అదానీ గ్రూప్లో రూ.18,200 కోట్ల పెట్టుబడి, టోటల్ భారీ డీల్
ఫ్రాన్స్కు చెందిన టోటల్ సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL)లో 20 శాతం మైనార్టీ వాటాను దక్కించుకోనున్నట్లు అదానీ గ్రూప్ సోమవారం తెలిపింది. 2.5 బిలియన్ డాలర్లకు ఈ డీల్ కుదిరింది. దేశీయ కరెన్సీలో దీని వ్యాల్యూ దాదాపు రూ.18,200 కోట్లు. ఈ ఒప్పందం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ కంపెనీలో టోటల్కు ఒక బోర్డు సీటు లభిస్తుంది. అలాగే, 2.35 గిగావాట్స్ (GW) సౌర ఆస్తుల్లో 50 శాతం వాటా దక్కుతుంది.
అదానీ గ్రూప్కు చెందిన నగర గ్యాస్ పంపిణీ కంపెనీ అదానీ గ్యాస్లో 37.4 శాతం వాటాను, ఒడిశాలో నిర్మిస్తున్న ధర్మా ఎల్ఎన్జీ ప్రాజెక్టులో 50 శాతం వాటా కొనుగోలుకు 2018లో టోటల్ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్లో వ్యాపార కార్యకలాపాల విస్తరణకు టోటల్కు ఈ ఒప్పందం దోహదపడనుంది.
తాజా ఒప్పందం టోటల్, అదానీల బంధాన్ని మరింత బలపరిచిందని ఇరు సంస్థలు సోమవారం ఓ ప్రకటనలో తెలిపాయి. 2025 వరకు 35GW స్థూల పునరుత్పాదక శక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుకోవాలని టోటల్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది చివరి నాటికి టోటల్ స్థూల విద్యుదుత్పత్తి సామర్థ్యం దాదాపు 12GWగా ఉంది. ఇందులో 7 GW పునరుత్పాదకశక్తి. చమురుపై ఆధారపడటం తగ్గించి విద్యుత్, పునరుత్పాదక శక్తివైపు టోటల్ తమ వ్యాపార లక్ష్యాలను నిర్దేశించుకుంది.