ఇరాన్తో యుద్ధాన్ని ఆపేస్తున్నాం.. ట్రంప్ సంచలన ప్రకటన..నీ మాటలు మేము నమ్మేది లేదంటున్న టెహ్రాన్..
అంతర్జాతీయ రాజకీయ యవనికపై అత్యంత నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్పై సైనిక చర్యకు సిద్ధమైన అమెరికా, చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకుని శాంతి చర్చల వైపు అడుగులు వేసింది. ఇరాన్ ఉన్నత స్థాయి నాయకత్వంతో చర్చలు విజయవంతం కావడంతో.. ఆ దేశంపై జరగాల్సిన దాడులు, బాంబు దాడులను తక్షణమే రద్దు చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ ఆకస్మిక పరిణామం పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలను తొలగించి, ప్రపంచ దేశాలకు పెద్ద ఊరటనిచ్చింది.
తన సొంత సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' (Truth Social) లో ట్రంప్ ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని వెల్లడించారు. "ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్తో జరిపిన చర్చలు ఆ దేశ అత్యున్నత నాయకత్వ స్థాయికి చేరి, వారి ఆమోదం కూడా లభించింది. అందువల్ల, అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడిగా ఈ సాయంత్రం ఇరాన్పై జరగాల్సిన దాడులను నేను రద్దు చేశాను" అని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు ఊహించని రీతిలో సత్ఫలితాలను ఇవ్వడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఒప్పందం కేవలం అమెరికా, Iran దేశాల మధ్యే కాకుండా, పశ్చిమ ఆసియాలోని ఇతర కీలక దేశాల భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంది. అమెరికాతో పాటు ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, టర్కీ, పాకిస్తాన్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఈజిప్ట్ వంటి అనేక దేశాలు ఈ ఒప్పందంలోని కీలక అంశాలకు, ప్రతిపాదనలకు తమ పూర్తి ఆమోదాన్ని తెలిపాయని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే, చర్చలు సఫలమైనప్పటికీ అమెరికా తన అప్రమత్తతను వీడలేదు.
తుది ఒప్పందంపై అధికారికంగా సంతకాలు జరిగేంత వరకు ఇరాన్పై విధించిన నౌకాదళ దిగ్బంధనం (Naval Blockade) పూర్తి స్థాయిలో అమలులో ఉంటుందని అమెరికా స్పష్టం చేసింది. ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు, సంతకాలు చేసే సమయం మరియు వేదికను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని ట్రంప్ వెల్లడించారు. ఈ శాంతి చర్చల వార్తలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగిరావడమే కాకుండా, ప్రపంచ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిదారుల నమ్మకం ఒక్కసారిగా బలపడింది.
కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనను టెహ్రాన్ తీవ్రంగా తోసిపుచ్చింది. అమెరికాతో ఇంకా ఎలాంటి ఒప్పందమూ ఖరారు కాలేదని ఇరాన్ స్పష్టం చేసింది. తమ దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన 'రెడ్ లైన్స్' (పరిమితులు) విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని టెహ్రాన్ వర్గాలు గట్టిగా హెచ్చరించాయి.
ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ ప్రభుత్వ మీడియాతో మాట్లాడుతూ.. అమెరికాతో ఒప్పందంపై సంతకాలకు అంతా సిద్ధమైందంటూ వస్తున్న నివేదికలు కేవలం ఊహాజనితమైనవేనని కొట్టిపారేశారు. చర్చల్లో కొంత పురోగతి ఉన్న మాట నిజమే అయినప్పటికీ, ప్రతిపాదిత డ్రాఫ్ట్ను ఇరాన్లోని అత్యున్నత నిర్ణయాధికార సంస్థలు ఇంకా సమీక్షిస్తున్నాయని, తాము ఇంకా తుది నిర్ణయానికి రాలేదని ఆయన స్పష్టం చేశారు.
చర్చల పాఠ్య ప్రణాళికలోని చాలా భాగంపై అంగీకారం కుదిరినప్పటికీ, చర్చలు సాగుతున్న కొద్దీ అమెరికా పదేపదే తన వైఖరిని మార్చుకుంటూ వస్తోందని బఘాయీ ఆరోపించారు. తమ కీలక ప్రయోజనాలను పణంగా పెట్టి వెనక్కి తగ్గేది లేదని ఆయన పునరుద్ఘాటించారు.
మార్చి మధ్య కాలం నుండి ఇరు దేశాల మధ్య శాంతి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం ప్రతీకార దాడులు తీవ్ర రూపం దాల్చాయి. ఈ వారంలో హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ను కూల్చివేయడంతో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరాయి. దీనికి ప్రతీకారంగా అమెరికా దళాలు 20 ఇరాన్ సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ప్రతిగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సైన్యం.. అమెరికా బలగాలున్న జోర్డాన్లోని 'అల్-అజ్రాక్' వైమానిక స్థావరంపై 12 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి అమెరికా విమానాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. ఈ విధంగా వరుస దాడులతో పశ్చిమ ఆసియా అట్టుడుకుతున్న తరుణంలో, ట్రంప్ ప్రకటన అంతర్జాతీయంగా శాంతి ఆశలు రేకెత్తించినప్పటికీ, టెహ్రాన్ ఇచ్చిన కౌంటర్ ఈ వ్యవహారంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతోందని స్పష్టం చేస్తోంది.


Click it and Unblock the Notifications
