ఏడాదిలో ఒక స్టాక్ 155% పెరిగింది. అమ్మలా... కొనాలా... అనలిస్టులు ఏమంటున్నారు?
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి ఏదైనా ఒక స్టాక్ ఒక ఏడాదిలో 100% రిటర్న్స్ ఇచ్చింది అంటే పండగే. కానీ అప్పుడు ఒక డౌట్ కూడా మొదలవుతుంది. ఆ స్టాక్ ఇంకా పెరుగుతుందా... లేదంటే పతనం అవుతుందా... దాన్ని హోల్డ్ చేయాలా లేదంటే అమ్మేయాలా అనే అనేక అనుమానాలు ఇన్వెస్టర్ ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్ల కు ఇదో పెద్ద తలనొప్పిలా కనిపిస్తుంది. ఒక స్టాక్ నిజంగా 100% రాబడి అందించటం చాలా అరుదు.
అది కూడా ఒక ఏడాదిలోనే అంతలా పెరిగితే ఇంకా అద్భుతమని చెప్పాలి. సరిగ్గా అలాగే జరిగింది ఒక స్టాక్ విషయంలో. ఐసీఐసీఐ బ్యాంకు అనుబంధ సంస్థ ఐన ఐసీఐసీఐ సెక్యూరిటీస్ కంపెనీ షేర్లు ఒక్క ఏడాదిలోనే 155% పెరిగాయి. ఫిబ్రవరి 19న కొత్త గరిష్ఠానికి చేరుకొని రూ 514.80 వద్ద క్లోజ్ అయ్యాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నా కూడా 22.83% వృద్ధి చెందాయి.
అయినా కూడా ఈ కంపెనీ 2018ఏప్రిల్ లో ఐపీవో కు వచ్చినప్పుడు దాని షేర్ల ఇష్యూ ప్రైస్ రూ 520 కంటే తక్కువే ఉండటం గమనార్హం. ఈ విషయాన్ని ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. ఈ కంపెనీ షేర్ల పెరుగుదలపై ఇన్వెస్టర్లు ఏం చేయాలి అనే అంశంపై అనలిస్టులు ఏం చెప్పారో.. వాస్తవానికి ఏం జరిగిందో ఒక సారి చూద్దాం.
SIP రిటర్న్స్: రూ.300 ఇన్వెస్ట్తో కోటీశ్వరులు కావొచ్చు!
లాభం పెరిగింది...
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ గతేడాది డిసెంబర్ తో ముగిసిన త్రైమాషికంలో మెరుగైన పనితీరును కనబరిచింది. ఆ క్వార్టర్ లో కంపెనీ లాభం 36% పెరగ్గా.. ఆదాయం 4% వృద్ధి చెందింది. అంతక్రితం వరుసగా నాలుగు త్రైమాషీకాల్లో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఆదాయం, లాభాలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే, ఒకవైపు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పనితీరుపై ఆశాజనక అంచనాలు వెల్లడించిన ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ హెచ్ డీ ఎఫ్ సి సెక్యూరిటీస్... జనవరి 21న ఈ కంపెనీ షేర్లను విక్రయించవచ్చు అని ఇన్వెస్టర్లకు సూచించింది. కాగా, 2021, 2022 ఆర్థిక సంవత్సరాలకు గాను ఐసీఐసీఐ రాబడిపై మెరుగైన అంచనాలు వెల్లడించింది.
అమ్మాలని సూచించిన సిటీగ్రూప్...
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పై అధ్యయనం చేసిన సిటీగ్రూప్ గ్లోబల్ మర్కెట్స్ అనే సంస్థ కూడా దాని షేర్లను విక్రయించాలని సూచించింది. ఈ కంపెనీ పై తన సెల్ రేటింగ్ ను జనవరి 10న ప్రకటించింది. టార్గెట్ ప్రైస్ రూ 350 గా సూచించింది. కొత్త కస్టమర్ల నమోదు, ఉత్పత్తుల వ్యూహాలే ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పనితీరును ప్రభావితం చేస్తాయని పేర్కొంది. 21 ఎర్నింగ్స్ వద్ద ఐసీఐసీఐ సెక్యూరిటీస్ షేర్ల విక్రయం సరైన నిర్ణయం అని ఇది ప్రకటించింది. కానీ కంపెనీ షేర్లు మాత్రం పరుగులు పెట్టడం విశేషం.
కొనొచ్చు అని చెప్పిన ఆంటిక్ ...
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ షేర్లపై ఆంటిక్ కాపిటల్ అనే సంస్థ మాత్రం పాజిటివ్ రివ్యూ చేసింది. ఈ కంపెనీ తన గత పనితీరు, గొప్ప విజయాలకు పరిమితం కాకుండా కొత్తదనంతో ముందుకు పోతోందని పేర్కొంది. భారత దేశంలో నెంబర్ 1 రిటైల్ బ్రోకరేజ్ మాత్రమే కాకుండా... ఒక ఫైనాన్సియల్ సూపర్ మార్కెట్ గా రూపాంతరం చెందుతోందని కొనియాడింది. దీంతో ఐసీఐసీఐ షేర్ల ను రూ 450 టార్గెట్ తో కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఆంటిక్ కాపిటల్ ఈ అంచనాలు డిసెంబర్ 19 న వెల్లడించింది. సరిగ్గా ఇది ఊహించినట్లుగానే ఐసీఐసీఐ షేర్లు పెరగటం విశేషం. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఐపీవో కు వచ్చినప్పుడే దాని విలువ అధికంగా ఉందని పలువురు అనలిస్టులు హెచ్చరించారు. గత ఏడాది కాలం నుంచి మాత్రం కంపెనీ షేర్లు మెరుగైన పనితీరుని కనబరుస్తున్నాయి. అనలిస్టుల అంచనాలు మించి షేర్లు పరుగులు పెడుతున్నాయి. అయితే, ఇప్పుడు ఈ షేర్ల ను కొనుగోలు చేసేందుకు రిటైల్ ఇన్వెస్టర్లు నిపుణుల సలహా మేరకు ముందుకు సాగితే మేలని విశ్లేషకులు చెబుతున్నారు.