Rythu Bharosa: గుడ్ న్యూస్.. రైతుల ఖాతాల్లో రూ.42 వేలు జమ..!
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేస్తోంది. తాజాగా ఆరో విడత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసింది. 7 ఎకరాల లోపు సాగు భూమి ఉన్న లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను జమ చేసింది. 92,729 మంది అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.354.96 కోట్లను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) పద్ధతిలో నేరుగా జమ చేసినట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే వరకు రైతు భరోసా కింద రాష్ట్రవ్యాప్తంగా 68.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,490.72 కోట్లు జమైనట్లుగా అధికారులు ప్రకటించారు.
శనివారం ఐదో విడత రైతు భరోసా నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. ఐదో విడతలో భాగంగా 5 నుంచి 6 ఎకరాల లోపు ఉన్న రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.545.41 కోట్లను జమ చేశారు. ఐదో విడతలో 1.69 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. శుక్రవారం నాల్గో దఫా రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ విడతలో 4.41 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.1188 కోట్లు జమ చేశారు. మూడో విడతలో భాగంగా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో రూ.1,330 కోట్లను జమ చేశారు. ఈ విడతలో 6.39 లక్షల మంది రైతులు లబ్ధి పొందినట్లు వివరించారు.

జూన్ 30 తెలంగాణ ప్రభుత్వం మొదటి విడత రైతు భరోసా నిధులు విడుదల చేసింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మంత్రులు నిధులు విడుదల చేశారు. మొదటి దశలో భాగంగా రెండు ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482 కోట్లను జమ చేశారు. బుధవారం రెండో విడతలో భాగంగా 2 నుంచి మూడు ఎకరాలు ఉన్న 10.68 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో దాదాపు రూ.1590 కోట్లు జమ అయింది. 26.50 లక్షల ఎకరాలకు రెండో విడత రైతు భరోసా విడుదల చేశారు. రైతు భరోసా కింద మొత్తం రూ.9 వేల కోట్లను దశలవారీగా 73.32 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.
రైతు భరోసాతో రైతులకు చెల్లిస్తున్న మొత్తం క్రమంగా పెరుగుతోంది. ఈ మొత్తం వ్యయంలో 2018 నుంచి 2023 వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు రూ. 50,250 కోట్లు పంపిణీ చేయగా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు మరో రూ. 23,070 కోట్లను విడుదల చేశారు. పథకం కింద ప్రభుత్వం రైతులకు అందించిన మొత్తం నిధుల పంపిణీ ఏకంగా 46 శాతం పెరిగి రూ. 73,320 కోట్లకు పెరిగింది.


Click it and Unblock the Notifications