అమెరికా-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేధాలు.. పండగ చేసుకుంటున్న ఇరాన్.. అసలేమైందంటే..
పశ్చిమ ఆసియాలో శాంతి స్థాపనే లక్ష్యంగా అడుగులు పడుతున్న వేళ.. తెరవెనుక నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్పై యుద్ధ పురోగతి, తదుపరి వ్యూహాలపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మధ్య బుధవారం జరిగిన ఫోన్ సంభాషణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ వెల్లడించింది.
మంగళవారం జరగాల్సిన సైనిక దాడులను ట్రంప్ హఠాత్తుగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ఈ పరిణామం జరగడం గమనార్హం. దాదాపు గంటపాటు సాగిన ఈ ఫోన్ కాల్ ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని తీవ్ర ఆందోళనకు గురైనట్లు అమెరికా ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. చర్చల ప్రారంభం నుండి నెతన్యాహు నిరంతరం సందేహాలు, ఆందోళనలతోనే ఉన్నారని, ట్రంప్ నెమ్మదించడం ఆయనకు అస్సలు నచ్చడం లేదని తెలుస్తోంది.

నిజానికి Iran యుద్ధ వ్యూహాలకు సంబంధించి ట్రంప్, నెతన్యాహుల మధ్య మొదటి నుంచీ తీవ్ర భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అమెరికాను కనీసం విశ్వాసంలోకి తీసుకోకుండానే ఇరాన్లోని అత్యంత కీలకమైన 'సౌత్ ఫార్స్' చమురు క్షేత్రంపై ఇజ్రాయెల్ గతంలో దాడికి తెగబడటం వాషింగ్టన్కు ఆగ్రహం తెప్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ను పూర్తిగా అణచివేయాలనే కఠినమైన, దూకుడు వైఖరిని నెతన్యాహు అవలంబిస్తుండగా, ట్రంప్ ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి.
దాడులను వాయిదా వేయడం ఇజ్రాయెల్ భద్రతకు ముప్పని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే సైనిక చర్యతో ముందుకు సాగాలని నెతన్యాహు గట్టిగా వాదించారు. గత ఆదివారం నాటి సంభాషణలో ఈ వారంలోనే ఇరాన్పై కొత్త లక్షిత దాడులు ఉంటాయని ట్రంప్ హామీ ఇచ్చినప్పటికీ, కేవలం 24 గంటల వ్యవధిలోనే ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ మిత్రదేశాల అభ్యర్థనల మేరకు ఆయన యుద్ద విమానాలకు బ్రేక్ వేశారు.
ఈ ఫోన్ కాల్ సందర్భంగా ట్రంప్ ఒక కీలక ప్రతిపాదనను నెతన్యాహు ముందుంచారు. యుద్ధాన్ని అధికారికంగా ముగించడానికి వీలుగా అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఒక "ఉద్దేశ పత్రం" (Letter of Intent) సిద్ధమవుతోందని, దీనిపై ఖతార్, పాకిస్తాన్ వంటి మధ్యవర్తిత్వ దేశాలు రాత్రింబగళ్లు కష్టపడుతున్నాయని ట్రంప్ వివరించారు. ఈ పత్రం ప్రకారం ఇరాన్ అణు కార్యక్రమాలు, అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధిని తెరవడం వంటి అంశాలపై ఉభయ దేశాలు 30 రోజుల పాటు శాంతి చర్చలు జరుపుతాయి.
అయితే ఈ ప్రతిపాదనను నెతన్యాహు తీవ్రంగా వ్యతిరేకించారు. చర్చల పేరిట కాలయాపన చేయడం వల్ల ఇరాన్ తిరిగి పుంజుకోవడానికి, శత్రువు బలాన్ని పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందని ఆయన హెచ్చరించారు. నెతన్యాహు సైనిక చర్యను పునఃప్రారంభించాలని పట్టుబట్టగా, దౌత్య మార్గంలో ఒక ఒప్పందం కుదురుతుందో లేదో చూడాలని ట్రంప్ గట్టిగా చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది. కానీ విలేకరుల సమావేశంలో మాత్రం ట్రంప్ తన పాత శైలిలోనే "నేను ఏది కోరుకుంటే నెతన్యాహు అదే చేస్తాడు" అంటూ ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతానికి దౌత్యపరమైన ఒప్పందం కోసమే ట్రంప్ మొగ్గు చూపుతున్నారు. సరిహద్దుల్లో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని, కేవలం కొన్ని రోజుల గడువు ఇవ్వడం ద్వారా అమాయక ప్రజల ప్రాణాలను కాపాడగలిగితే ఆ ప్రయత్నం చేయడం తప్పులేదని ఆయన భావిస్తున్నారు. అయితే, ఒకవేళ చర్చలు విఫలమైతే మాత్రం ఇరాన్ను ఉతికేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, "ఒప్పందమైనా కుదరాలి లేదా కఠినమైన చర్యలైనా ఉండాలి" అంటూ ఇరాన్ను హెచ్చరించారు. అటు టెహ్రాన్ వైపు నుండి కూడా స్పందన లభించింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో వాషింగ్టన్ నుండి వస్తున్న శాంతి ప్రతిపాదనలను తాము పరిశీలిస్తున్నామని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ ధృవీకరించారు.
అయితే తాము లొంగిపోయే ప్రసక్తే లేదని, చర్చలు సఫలం కావాలంటే అమెరికా మొదట ఇరాన్ నౌకలపై చేస్తున్న దాడులను ఆపి, అంతర్జాతీయంగా స్తంభింపజేసిన తమ నిధులను విడుదల చేయాలని, అలాగే ఇజ్రాయెల్ లెబనాన్లో చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని ఇరాన్ ఎదురు షరతులు విధిస్తోంది. పశ్చిమ ఆసియాలో ఈ శాంతి ప్రయత్నాలు ఫలించి యుద్ధం ముగుస్తుందా, లేక ట్రంప్-నెతన్యాహుల బంధంలో ఇది కొత్త చీలికకు దారితీస్తుందా అనేది రాబోయే కొద్ది రోజుల్లో తేలనుంది.


Click it and Unblock the Notifications
