈ నిబంధన భారతీయులతో సహా ఎంతో మంది విదేశీ ఉద్యోగులకు ఒక భరోసాగా ఉండేది.

అయితే, ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఈ 60 రోజుల గ్రేస్ పీరియడ్ను పూర్తిగా రద్దు చేసేందుకు కొత్త నిబంధనను ప్రతిపాదించింది. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ విడుదల చేసిన ఈ ప్రకటన, అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ టెక్ నిపుణులు, ఇతర విదేశీ ఉద్యోగులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
'60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగింపు’ (Eliminating the Discretionary 60-day Grace Period) పేరుతో ఈ కొత్త నిబంధనను రూపొందించారు. దీని ప్రకారం, H1B లేదా ఇతర తాత్కాలిక వర్క్ వీసాలపై ఉన్నవారు ఉద్యోగం కోల్పోతే, తక్షణమే అమెరికా విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ అమెరికాలో ఉండేందుకు వారికి వేరే చట్టపరమైన అనుమతి ఉంటే తప్ప, దేశంలో కొనసాగలేరు.
ఇప్పటికే టెక్ కంపెనీలు అకస్మాత్తుగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి (లేఆఫ్స్). ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం పోగానే దేశం విడిచి వెళ్లాలనే నిబంధన అమల్లోకి వస్తే, ఎంతో మంది అమెరికా కలలు కల్లలవుతాయి.
గతంలో 2017లో తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం, H1B వీసాదారులు ఉద్యోగం కోల్పోయినా లేదా మానేసినా, కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవడానికి గరిష్టంగా 60 రోజుల సమయం ఇచ్చేవారు.
ఈ గ్రేస్ పీరియడ్లో వారు తమ ఇళ్లను ఖాళీ చేయడం, పిల్లల స్కూల్ మార్పులు వంటి అవసరమైన పనులు చక్కబెట్టుకునే వెసులుబాటు ఉండేది. కానీ, ఇప్పుడు ప్రతిపాదించిన కొత్త నిబంధనతో ఈ సౌలభ్యం పూర్తిగా దూరమవుతుంది.
టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అనేక అగ్రశ్రేణి టెక్ కంపెనీలు, ఐటీ సేవల సంస్థలు H1B వీసాలపై భారత్, చైనా నుంచి వేలాది మంది ఉద్యోగులను నియమించుకుంటాయి. ఈ వీసాపై అమెరికాలో పనిచేస్తున్న వారిలో దాదాపు 70% మంది భారతీయులే. అందువల్ల, ఈ మార్పు అమల్లోకి వస్తే, భారతీయ టెక్ ఉద్యోగులకే అతిపెద్ద సమస్య ఎదురవుతుంది.
ఏఐ రాక, ఇతర కారణాలతో కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో, ఉద్యోగం కోల్పోయిన వారికి ఉన్న ఆ రెండు నెలల భద్రత కూడా లేకపోతే, వారు వెంటనే దేశం విడిచి వెళ్లాల్సిన ఒత్తిడి పెరుగుతుంది. విదేశీయులు ఖాళీ చేసిన ఉద్యోగాలను, అమెరికాలోని అర్హులైన స్థానిక ఉద్యోగులతో భర్తీ చేసేలా కంపెనీలను ప్రోత్సహించడమే ఈ కఠిన నిబంధనల వెనుక ఉన్న ఉద్దేశమని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ నిబంధనను ప్రజల అభిప్రాయం కోసం విడుదల చేశారు. రాబోయే 60 రోజుల్లో ప్రజలు, సంబంధిత కంపెనీల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాతే ఈ నిబంధనను ఖరారు చేసి, చట్టంగా మారుస్తారు.


Click it and Unblock the Notifications
