Tomato News: దేశంలో పెరుగుతున్న కూరగాయల ధరలు ఇప్పటికే సామాన్యుల వంటింటిపై భారాన్ని భారీగా పెంచేస్తోంది. ఉల్లి నుంచి టమాటా వరకు ఏ కూరగాయ ముట్టుకుందామన్నా జేబుల్లో ఉండే డబ్బులు అస్సలు సరిపోవటం లేదు. ఒక పక్క ఎండ తీవ్రతతో పాటు మరోపక్క ఇప్పటికీ వర్షాలు ప్రారంభం కాకపోవటం, గతంలో కురిసిన అధిక వర్షాలు వంటి మిశ్రమ కారణాలు దిగుబడులపై ప్రభావాన్ని చూపాయి.
గత ఏడాది ఏకంగా కేజీ ధర రూ.200 మార్కును దాటేసిన టమాటా తాజాగా మరోసారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పెరిగిన టమాటా ధరలు ప్రజలను కలవరపెడుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో టమాట కిలో ధర రూ.90 నుంచి రూ.100 మధ్య కొనసాగుతోంది. ముంబై నగరంలో కేజీ టమాటా ధర రూ.80-100గా ఉంది. మార్కెట్లలో డిమాండ్ కంటే సరఫరా తక్కువగా ఉండటం ఈ పెరుగుదలకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు.

సాధారణంగా ప్రతి సంవత్సరం ఈ సమయంలో రుతుపవనాల కారణంగా ధరలు పెరుగుతాయి. అయితే ఈ ఏడాది మాత్రం వేడిగాలుల కారణంగా టమాటా ధర పెరిగింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో విపరీతంగా పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా వేడిగాలులు వీయటం టమాటాతో పాటు ఇతర కూరగాయల పంటలకు భారీగా నష్టం కలిగించిందని రైతులు వాపోతున్నారు. దీంతో పంట దిగుబడులు భారీగా క్షీణించాయని.. ఆ ప్రభావం వాటి రేట్లపై పడిందని చెబుతున్నారు.
గతేడాది ధరలు పెరగడంతో ఈసారి అధిక సంఖ్యలో రైతులు టమాట సాగు చేశారు. అయితే వాతావరణంలో పెరిగిన వేడి కారణంగా చాలా మంది రైతుల ప్లాన్ ఫెయిల్ అయ్యింది. రికార్డు స్థాయిలో ఎండలు విజృంభించడంతో పంటలు చాలా చోట్ల నష్టపోయినట్లు వెల్లడైంది. మహారాష్ట్రలో ప్రతి సంవత్సరం మార్చి-ఏప్రిల్లో ఎకరానికి 2000 కార్టూన్ల దిగుబడి వచ్చేదని, అయితే ఈ ఏడాది అది కేవలం 500-600 కార్టూన్లకు పరిమితం అయ్యిందని రైతులు వెల్లడించారు. ఒకపక్క పంట దిగుబడులు తగ్గటం మరోపక్క ఉన్న పంటను కాపాడేందుకు ఖర్చు పెరగటం, సాగు ఖర్చులు పెరగటంతో గిట్టుబాటు కావటం లేదని రైతులు చెబుతున్నారు.
ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించిన వేళ వర్షాలు మెుదలయ్యాయి. దీంతో టమాటా మాత్రమే కాకుండా.. ఉల్లి, బంగాళదుంపలు, కూరగాయలు, ఆకుకూరల ధరలు పెరగటం సగటు జీవి ఆదాయాలను హరిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఏ కూరగాయ చూసిన కేజీ రేటు దాదాపు రూ.60 నుంచి రూ.100 మధ్య కొనసాగుతున్నాయి. తక్కువగా ఉన్న ఆదాయాలతో ఈ రేట్లలో ఇంటిని నడిపించటం కష్టంగా మారుతోందని పేద, మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications