Olympic gold winner Neeraj Chopra: చోప్రాకు నిన్న కారు, నేడు ప్రపంచమంతా ఓయో రూం ఫ్రీ
టోక్యో ఒలింపిక్స్ బంగారు పతక విజేత, జావెలీన్ త్రో హీరో నీరజ్ చోప్రాకు బహుమతులు వెల్లువెత్తుతున్నాయి. ఒలింపిక్స్లో పతకాలు సాధించిన భారతీయ క్రీడాకారులకు పలు కంపెనీలు, ప్రభుత్వాలు బహుమతులు ప్రకటిస్తున్నాయి. టోక్యో ఒలింపిక్స్లో వెయిట్లిఫ్టింగ్లో రజతం సాధించిన మీరాబాయి చానులో డామినోస్ పిజ్జా ఆనందం నింపింది. రజతం సాధించిన ఆనందంలో తనకు ఫిజ్జా తినాలనుందని కోరికను వెలిబుచ్చడంతో డామినోస్ పిజ్జా తన బృందంతో మీరాబాయి చానుకు పిజ్జాను పంపించింది. అలాగే, ఇతర క్రీడాకారులకు బహుమతులు అందుతున్నాయి. అలాగే, బంగారం పతకం సాధించిన నీరజ్ చోప్రాకు బహుమతులు వెల్లువెత్తుతున్నాయి.
నీరజ్కు ఆనంద్ మహీంద్రా బహుమతి
పురుషుల జావెలిన్ త్రో విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా దేశానికి తొలి స్వర్ణం అందించారు. దేశానికి దశాబ్దాల తర్వాత స్వర్ణాన్ని అందించిన నీరజ్ చోప్రాకు ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఓ బహుమతి ప్రకటించారు. తమ సంస్థ నుండి కొత్తగా మార్కెట్లోకి వస్తోన్న ఎక్స్యూవీ 700 మోడల్ వాహనాన్ని అతడికి బహుమతిగా ఇవ్వనున్నట్లు రెండు రోజుల క్రితం తెలిపారు. తొలుత మేమంతా నీ సైన్యంలో ఉన్నాం.. బాహుబలి అని ట్వీట్ చేశారు. తన వెనక భారీ సైన్యంతో చేతిలో ఈటెను పైకెత్తి గుర్రంపై వస్తోన్న ప్రభాస్ ఫొటోతో పాటు ఈటెను విసురుతున్న నీరజ్ చోప్రా ఫొటోను ఆయన షేర్ చేశారు. ఆ ట్వీట్కు స్పందించిన రితేశ్ జైన్ అనే నెటిజన్... నీరజ్ చోప్రాకు ఎక్స్యూవీ700ని బహుమతిగా ఇవ్వాలని కోరాడు. అతడి ట్వీట్కు ఆనంద్ మహీంద్రా స్పందించారు. ట్వీట్ చేయడంతో పాటు తన సంస్థకు చెందిన ఇద్దరు ఉన్నత ఉద్యోగులను ట్యాగ్ చేస్తూ, నీరజ్ చోప్రా కోసం ఓ ఎక్స్యూవీ 700 మోడల్ వాహనాన్ని సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు.
ఓయో ఆఫర్
నీరజ్ చోప్రాకు చాలా బహుమతులు అందుతున్నాయి. తాజాగా ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థ ఓయో కూడా అతనికి ప్రపంచవ్యాప్తంగా ఓయో రూమ్స్లో ఉచిత అకామిడేషన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓయో రూమ్స్ సీఈవో, ఫౌండర్ రితేష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. నీరజ్ చోప్రా భారత్ను గర్వించేలా చేశారు. అలాంటి మీకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఓయో గదులు తెరుచుకొని ఉంటాయని పేర్కొన్నారు.
అంతకుముందు ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో కూడా నీరజ్ చోప్రాకు ఏడాది పాటు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది.
ఎవరీ నీరజ్ చోప్రా?
టోక్యో ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా హర్యానాకు చెందిన ఓ రైతు కొడుకు. గోల్డ్ మెడల్ సాధించినందుకు గాను హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ అతనికి రూ.6 కోట్ల నజరానాను ప్రకటించారు. హర్యానాలోని పానిపట్ జిల్లాకు చెందిన వారు నీరజ్ చోప్రా. 2012లో అండర్ 16 జాతీయ చాంపియన్గా నిలిచారు. 2015లో జాతీయ జూనియర్ చాంపియన్షిప్లో విజేతగా నిలిచారు. ప్రపంచం అండర్ 20 చాంపియన్షిప్లో జావెలిన్ను ఏకంగా 86.48 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. బల్లెన్ని 87.58 మీటర్ల దూరం విసిరి పసిడిని కైవసం చేసుకున్నారు. ఒలింపిక్స్లో ఇండివిడ్యువల్ గోల్డ్ మెడలిస్ట్లో అభినవ్ బింద్రా తర్వాత రెండో అథ్లెటి నీరజ్ చోప్రా.
నీరజ్ చోప్రాకు ఖర్చు ఎంత?
టోక్యో ఒలింపిక్స్లో బంగారం పతకం నెగ్గిన 23 ఏళ్ల నీరజ్ చోప్రా కోసం భారత ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం ఈ ఒలింపిక్స్కు 450 రోజుల పాటు నీరజ్ చోప్రా విదేశాల్లో శిక్షణ తీసుకోవడానికి, పోటీల్లో పాల్గొనడానికి కేంద్రం రూ.4,85,39,638 ఖర్చు చేసింది. నీరజ్కు రెండేళ్ల క్రితం మోచేయి ఆపరేషన్ జరిగిన తర్వాత అతనికి వ్యక్తిగత కోచ్గా డాక్టర్ క్లాస్ బార్టోనియెట్జ్ను నియమించారు. అతనికి ప్రభుత్వం రూ.1,22,24,880 కోట్లు చెల్లించింది. నీరజ్ కోసం కొనుగోలు చేసిన నాలుగు జావెలిన్స్ ఖర్చు రూ.4,35,000. ఒలింపిక్స్కు కొద్ది రోజుల ముందు 2021లో నీరజ్ యూరోప్ టోర్నీ కోసం 50 రోజులపాటు స్వీడన్లో ఉండేందుకు ప్రభుత్వం రూ.20 లక్షల వరకు ఖర్చు చేసింది. కేంద్రం వెన్నుతన్నుగా నిలవడంతో నీరజ్ బారత జెండాను రెపరెపలాడించాడు.